బండి సంజయ్ తీరు మరీ విడ్డూరం. అయిదు లక్షల ఉద్యోగాలిస్తానన్నారని కేసీఆర్ మీద విమర్శ చేస్తారు. ఆ మాట ఎప్పుడన్నారు? ఎక్కడన్నారు? అనే ప్రశ్నకు ఆయన జవాబివ్వరు. మరీ బరితెగించి.. ఉద్యోగాలివ్వకపోతే బడితె పూజ చేయిస్తానని వీధిరౌడీ మాటలు మాట్లాడతారు. ఉన్నత రాజకీయ విలువలు నెలకొల్పి అన్ని పార్టీలతో రాజనీతికోవిదుడు అనిపించుకున్న వాజపేయి వంటి గొప్ప నాయకుడు స్థాపించిన బీజేపీ ఆఖరుకు ఇలాంటి వారి పాలైంది.
పాపం పొలిటికల్ మైలేజీ కోసం సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర అంటూ ఓ ప్రహసనం చేశారు. ఆదేం ఖర్మో ఆయన రాష్ట్రంలో ఏ ప్రాంతంలో పర్యటించినా ఆ ప్రాంతమంతా నీరు, పచ్చదనమే దర్శనమిచ్చింది. ఆ పచ్చని పొలాల్లోనే పర్యటించి రావాల్సి వచ్చింది. కాకపోతే ముందస్తుగా ఏర్పాటు చేసుకున్న మనుషులతో కష్టాలు చెప్పించుకొని బీజేపీ ప్రభుత్వం వచ్చాక సమస్యలు పరిష్కారం అంటూ హామీ పారేసి వచ్చారు. ఆ మధ్య కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఇక్కడకు వచ్చి‘ తెలంగాణ కేసీఆర్ కుటుంబం పాలైంది’ అంటూ బాధ పడ్డారు. ఆవిడేదో తెలంగాణ ఉద్యమమంతా భుజాన మోసినట్టు.. ఎన్నో త్యాగాలు చేసి కష్టపడ్డట్టు. అంతేగాదు.. కుటుంబాలు వాటి విలువలు, అనుబంధాల గురించి ఇక ఆవిడే చెప్పాలి. ఆ మధ్య కిషన్రెడ్డి ప్రెస్మీట్ పెట్టి రాష్ట్రంలో నకిలీ విత్తనాలు అరికట్టడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు. టీఆర్ఎస్ నాయకుల అండదండలతో నకిలీ బాగోతం నడుస్తున్నదన్నారు. ఆయన నోటి చలువ ఏమిటోగానీ రెండు నెలలు గడవక ముందే నిజామాబాద్ జిల్లాలో బీజేపీ నేత ఒకరు నకిలీ విత్తనాలతో రైతులను కోటికి పైగా ముంచి పోలీసులకు దొరికిపోయాడు. ఇపుడు ఊచలు లెక్క పెడుతున్నాడు.