స్వాతంత్య్రానంతరం మన దేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఏండ్లు పాలించింది. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దేశాన్ని కొన్నేండ్లు పాలించింది. ఈ రెండు జాతీయ పార్టీలే భారతదేశాన్ని ‘నువ్వా.. నేనా..’ అన్నట్టుగా విభజించుకొని మరీ పాలిస్తున్నాయి. అయితే అధికారం కోసం మాత్రమే ఆరాటపడే ఈ రెండు జాతీయ పార్టీలు ఇన్నేండ్లయినా దేశంలో వ్యవసాయరంగ అభివృద్ధి దిశగా నిర్ణయాలు తీసుకోకపోవడం శోచనీయం. రైతు సంక్షేమం దిశగా విధి విధానాలు రూపొందించకపోవడం విడ్డూరం.
దేశంలో మరో రెండు, మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఎప్పటిలాగే ఈ ఎన్నికల్లోనూ లబ్ధిపొంది అధికారాన్ని చేజిక్కించుకోవాలని జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు తహతహలాడుతున్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్లో జాతీయ సమావేశం నిర్వహించింది. హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. కనీసం ఈ సమావేశాల్లోనైనా ఈ రెండు జాతీయ పార్టీలు వ్యవసాయరంగాభివృద్ధిపై, రైతుల సంక్షేమం గురించి ఒక్క నిమిషం కూడా చర్చించకపోవడం ఈ పార్టీలకు రైతుల పట్ల, దేశ వ్యవసాయరంగం పట్ల ఉన్న వ్యతిరేకతను తెలియజేస్తున్నది.
Farmers | దేశంలో వ్యవసాయ రంగాభివృద్ధి, రైతుల సంక్షేమం, కనీస మద్దతు ధర పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధి విధానాలపై ఇటీవల ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ల చైర్మన్ చెంగల్రెడ్డితో సమగ్రంగా చర్చించాను. నాకు, ఆయనకు మధ్య జరిగిన చర్చను మీ ముందుకు తెచ్చే ప్రయత్నమే ఈ వ్యాసం.
దేశవ్యాప్తంగా సాగు పరిస్థితి సన్నగిల్లింది. వ్యవసాయ రంగం చిన్నాభిన్నమైంది. వ్యవసాయం అంటే చాలు రైతులు వెనుకడుగు వేస్తున్నారు. అన్నదాతలు సాగు చేసేందుకు భయపడుతున్నారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో పంటలు పండించటం నిలిపివేశారు. వ్యవసాయం చేస్తున్న కొందరు రైతులు సాగు లాభసాటిగా లేదంటూ పెదవి విరుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వమేమో మద్దతు ధర ప్రకటిస్తున్నామని గొప్పలకు పోతున్నది. దేశంలోని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలేమో రైతులు పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేస్తున్నామంటున్నాయి. అయినా రైతులు ఎందుకు సంతోషంగా లేరు. వ్యవసాయం ఎందుకు లాభసాటిగా ఉండటం లేదు? ఈ ప్రశ్నకు జవాబు రైతులకు తెలియదు! మేధావులకు అర్థం కాదు! కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవు!
దేశానికి ఏటా ఎంతమంది డాక్టర్లు, ఎంతమంది ఇంజినీర్లు కావాలో ప్రభుత్వాలు, వర్సిటీలు నిర్ణయిస్తాయి. దవాఖానలు, హోటళ్లు, సిమెంట్, స్టీల్ పరిశ్రమల యజమానులు అవసరం మేరకు ఏర్పాటు చేసుకుంటారు. కానీ, మన దేశంలో ఏ పంట ఎంత పండించాలి?ఎంత నిల్వ చేయాలి? ఎంతమేరకు పరిశ్రమలకు వాడాలి ? ఎంత ఎగుమతి చేయాలి? తదితర అంశాల గురించి నేటివరకూ ఎటువంటి ప్రాతిపదిక లేదు. వ్యవసాయ ఉత్పత్తి, ప్రణాళికలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేకపోవడమే దీనికి ప్రధాన కారణం.
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి వ్యవసాయాభివృద్ధి, రైతుల సంక్షేమం అంటే రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని అందరి అభిప్రాయం. రాష్ట్ర ప్రభుత్వాలు పంట పండించేందుకు అవసరమైన నీరు, కరెంటు, రుణాలు, విత్తనాలు, సదుపాయాలు కల్పించాలి. ఇటువంటి వసతులు కల్పించిన తెలంగాణ తొలి ప్రభుత్వం తన బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చింది.
వ్యవసాయరంగంపై ఆధారపడిన దేశం మనది. అందుకే ఆ రంగాన్ని కాపాడుకునేటందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక ప్రాజెక్టులు నిర్మించి రైతులకు సాగునీరు అందుబాటులోకి తీసుకువచ్చారు. రైతులకు 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్తునందించారు. గతంలో ఏ కేంద్ర ప్రభుత్వం కానీ, దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టని విధంగా ఒక బృహత్తర ‘రైతుబంధు’ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద రైతులకు పెట్టుబడి సహాయం చేశారు. తక్కువ ధరకే ఎరువులను అందుబాటులోకి తీసుకువచ్చి రాష్ట్రంలో ఉన్న ఎరువుల కొరతను తీర్చారు. రైతులకు సకాలంలో ఎరువులను అందించారు. కనీస వడ్డీతో రైతులకు బ్యాంకు రుణాలందించారు. దీంతో తెలంగాణ రైతులు వ్యవసాయం వైపు మొగ్గు చూపారు. తెలంగాణ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు వలసలుపోయిన రైతులు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాష్ర్టానికి వాపస్ వచ్చారు. కానీ, గత నెల రోజుల కాంగ్రెస్ పాలనను పరిగణనలోకి తీసుకున్నట్టయితే రాష్ట్రంలో వ్యవసాయ పరిస్థితులు తారుమారయ్యాయి. ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో ‘రైతుబంధు’ డబ్బులు జమకాకపోవడమే దీనికి తాజా ఉదాహరణ. ఒక్క తెలంగాణ అనే కాదు, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతికూల నిర్ణయాల వల్ల దేశవ్యాప్తంగా రైతుల పరిస్థితి డోలాయమానంలో చిక్కుకున్నది.
రైతు పండించిన పంటకు అధిక ధర రావటానికి, నాణ్యత పెంచడానికి, ఎగుమతి చేయటానికి అవసరమైన చర్యలు తీసుకోవటం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వాలు అనేక రైతు వ్యతిరేక విధానాలను రూపొందించి వ్యవసాయ ఉత్పత్తులు అంతర్జాతీయ స్థాయికి చేరకుండా అడ్డుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం రైతులను అణగదొక్కడానికి విధానాలు రూపొందించి వ్యవసాయాభివృద్ధిని అడ్డుకుంటున్నదనే విషయం చాలా మందికి తెలియదు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయిస్తుంది కానీ, అది శాస్త్రీయ పద్ధతిలో ఉండదు. ధరల నిర్ణయ కమిటీకి స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వాలని 30 ఏండ్ల నుంచి చేస్తున్న ప్రయత్నాన్ని కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు అడ్డుకున్నాయి. పురుగుమందుల ధరలను అదుపు చేయటానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించలేదు. వీటిపై 18 శాతం పన్ను విధించింది. డీజిల్ ధర 100 శాతం పెంచింది. దీర్ఘకాలిక ఎగుమతులకు విధానాన్ని రూపొందించలేదు. ప్రస్తుతం దేశంలో 10 కోట్ల టన్నుల గోధుమలున్నా ఎగుమతిపై నిరంతరం అభ్యంతరాలు తెలియజేస్తూ ఆంక్షలు విధిస్తున్నది. జన్యుమార్పిడి పంటలను భారత రైతులకు అందుబాటులోకి తీసుకురావడం లేదు. అమెరికా, బ్రెజిల్ తదితర దేశాల్లో రైతులు పండించిన, జన్యుమార్పిడి సోయా తదితర పంటల దిగుమతులకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.
భారత ప్రభుత్వం పప్పు దినుసుల దిగుమతులకు ఆఫ్రికా దేశాలతో దీర్ఘకాలిక ఒప్పందం చేసుకున్నది. బియ్యం, గోధుమలు, తదితర పంటలను ఎగుమతి చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు దీర్ఘకాలిక ప్రణాళికలను రచించకపోవటం గమనార్హం. రక్షణ, ఆరోగ్య, రవాణా, తదితర రంగాల్లో అంతర్జాతీయ పరిశ్రమలకు కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. కానీ, వ్యవసాయ రంగంలో ఇతర దేశాల్లో అందుబాటులో ఉన్న ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత రైతులకు అందుబాటులోకి రానీయకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడం బాధాకరం.
గత ప్రభుత్వాలు చేసిన ఈ లోపాల వల్ల ఉత్పత్తి అంతర్జాతీయ స్థాయిలో లేదు. నాణ్యతలో అనేక లోపాలున్నాయి. వ్యవసాయాన్ని అంతర్జాతీయంగా పెంచడానికి అవసరమైన సాంకేతిక విజ్ఞానాన్ని, పరికరాలను రైతులకు అందుబాటులో ఉంచడానికి గత 30 ఏండ్లలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇందుకు ప్రధాన కారణాలేమంటే జాతీయ పార్టీల నాయకత్వానికి వ్యవసాయ అభివృద్ధి, రైతుల సమస్యల పట్ల అవగాహన లేకపోవడమే. కేంద్ర ప్రభుత్వ ఎగుమతి, దిగుమతుల విధానాలను దేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలు ప్రభావితం చేస్తారు. దీనికి నిదర్శనం చక్కెర ఎగుమతి, దిగుమతులు, నూనె దిగుమతుల విధానాలు.
ప్రస్తుతం అధికంగాఉత్పత్తి చేసి పతనమవుతున్న రైతుల సమస్యలను పరిష్కరించాలంటే దేశంలో పంటల వారీగా ప్రణాళికలు తయారుచేయాలి. ఈ ప్రణాళికలు జిల్లాలు, రాష్ర్టాల వారీగా, దేశ స్థాయిలో తయారుచేసి అమలుచేయాల్సిన అవసరం ఉన్నది. వీటిని రూపొందించటంలో శాస్త్రవేత్తలు, పరిశ్రమల ఎగుమతిదారులతో కలిసి చర్చించాలి. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లు ఇలాంటి ప్రణాళికలు తయారుచేసి అమలుచేస్తాయనే నమ్మకం దేశంలోని ఏ ఒక్క రైతుకూ లేదు. ప్రాంతీయ పార్టీలు వ్యవసాయ కేంద్రీకృత ఆర్థిక విధానాన్ని రూపొందించగలిగితే.. తప్పకుండా దేశంలో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి ప్రణాళిక రాజకీయంగా ప్రాంతీయ పార్టీల మధ్య ఐక్యతను పెంచేందుకు కూడా ఉపయోగపడుతుంది.
-బోయినపల్లి వినోద్ కుమార్
(పార్లమెంట్ మాజీ సభ్యులు,రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షులు)