అంతా అయిపోయింది. అంధజ్యోతి రాధాకృష్ణ అన్ని హద్దులూ దాటిండు. వంద తప్పులు ముగిసినయి, పోయిన ఆదివారం ‘చెత్తపలుకు’తో! ప్రతిసారీ అనుకుంటా ఆయన పరమ వికారపు రాతలను, వల్గర్ మనస్తత్వాన్ని ఇగ్నోర్ చేద్దామని. వల్లకావడం లేదు! ఎంత విషం, ఎంత విద్వేషం తెలంగాణపైన, బీఆర్ఎస్ పార్టీ పైన! తెలంగాణపై యుగాలనాటి పగ ఏదో ఉన్నట్టుగా రగిలిపోతున్నడు రాధాకృష్ణ.
పత్రికాధిపతులు ప్రభుత్వాలను తమ చెప్పుచేతల్లో ఉంచుకోవాలని చూడడం గతంలోనూ జరిగింది తెలుగునాట. వారి ఆటలు కొంతకాలం సాగినా, దాదాపు అందరూ ఫెయిలయ్యారు. అలాంటి సందర్భాల్లో వారి ‘మీడియాస్వేచ్చ’ ఆక్రోశాన్ని ‘మాయాబజార్’లో కౌరవహతకుల హాహాకారాలు కర్ణపేయంగా ఆస్వాదించిన ఘటోత్కచుడు మాదిరి నేను కూడా 1980 దశ కం నుంచీ ఆ వినోదాన్ని చూస్తున్న. ప్రభుత్వ విధానాల అమలులో లోపాలను ఎత్తిచూపే బృహత్తర కర్తవ్యం ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియాది. నేడు తెలంగాణలో పలు మీడియా సంస్థలు ప్రభు త్వ విధానాలను విమర్శిస్తున్నాయి. ఆ స్పేస్ ఉన్న ది. దానికి కారణం ఈ నేల చైతన్యం, ఇక్కడి పౌరసమాజపు విచక్షణ, ఆ నేపథ్యంలోనుంచి వచ్చిన నాయకుల రాజ్యాంగబద్ధ నడవడిక. తెలంగాణ మూలాలు లేని ఎందరో మీడియా హౌస్లు నడుపుతున్నరిక్కడ, రాజకీయ పార్టీలు కూడా నడుపుతున్నరు. వారెవ్వరినీ తెలంగాణ గుండెలోతుల్లోంచి అసహ్యించుకోవడం లేదు. ఒక్క రాధాకృష్ణను తప్ప!
‘నాదీ తెలంగాణే’ అనే ఆయన మాటల డొల్లదనం ప్రతి తెలంగాణ బిడ్డకూ తెలుసు. అద్దం ముందు నిలుచుంటే తానెంత అడ్డంగా వాగుతడో తనకే అర్థం అయ్యేటంత బరిబాతల వ్యవహారం రాధాకృష్ణది. ఎంత నైచ్యం కాకపోతే ముఖ్యమం త్రి ప్రైవేట్ సంభాషణల్లో కమ్మ సామాజికవర్గాన్ని ‘దూషిస్తారు’ అని రాస్తాడా? కమ్మ సామాజికవర్గాన్ని కేసీఆర్ పై, బీఆర్ఎస్ పై ఉసిగొల్పితే ఏ పార్టీకి ప్రయోజనమో తెలియనంత అమాయకులం కాము ఈ నేలబిడ్డలం. ఆంధ్రప్రదేశ్ను సర్వనాశనం చేసిన మీ కులపిచ్చి ఇక్కడ చెల్లదు. కమ్మ ప్రజలు స్వతంత్ర తెలంగాణలో హాయిగా ఉన్నరు. సాధారణ పౌరులుగా, పలు పార్టీల కార్యకర్తలుగా, నాయకులుగా, కార్పొరేటర్లుగా, మంత్రులుగా తెలంగాణ అభివృద్ధిలో గణనీయమైన పాత్ర పోషిస్తున్నరు. ఆంధ్రప్రదేశ్ పాలక, ప్రతిపక్ష అధినేతలు సహా అందరూ ఈ గడ్డపై తల్లిఒడిలో మాది రి సేఫ్గా ఉన్నరు. అంతటి సహృదయ తెలంగాణకు కుల రంగు పూయాలని చూస్తున్నడు రాధాకృష్ణ. కేసీఆర్ హిస్టరీని, జాగ్రఫీని సృష్టించిన నేత. దేశం లో మరోచోట కానరాని అభివృద్ధి-సంక్షేమ-ఆత్మగౌరవ పథంలో తెలంగాణను జగజ్జేగీయమానంగా నడుపుతున్న స్టేట్స్మన్ ఆయన.
మరోసారి చెప్తున్నం. విధానాలలో లోపాలను రాయండి. ప్రజాసంక్షేమానికి పా టుపడని నాయకులు ఎవరి గురించైనా కథనాలు కూర్చండి. కానీ…మీ ఆటలు సాగడం లేద ని, మీ గొంతెమ్మ కో రికలు తీరడం లేద ని, మీడియా ట్యాగ్ అడ్డుపెట్టుకుని అడ్డంపొడుగు మాట్లాడుతమంటే సహించేది లేదు. అందునా, మీ కులాధారిత రాజకీయ అజెండా కోసం విచ్చలవిడితనానికి దిగుతానంటే కర్రు కాల్చి వాతలు పెడుతది తెలంగాణ. చెవియొగ్గి వినండి రాధాకృష్ణా… మీరు మీడియా కాదు, పాడూ కాదు. వ్యక్తి కేంద్రక, కుల కేంద్రక, ఆర్థిక, అధికార యావగల అష్టవంకర్లు తిరిగిన ఒక మనిషి మీరు! నడువవ్ ఇక మీ దుర్మార్గాలు.
ఈ వ్యాసం చదువుతున్న ప్రజాస్వామికవాదులకు, మీడియా స్వేచ్ఛాప్రియులకు విజ్ఞప్తి. మేము వేరే ఏ ఇతర మీడియా యాజమాన్యాలనూ అనడం లేదు. ఒక్క రాధాకృష్ణనే ఎందుకు అంటున్నమో ఆలోచించండి. మీడియా ముసుగులో ఈయన చేసే అకృత్యాలను గమనించండి.
‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి రాజకీయ లబ్ధి కూడా పొందాలనుకుంటే కాంగ్రెస్ నాయకులను ముందు పెట్టి పోరాటం చేయాల్సిందిగా సూచించాల్సింది. ప్రత్యేక రాష్ట్రంకోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతోందని ప్రజల్లో నమ్మకం ఏర్పడ్డాక తెలంగాణ ఇచ్చి ఉంటే మీరు తెలివిగా ఆలోచించారని నమ్మేవాళ్లం.’ ఇదీ జైరాం రమేశ్తో తాను మాట్లాడిన విషయం అంటూ నిర్లజ్జగా రాసుకున్నడు రాధాకృష్ణ. మీడియాకు రాజకీయ పార్టీలతో ఏం పని? పత్రికా స్వే చ్ఛ అంటే ఏ పార్టీలను ఎట్లా తొక్కాలో సలహాలు ఇవ్వడ మా? అమిత్ షా ప్రైవేట్గా వచ్చి ఎందుకు కలుస్తడు మిమ్మల్ని? ఏ కుతంత్రాలలో మీరు భాగస్వాములయిన్రు? కేసీఆర్ ఏ నాయకుడిని దగ్గరకు తీయాలో, ఎవరికి టికెట్ ఇవ్వాలో మీడియాకు ఏం సంబంధం? మీరు మీడియానా, మట్టిగడ్డలా?
ఒక్క మీరు తప్ప తెలంగాణలో ఇంకొక మీడి యా సంస్థ ఏదైనా ఇట్లా తెగబడుతున్నదా? ఎందుకు సహించాలి మిమ్మల్ని? తెల్లారి లేస్తే తెలంగాణపై దుమ్మెత్తి పోసే కీలుబొమ్మలకు ప్రభుత్వ సాయం అందదు అంటే తప్పయితదా? ముఖ్యమంత్రి కాబట్టి ఆయన అక్కడికీ సంయమనంతోనే మాట్లాడిన్రు. తెలంగాణ ఆర్మీకి ఆ కట్టుబాట్లు ఉండవ్! డొక్క చించి డోలు కడుతం, నకరాల్ ఆగకపోతే!
తన మానస సహోదరుడైన చంద్రబాబు నా యుడు సుద్దపూస అయినట్టు… ఇపుడు ఇతరులకు నీతులు చెప్తున్నడు రాధాకృష్ణ. శరద్పవార్ పేరుతో కేసీఆర్పై వ్యక్తిత్వహననానికి పాల్పడ్డాడు! ఎన్నో త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ తొట్టతొలి ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు చేసి అడ్డంగా దొరికిపోయిన నేటి పీసీసీ అధ్యక్షుడు ప్రజాస్వామ్య మేరుశిఖరంలా కనిపిస్తున్నడు రాధాకృష్ణకు. రేవంత్ పాలనలో చంద్రబాబు హయాం రావాలని పగటి కలలు కంటున్నడు. కాబట్టే కండకావరంతో కేసీఆర్పై, తెలంగాణపై దాడికి తెగబడుతున్నడు.
మొన్న ప్రతి అక్షరంలో కేసీఆర్పై హాలాహలం చిమ్మిన రాధాకృష్ణ ఈ స్థాయిలో ఎప్పుడన్నా చంద్రబాబు గురించి రాయగలడా? కులకట్టుబాటు ఒప్పుకోదు అనుకుందాం. మరి మోదీ గురించి రాయగలడా? లేదే? మరి ఎందుకు ఈ సెలెక్టివ్ విష ప్రవాహం? ఎందుకంటే, ఆయన చెప్పినట్టల్లా కేసీఆర్ వినరు కాబట్టి. ఈయన చెప్పిన మాటలు విని చంద్రబాబు పరిస్థితి ఏమయిందో తెలుసు కదా? బ్రోకర్ల మాటలు విని బాగుపడ్డ నాయకుడు ఎవరైనా ఉన్నారా?
కేటీఆర్ను కూడా మోసం చేయగలడు కేసీఆర్ అని రాసే ఇతను మనిషేనా అసలు? కులాలకు, పార్టీలకు, ప్రాంతాలకు, చివరకు తండ్రికొడుకులకు కూడా వైమన స్యం సృష్టించేది జర్నలిజమా? పసిగుడ్డు తెలంగాణపై ఆనాడు మీ వెకిలి కథనాలు భరించలేకనే కదా సమాజం మీపై ఆంక్ష లు విధించింది. ఒక్కరంటే ఒక్క తెలంగాణ బిడ్డ అయ్యోపాపం రాధాకృష్ణ అన్నరా?
కేసీఆర్ అండ్ కో, జగన్ అండ్ కో లాంటి భాష తప్ప ఏమాత్రం నైసిటీస్ ఉండవు రాధాకృష్ణకు. ఎదురుగా మహిళలా, మహనీయులా అని కూడా చూడకుండా అందర్నీ ఏకవచనంతో సంబోధి స్తూ… ‘ఎవరు ఎవర్ని గోకారు’ అంటూ వెకిలి జోకులు వేసే రాధాకృష్ణకు సంస్కారం ఎవరూ నేర్పలేరు. అది కాదు ఈ వ్యాసం ఉద్దేశం. తెలంగాణను, ప్రభుత్వాలను తన సొంత జాగీరు అనుకుంటున్నడు. ప్రజాస్వామ్యప్రియులంతా కలిసి ఆయనకు మంగళం పాడాల్సిందే.
ఆకుపచ్చ బతుకుల తెలంగాణపై కాటేసే చీడ అయిన ఓ రాధాకృష్ణా… ఇకనైనా బుద్ధి తెచ్చుకో. మీడియాకు కళంకం తేవద్దు. కులాలను ఉసిగొల్పకు. చరిత్రహీనుడిగా మారకు. ప్రతి ఆదివారమూ మీ వికార వాంతులను చూసి అసహ్యించుకుంటున్నది తెలంగాణ. ఎందరో రగిలిపోతున్నరు మీ రాతలకు. వారంతా ఒక్కటయ్యే ప్రమాదాన్ని మీరే సృష్టిస్తున్నరు.
తెల్లారి లేస్తే తెలంగాణ పురోగతిపై ఏడుపే తప్ప ఎపుడైనా అభినందించారా ఈ నేలను? అభినందన లేకపోగా, అడుగడుగునా హేళనలు, అవమానాలా? మీ అజెండా కేసీఆర్. ఆయనను దింపితే తెలంగాణను కబ్జా చేయవచ్చు. మీ తోడుదొంగలకు పంచి ఇవ్వవచ్చు. కాబట్టే ఈ వ్యాసం. తెలంగాణ ప్రజల ముందు మీ నగ్నత్వాన్ని వేయి దీపకాంతుల వెలుగులో చూపడమే లక్ష్యం.
అందర్నీ ప్రేమిస్తది తెలంగాణ. అట్లని అస్తిత్వంపై దాడి జరిగితే ఊకోదు. కత్తి ఎత్తుతది. తెలుసుకుని మసులుకో. ఖబడ్దార్!
జాతుల్ సెప్పుట సేవ చేయుట మృషల్ సంధించుటన్యాయ వి
ఖ్యాతిం బొందుట కొండెకాఁ డవుట హింసారంభకుం డౌటమి
థ్యాతాత్పర్యము లాడుటన్నియుఁ బరద్రవ్యంబు నాశించి యీ
శ్రీ తా నెన్ని యుగంబు లుండఁ గలదో శ్రీకాళహస్తీశ్వరా!
అంటారు ధూర్జటి. తన గురించి రాసిన ఈ పద్యం గురించి రాధాకృష్ణ ఏమంటారో మరి!
-శ్రీశైల్ రెడ్డి పంజుగుల
90309 97371