‘పిల్లల సంక్షేమం, విద్య కోసం వెచ్చిస్తున్న నిధులను మా ప్రభుత్వం ఖర్చుగా భావించడం లేదు… భవిష్యత్ తరాలు బాగుండాలన్న లక్ష్యంతోనే ఈ ఖర్చు చేస్తున్నాం… మన బిడ్డలు బాగుంటేనే మన భావి సమాజం బాగుంటుంది. అందుకే విద్య,విద్యార్థుల కోసం ఎంత ఖర్చుచేయడానికైనా వెనుకాడం’ అని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ దిశగా తన ప్రయాణం సాగిస్తుండటం ఆహ్వానించదగిన పరిణామం.
విద్య ద్వారానే జ్ఞాన సముపార్జన సాధ్యమవుతుంది. అలాంటి విద్య విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సర్కారు బడుల్ల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల కట్టడికి కొత్త చట్టం తేవాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఈ తాజా నిర్ణయం వెనుక ఉన్న అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తేనే విద్యారంగాన్ని పటిష్ఠం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నదో అర్థమవుతుంది. ఒక్కో మెట్టు ఎక్కుతూ విద్యారంగంలో ఉన్న అవాంతరాలను అధిగమిస్తున్నది. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అవిరళ కృషిచేస్తున్నది. నిజానికి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు సీఎం కేసీఆర్ కొన్నేండ్ల కిందటనే శ్రీకారం చుట్టారు. ‘విద్యారంగంలో తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్గా ముందుకువెళ్తున్నదని మాజీ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ 2018లో జరిగిన సెంట్రల్ అడ్వయిజరీ బోర్డ్ అన్ ఎడ్యుకేషన్ సమావేశంలో అభివర్ణించడమే మంచి ఉదాహరణ.
ఇదిలా ఉంటే.. మన ‘ఊరు మన బడి’ కింద ప్రభుత్వం రూ.7,289 కోట్లతో సర్కారు బడుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పైపై పనులకు మంజూరు ఇచ్చి చేతులు దులుపుకొన్న గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా శాశ్వత ప్రాతిపదికన ఉండేవిధంగా సౌకర్యాలు కల్పించాలని 2017-18లోనే ఈ ప్రక్రియ చేపట్టింది. ఇందుకు కావాల్సిన సమాచారాన్ని పకడ్బందీగా సేకరించేందుకుగాను పాఠశాల విద్యాశాఖ, సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఇంజినీర్ల ద్వారా వివరాలు సేకరించింది. ఇందుకోసం నాడే విద్యాశాఖ 24 అంశాలతో కూడిన ఫార్మాట్ తయారుచేసింది. ఆ మేరకు ఉన్నత పాఠశాలల్లో రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ (ఆర్ఎంఎస్ఏ) ఇంజినీర్లు ఉన్నత పాఠశాలల్లో సర్వే చేయగా, ఆర్వీఎం ఇంజినీరింగ్ అధికారులు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో సర్వే చేశారు. పాఠశాల విద్యాశాఖ తయారుచేసిన ప్రత్యేక ఫార్మాట్లో ఆయా పాఠశాలలకు కావాల్సిన అవసరాలను గుర్తించారు.
ప్రాథమిక విద్యారంగంలో మౌళిక సదుపాయాల కల్పనకు ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి. అంతేకాదు, పైవేటు పాఠశాలల ఫీజుల నియంత్రణ అంశంపై కూడా సీఎం కేసీఆర్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారని తల్లిదండ్రులు భావిస్తున్నారు.
జిల్లా, మండలం, గ్రామం పేరుతో పాటుగా పాఠశాల పేరు, కేటాయించిన కోడ్, అందులో ఉన్న పిల్లల సంఖ్య, కావాల్సిన అదనపు తరగతి గదులు, ప్రస్తుతం పాఠశాల పరిధిలో ప్రగతిలో ఉన్న పనులను గుర్తించారు. ఆయా పాఠశాలల్లో ప్రస్తుతం ఉన్న టాయిలెట్లు, అందులో పనిచేసేవి ఎన్ని, చేయనివి ఎన్ని, టాయిలెట్లను రోజు శుభ్రం చేస్తున్నారా లేదా, సదరు టాయిలెట్లకు నీటి సౌకర్యం ఉందా లేదా అన్న వివరాలను ఆ ఫార్మాట్లో పొందుపరిచారు. తాగునీరు సౌకర్యం ఉందా, లేదా..? అనే విషయాలు కూడా ఉన్నాయి. సదరు ఇంజినీర్లు సర్కారు బడులకు కావాల్సిన అన్నిరకాల మౌలిక సదుపాయాల అవసరాలను గుర్తించి ఆ ఫార్మాట్లో నమోదు చేశారు. వీటిన్నంటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ప్రస్తుతం ‘మన ఊరు మన బడి’ కింద ప్రభుత్వం రూ.7289 కోట్లు ఖర్చుచేయడానికి నిర్ణయించింది.
రాష్ట్ర ప్రభుత్వం బడిబాట నుంచి మొదలుకొని… పాఠ్యాంశాల దాకా పక్కగా ప్రణాళిక రచిస్తున్నది. విద్యార్థులు డ్రాపౌట్ కాకుండా ఉండేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా సన్నబియ్యంతో అన్నం, వారానికి నాలుగు సార్లు గుడ్లు, సకాలంలో ఉచితంగా పాఠ్యపుస్తకాలు, బట్టల పంపిణీ చేస్తున్నది. విద్యార్థినులకు హెల్త్ అండ్ హైజీన్ కిట్లను అందజేస్తున్నది. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాలను అమల్లోకి తీసుకువచ్చింది. కొత్తగా ఆరు వందలకు పైగా గురుకులాలను ఏర్పాటుచేసి.. ఒక్కో విద్యార్థిపై రూ.1,50,000 వరకు ఖర్చు చేస్తున్నది. గురుకులాల ద్వారా రెండున్నర లక్షలకుపైగా విద్యార్థులకు ఉచిత విద్యనందిస్తున్నది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల వల్ల గురుకులాల్లో అద్భుతమైన ఫలితాలు ఆవిష్కృతమయ్యాయి.
గురుకులాల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధన చేయడంతో పాటు పాఠ్యాంశాల బోధన, క్రీడలు, వ్యక్తిత్వ వికాసాలకు ప్రాధాన్యం ఇస్తున్నది. పాఠశాల నిర్వహణకు స్కూల్ గ్రాంట్లు, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాల ఆరంభంలోనే వాలంటీర్లు నియమించుకునే అవకాశం ఇచ్చింది. సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో దానిని పుణికిపుచ్చుకొని డిజిటల్ క్లాసులను విద్యార్థుల ముందుకుతెచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలో 8 వేల పైచిలుకు పాఠశాలల్లో డిజిటల్ క్లాసులు జరుగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో నిర్దిష్ట కాలంలో సిలబస్ పూర్తిచేయడం.. విద్యార్థుల పరిణతిని బట్టి వారికి అవసరమయ్యే విధంగా ప్రత్యేక తరగతులు నిర్వహించడం, పరీక్షలకు సన్నద్ధం చేయడం, బట్టీ విధానానికి స్వస్తి చెప్పించి సృజనాత్మకతకు పదునుపెట్టించడం.. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆంగ్ల మీడియంలో బోధనకు నిర్ణయించి పలుచోట్ల ఇప్పటికే అమల్లోకి తీసుకువచ్చింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పూర్తిస్థాయిలో ఆంగ్ల మాధ్యమాన్ని అమల్లోకి తేవాలని నిర్ణయించడం ముదావహం. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం విద్యారంగంలోనే చరిత్ర లిఖిస్తుందని మేధావులు, విద్యావేత్తలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండటం
గమనార్హం.
కడపత్రి ప్రకాశ్ రావు
80966 77022