తెలంగాణలో తదుపరి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి గతేడాది నవంబర్ 30న జరిగిన శాసనసభ ఎన్నిల్లో ఓటు వేసేందుకు ఓటర్లు తెల్లవారుజాము నుంచే క్యూకట్టారు. కాంగ్రెస్కు అనుకూలంగా ఓటు వేయాలని ప్రజలకు బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ పిలుపునిచ్చారంటూ తెలంగాణ కాంగ్రెస్ తన అధికారిక ట్విటర్ (ఎక్స్) పేజీలో పోస్ట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ అనధికారికంగా నిర్వహిస్తున్న వాట్సాప్ గ్రూపుల్లో దీన్ని విస్తృతంగా షేర్ చేసింది.
ఈ వ్యవహారం చివరికి పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాలో ముగిసింది. 5 లక్షల మందికి పైగా దీన్ని వీక్షించారు. అయితే అది ఫేక్ వార్త. వాస్తవానికి అది ఏఐ-జనరేటెడ్, పూర్తిగా అవాస్తవమైన ట్వీట్. కానీ, సాధారణ ఓటరు దాన్ని గుర్తించలేడు. ఓటింగ్ ప్రారంభం కావడంతో నష్ట నివారణ చర్యలు తీసుకోవడానికి బీఆర్ఎస్కు సమయం లేకుండాపోయింది. దాంతో బీఆర్ఎస్కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
చాకచక్యంగా, సమయానుకూలంగా సాగిన కృత్రిమమేధ సృష్టించిన డీప్ఫేక్ ఇటీవల వరుసగా జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో వివిధ పార్టీల విజయావకాశాలపై దెబ్బకొట్టింది. ఇదే రాబోయే సార్వత్రిక ఎన్నికలను మౌలికంగా ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. ఏప్రిల్లో జరగనున్న ఎన్నికల్లో తమ తదుపరి జాతీయ ప్రభుత్వాన్ని దాదాపు ఒక వంద కోట్ల మంది ఓటర్లు ఎన్నుకోనున్నారు.
2020 ఫిబ్రవరిలో ప్రచారం కోసం డీప్ ఫేక్ను ఉపయోగించిన ప్రపంచంలోనే మొదటి వ్యక్తిగా బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ నిలిచారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు హిందీ, హర్యాన్వీ, ఆంగ్లంలో ఓటర్లను ఉద్దేశించి తివారీ ప్రసంగించిన మూడు వీడియోలను విడుదల చేశారు. కేవలం హిందీ వీడియో మాత్రమే ప్రామాణికమైనది, మిగిలిన రెండు డీప్ ఫేక్స్. అతని స్వరం, పదాలను సృష్టించడానికి, అతని వ్యక్తీకరణలు, పెదవుల కదలికను మార్చడానికి కృత్రిమమేధను ఉపయోగించారు. మామూలుగా చూసినప్పుడు అవి నకిలీవని గుర్తించడం దాదాపు అసాధ్యం.
గత నవంబరులో మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో.. మోదీ, శివరాజ్సింగ్ చౌహాన్, కైలాష్ విజయ్వర్గియా, కమల్నాథ్ వంటి రాజకీయ నేతల మీద చేసిన డీప్ ఫేక్ వీడియోల సృష్టికర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. డీప్ ఫేక్లను జనరేట్ చేసే అనేక ఏఐ టూల్స్ ఉచితం కాగా, మరికొన్ని వీడియోకు పది రూపాయల కన్నా తక్కువకు సబ్స్క్రిప్షన్పై దొరుకుతున్నాయి. కృత్రిమమేధ ఉపకరణాల లభ్యత పెరగడంతో, ఓటర్లను ప్రభావితం చేయడానికి, అన్ని రాజకీయ పార్టీలు డీప్ ఫేక్లను ఉపయోగిస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ చేసే డీప్ ఫేక్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని గతేడాది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల పోలింగ్కు ముందు బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో తమ అనుచరులను పదేపదే హెచ్చరించారు. ఓటింగ్ రోజు ఉదయం కాంగ్రెస్ షేర్ చేసిన డీప్ ఫేక్ క్లిప్పై ఈసీఐకి వారు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది.
ఒక వ్యక్తిని నమ్మించి తప్పుదారి పట్టించినా, అతని మనసును మార్చినా, అది ఎన్నికల ప్రక్రియ స్వచ్ఛతను దెబ్బతీస్తుందని భారత మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్వై ఖురేషి అన్నారు. ఎన్నికల సమయంలో వదంతులు వ్యాపింపజేసే సమస్యను డీప్ ఫేక్స్ వెయ్యి రెట్లు తీవ్రతరం చేశాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భారత ప్రజాస్వామ్యానికి కలిగే నష్టాన్ని తగ్గించడానికి డీప్ ఫేక్లను రియల్ టైమ్లో తగ్గించాల్సిన అవసరం ఉందని ఖురేషీ అభిప్రాయపడ్డారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలకు దేశం సిద్ధమవుతున్న తరుణంలో పార్టీలు వినూత్నమైన, ప్రమాదకరమైన వ్యూహాల కోసం ఏఐ వైపు మొగ్గు చూపుతున్నాయి. రాజకీయం అంటే అవగాహనను సృష్టించడమే. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ (వాయిస్, వీడియో మాడ్యులేషన్) ద్వారా ఒక్క క్లిక్తో, ఒక్క నిమిషంలో ప్రజల అభిప్రాయాన్ని మార్చవచ్చు. పొలిటికల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మానిప్యులేటెడ్ కంటెంట్ గతంలో కంటే చాలా రెట్లు పెరుగుతుంది. ఏఐ ద్వారా ఓటర్లను తారుమారు చేయడాన్ని ఏ పార్టీ కూడా తప్పుగా భావించడం లేదు. ప్రచార వ్యూహంలో దీన్ని కూడా ఒక భాగంగా భావిస్తున్నాయి. డిజిటల్ అక్షరాస్యత తక్కువగా ఉండటం, వీడియోల వినియోగం పెరుగుతుండటంతో మనదేశంలో ఎన్నికల సమగ్రతకు పెనుముప్పు పొంచి ఉంది. ఓటర్లూ.. తస్మాత్ జాగ్రత్త!