‘జల్.. జంగల్.. జమీన్’ అని నిజాం సర్కార్ను ఎదిరించిన గోండు వీరుడు కుమ్రంభీం పుట్టినగడ్డ పులకించిపోతున్నది. ‘మావ నాటే మావ రాజ్’ నినాదానికి నిజరూపంగా తెలంగాణ నిలిచింది. ఆదివాసీ పోరాటయోధుడు కుమ్రంభీం నినాద నేపథ్యం నిజమైందని చెప్పటానికి జోడేఘాటే నిట్టనిలువు సాక్ష్యం.
తెలంగాణ ఉద్యమ సమయంలో జోడేఘాట్ నిశ్శబ్ద, నిషేధ ప్రాంతం. 2004 ఎన్నికల్లో బీఆర్ఎస్ (నాటి టీఆర్ఎస్)తో కాంగ్రెస్ పొత్తు. ప్రభుత్వంలో టీఆర్ఎస్ భాగస్వామ్యం. ఆ సమయంలో కుమ్రంభీం వర్ధంతి. జోడేఘాట్కు కుమ్రంభీంకు నివాళి అర్పించాలనేది ఉద్యమనేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం. ఆ సంకల్పాన్ని ఉమ్మడి రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ మంత్రిగా హరీశ్రావు జోడేఘాట్కు పయనం. ‘జోడేఘాట్కు వెళ్లటానికి వీళ్లేదు. రోడ్డు సరిగ్గాలేదు. పైగా పరిస్థితులు బాగాలేవు’ అని అప్పటి అధికార యంత్రాంగం సమాధానం. కెరమెరి టు ఆసిఫాబాద్ ప్రధానరహదారి పక్కన కుప్టి దగ్గరే (జోడేఘాట్ క్రాస్) ఏర్పాట్లు. ‘కుమ్రంభీం గడ్డను తాకకుండా ఇక్కడే (కుప్టీ) నివాళి అర్పించాలంటే ఇక్కడిదాకా రావడం ఎందుకు? హైదరాబాద్లోనే నివాళి అర్పించేవాళ్లం కదా! నేను మంత్రి కన్నా ముందు తెలంగాణ బిడ్డను. తెలంగాణ బిడ్డగా జోఢేఘాట్కు వెళ్లి ఆ యోధుడికి నివాళి అర్పిస్తా’ అని యంత్రాంగం వద్దన్నా జీప్లో కొద్దిదూరం.. బైక్మీద కొద్దిదూరం వెళ్లి కుమ్రంభీంకు నివాళి అర్పించారు హరీశ్రావు. అటువంటి జోడేఘాట్ స్వరాష్ట్ర తెలంగాణలో ఇప్పుడు పర్యాటక ప్రాంతం. అప్పుడు జోడేఘాట్లో బాబేఝరి గ్రామ పంచాయతీలో ఆవాసం. 598 మంది జనాభాతో ఇప్పుడు గ్రామ పంచాయతీ. అక్కడ రెసిడెన్షియల్స్కూల్. వాగునీళ్లు.. తోపునీళ్లతో గొంతు తడుపుకున్న జోడేఘాట్లో ఇప్పుడు ఇంటింటికి మిషన్ భగీరథ. పదో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ఆశ్రమ పాఠశాల. తెలంగాణలో ఆదివాసీల బతుకు చిత్రం మారిందనటానికి ఇంతకన్నా చారిత్రక ఉదాహరణ ఏం ఉంటుంది?
దశాబ్దాలుగా భూమి కోసం తల్లడిల్లిన గిరిపుత్రుల సమస్యకు సీఎం కేసీఆర్ పరిష్కారం చూపారు. తాము సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని దశాబ్దాలుగా పోరాటాలు చేసి, ఎదురుచూసిన గిరిపుత్రులకు 1,51,146 మంది పోడు రైతులకు, 4,06,369 ఎకరాల భూమికి అటవీ భూ యాజమాన్య హక్కు పత్రాలు అందజేశారు. అంతేకాదు ఈ రైతులకు రైతుబంధు, రైతుబీమాను వర్తింపజేస్తున్నారు. పోడు కేసుల ఎత్తివేతకు, పంపిణీ చేసిన అటవీభూమికి త్రిఫేజ్ కరెంట్ సరఫరాకు సర్కార్ శరవేగంగా చర్యలు తీసుకుంటున్నది.
తెలంగాణలో ఉన్న మెజారిటీ గిరిజన లంబాడాలదే పైచేయి (65 శాతం) అయినా, అడవులనే నమ్ముకొని, అటవీ ఉత్పత్తులనే ఆధారంగా మలచుకున్న కోయ (12 శాతం), గోండు (9 శాతం), కొలాం (1 శాతం), ఎరుకల (5 శాతం), ఇతర తెగల (8 శాతం) జీవన వికాసం కోసం పట్టుదలతో తెలంగాణలో అనేక కార్యక్రమాలు అమలవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక ఆదిమ గిరిజన తెగలు అంతరించిపోతున్నాయని, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న తెగలను బతికించాలని యునెస్కో అనేక దేశాలకు సూచించింది. అలా అంతరించిపోనున్న తెగల్లో రాష్ట్రంలో చెంచు, కొలాం, థోటి, కొండరెడ్డి ఈ నాలుగు తెగలున్నాయని గుర్తించి దేశంలో మరే రాష్ట్రం వేయని అడుగును తెలంగాణ వేసిందని అనేక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా విద్యావంతులైన గిరిజన యువతను పారిశ్రామిక వేత్తలుగా తీర్చదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అందులోభాగంగా సీఎంఎస్టీఈఐ (చీఫ్ మినిస్టర్ ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇన్నోవేషన్) కార్యక్రమానికి రూపకల్పన చేసింది. పథకానికి ఎంపికైన విద్యావంతులకు ఇండియన్ బిజినెస్ స్కూల్(ఐబీఎం)లో శిక్షణ ఇప్పించి, బ్యాంకు లింకేజీకి ప్రభుత్వమే పూచీకత్తుగా ఉండి వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దటం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ఇందులో కొలాం (0.3 శాతం), థోటి, చెంచు (0.6 శాతం) చొప్పు న విద్యావంతులను దొరకబట్టుకొని ఎంపిక చేయటం స్వాగతించదగిన పరిణామం. కోయ, గోండు, కొలాం, పర్దాన్, తోటి, నాయక్పోడ్, ఆంథ్ వంటి అనేక ఆదివాసీ తెగల అభ్యున్నతి కోసం తెలంగాణ అనేక అడుగులు వేస్తున్నది.
ఆదివాసీ గిరిజనుల ఆత్మ గౌరవాన్ని సమున్నతంగా నిలిపే విధంగా తెలంగాణ అనేక ప్రయత్నాలు చేస్తున్నది. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో రూ.50 కోట్లతో కుమ్రంభీం ఆదివాసీ భవన్, సంత్ సేవాలాల్ బంజారా భవనాలను నిర్మించటమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా రూ.75 కోట్ల 86 లక్షల వ్యయంతో 32 ఆదివాసీ, బంజారా భవన్లను ప్రభుత్వం నిర్మించింది. అలాగే జిల్లాల్లో రూ.34కోట్ల 52 లక్షలతో గిరిజన భవన్ నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి. ఆదివాసీల అభ్యున్నతి చెందాలంటే అక్షర జ్ఞానం అదీ పోటీ ప్రపంచాన్ని తట్టుకొని నిలబడేలా ఆదివాసీ గిరిజన బిడ్డలు నిలబడేందుకు తెలంగాణ టీడీఏల పరిధిలోని 322 ఆశ్రమ పాఠశాలలను ఆంగ ్లమాధ్యమంలోకి మార్పుచేసింది. అదే సమయంలో ప్రాథమిక పాఠశాల స్థాయిలో మాతృభాషలో ప్రైమర్స్ రూపకల్పన చేసి భాషా అంతరాల్లేని జ్ఞానాన్ని పంచుతున్నది. రహదారులే జీవనాడులన్న సూత్రం అన్నివర్గాలకు వర్తిస్తున్నది. రోడ్డుంటే వైద్యం ఊరుకు చేరుతుంది. చిన్నారులకు చదువులు చెప్పేందుకు సమయానికి టీచర్ వస్తాడు. ఉపాధి అవకాశాలు పెరుగుతాయనే సూత్రాన్ని గ్రహించిన తెలంగాణ ఇవ్వాళ అనేక మారుమూల ప్రాంతాలకు రోడ్ నెట్వర్క్ను విస్తృతం చేసింది. 1682 గిరిజన ఆవాసాలకు రూ.1276 కోట్లతో 3173.63 కి.మీ. బిటీ లింక్ రోడ్లు నిర్మాణం చేపట్టి దూరాలను చెరిపేసింది.
ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ, గిరిజన జాతరగా వినుతికెక్కిన మేడారం సమ్మక-సారలమ్మ జాతరను ప్రభుత్వం గొప్పగా నిర్వహిస్తున్నది. జాతరకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం రూ.354 కోట్లు ఖర్చు చేసింది. ఇతర గిరిజన పండుగలను ఏటా అధికారికంగా నిర్వహిస్తూ ఆదరిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం.
-నూర శ్రీనివాస్
9182777011