Buchi Babu | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. ఎన్నో నెలలుగా ఈ సినిమా కోసం ఎదురుచూసిన మెగా అభిమానులు ఇప్పుడు థియేటర్లలో ‘పెద్ది’ మ్యానియాను ఆస్వాదిస్తున్నారు. విడుదలైన తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం అన్ని ప్రాంతాల్లో భారీ స్పందనను అందుకుంటోంది.ముఖ్యంగా సినిమాలో రామ్ చరణ్ నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. భావోద్వేగ సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్స్, క్లైమాక్స్లో ఆయన చూపించిన నటనకు అభిమానులు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో కూడా చరణ్ పెర్ఫార్మెన్స్ గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది.
అయితే సినిమా విజయోత్సాహం మధ్య ఒక అంశం మాత్రం చర్చనీయాంశంగా మారింది. హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్ర, ఆమె గ్లామర్ ప్రెజెంటేషన్పై కొందరు ప్రేక్షకులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో జాన్వీ పాత్రకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని, ఆమెను ఎక్కువగా గ్లామర్ కోణంలోనే చూపించారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ విమర్శలపై తాజాగా దర్శకుడు బుచ్చిబాబు స్పందించారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న అభిప్రాయాలపై మాట్లాడిన ఆయన, కొన్ని సన్నివేశాలను ప్రేక్షకులు ఈ స్థాయిలో నెగిటివ్గా తీసుకుంటారని తాను ఊహించలేదని తెలిపారు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ పాత్రల మధ్య ఒక సరదా ప్రేమకథను చూపించాలనుకున్నాం. ఆ భావోద్వేగాన్ని, వారి మధ్య ఉన్న కెమిస్ట్రీని ప్రేక్షకులకు చేరవేయాలన్నదే మా ఉద్దేశం. అయితే ప్రేక్షకుల అభిప్రాయాలను గౌరవిస్తాం. భవిష్యత్తులో పాత్రల చిత్రీకరణ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తాం” అని బుచ్చిబాబు పేర్కొన్నట్లు సమాచారం.
‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ ‘అచ్చియమ్మ’ అనే పాత్రలో కనిపించారు. కథలో ఆమె పాత్ర నిడివి పరిమితంగానే ఉన్నప్పటికీ, తెరపై ఆమె ప్రెజెన్స్, లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని అభిమానులు చెబుతున్నారు. మరోవైపు, అదే అంశం కొందరి విమర్శలకు కారణమైంది. సినిమా కథ ప్రధానంగా రామ్ చరణ్ పాత్ర చుట్టూ తిరగడం వల్ల హీరోయిన్ పాత్రకు తక్కువ స్క్రీన్ స్పేస్ లభించిందనే అభిప్రాయం కూడా సినీ వర్గాల్లో వినిపిస్తోంది. అయినప్పటికీ జాన్వీ తన పాత్రకు న్యాయం చేశారని అభిమానులు సోషల్ మీడియాలో మద్దతు తెలుపుతున్నారు.ఇక బాక్సాఫీస్ విషయానికి వస్తే, ‘పెద్ది’ విడుదలైన మొదటి రోజే భారీ వసూళ్లతో రికార్డులు సృష్టించినట్లు చిత్రబృందం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.135 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ జోరు కొనసాగితే రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు నమోదు చేసే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.