దేశంలోని సహజ వనరులను, మానవ వనరులను సమగ్రంగా ఉపయోగించుకుని దేశాన్ని ప్రగతి పథంలో పయనింపజేయడానికి బీఆర్ఎస్ సిద్ధమైంది. తమతో కలిసి వచ్చే పార్టీలను కలుపుకుని దేశ రాజకీయాలను మార్చడానికి పయనమైంది. కర్షకులు, కార్మికులు, మేధావుల మద్దతుతో కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీ దేశ భవితను మారుస్తుందని ఆశిద్దాం.
తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి దేశ సౌభాగ్యం కోసం భారత రాష్ట్ర సమితిగా మారింది. తన ప్రభుత్వ సక్సెస్ మాడల్ను దేశానికి అందించడానికి సిద్ధమైంది. తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు తన గమ్యాన్ని నిర్దేశించుకుంది. జనతాదళ్(సెక్యులర్) పార్టీతో బీఆర్ఎస్ దోస్తానా దాదాపు ఫిక్స్ అయిపోయింది. వచ్చే ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, జేడీఎస్ కలిసి పోటీ చేయనున్నాయి. బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ తమ పార్టీ లక్ష్యాలను వివరించారు. దేశంలో 40 శాతం ఉన్న రైతులతో కలిసి కేంద్ర సర్కారు ఏర్పాటుకు కృషి జరగాలని ఆకాంక్షించారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో ముందుకు వెళ్దామని పిలుపు నిచ్చారు.
తెలంగాణ మాడల్ అభివృద్ధిని దేశ వ్యాప్తంగా అమలు చేయాలన్నదే కేసీఆర్ ఆకాంక్ష. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, రైతు బంధు, దళిత బంధు ఇలా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ ప్రజా సంక్షేమ పథకాల గురించి దేశమంతా ప్రచారం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయడమే దేశ ప్రజల లక్ష్యం కావాలని ఆయన పేర్కొన్నారు. అంకిత భావంతో పని చేస్తే తప్పనిసరిగా సక్సెస్ అవుతామన్నది ఆయన నమ్మకం. ప్రకృతి సంపద, సహజ వనరులను సక్రమంగా వినియోగించుకుంటే దేశం అభివృద్ధిలో దూసుకెళుతుందని కేసీఆర్ బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో విశ్లేషించారు.
విద్యుత్తు, ఆరోగ్యం, విద్య లాంటి ఎన్నో రంగాల గురించి ఈ సందర్భంగా కేసీఆర్ చర్చించారు. అసమానతలు లేని సమ సమాజ నిర్మాణం ఆయన స్వప్నం. అందుకే ఇప్పుడు ఆయన దేశం కోసం బయలు దేరారు. దేశమంతటా గులాబీ జెండా ఎగరేయగలననే నమ్మకంతో ఉన్నారు. ఆత్మ విశ్వాసం
పర్వతాలనైనా కదిలిస్తుందని కేసీఆర్ అంటారు. ఆల్ ది బెస్ట్ కేసీఆర్ సాబ్! తెలంగాణ కీర్తిని ఇనుమడింపజేసిన కేసీఆర్ దేశ కీర్తిని కూడా ద్విగుణీకృతం చేస్తారని ఆశిద్దాం. తమ పార్టీతో కలిసి వచ్చే వారితో ఈ నెల 14న ఢిల్లీలో కేసీఆర్ సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఢిల్లీ సమావేశంతో మొదలుపెట్టి దేశ పర్యటనకు కేసీఆర్ శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. సీపీఐ, సీపీఎంలు బీఆర్ఎస్తో కలిసి నడవనున్నాయి.
దేశంలో వామ పక్షాలకు 3 నుంచి 5 శాతం ఓటు బ్యాంక్ ఉంది. కొన్ని రాష్ర్టాల్లో 6 శాతం ఓట్లు కూడా ఉన్నాయి. కేరళలో సీపీఎం ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇటీవల మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి వామపక్షాలు మద్దతిచ్చాయి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, సింగరేణికి బొగ్గు బ్లాకుల కేటాయింపు విషయంలో వామపక్షాలు బీఆర్ఎస్తో కలిసి పని చేస్తున్నాయి. వామపక్షాల మద్దతుతో బీఆర్ఎస్కు 2024 పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందే జాతీయ పార్టీ గుర్తింపుకు సరిపోయేంత ఓట్ల శాతం లభించే అవకాశం ఉంది. బీజేపీకి, కాంగ్రెస్కు సమాన దూరం పాటిస్తున్న బీఆర్ఎస్ తమతో కలిసి వచ్చే ఇతర పార్టీలతో దేశ రాజకీయాలను మార్చడానికి సిద్ధమవుతున్నది.
దేశ ప్రజలు బీఆర్ఎస్ ఏర్పాటు, దాని లక్ష్యాలపై ఆసక్తి చూపుతున్నారు. అయితే ప్రజల కోసం మంచి పనులు చేసే పార్టీకి తప్పక ఆదరణ లభిస్తుంది. బొగ్గు బ్లాకులు కావాలంటే సింగరేణి సంస్థ కూడా వేలంలో పాల్గొనాలని కేంద్రం స్పష్టం చేయడంపై కార్మిక లోకం తీవ్ర ఆగ్రహంతో ఉంది. 11వ వేతన
ఒప్పందం అమలు కోసం, సింగరేణికి బొగ్గు బ్లాకులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 9న సింగరేణి కార్మిక యూనియన్ల ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జిలు ధరించి ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలో తమ ఆందోళనకు మద్దతు ఇస్తున్న బీఆర్ఎస్కు కార్మికులు అండగా నిలబడుతున్నారు. కర్షకులు, కార్మికులు, మేధావుల మద్దతుతో కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీ దేశ భవితను మారుస్తుందని ఆశిద్దాం.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్టు)
ఎండి.మునీర్: 99518 65223