చరిత్రలో నిర్ధారణ అయిన సూత్రం ఒకటున్నది. ఏ మహా వ్యక్తి అయినా తన దేశకాల పరిస్థితుల నుంచి ఆవిర్భవించిన వాడే అని. ఈ సూత్రం గద్దర్కు కూడా వర్తిస్తుంది. తను ఒక మహా కళాకారునిగా రూపొందినప్పటి భారత సమాజపు సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు ఏమిటో, వాటిపై ప్రజలపక్షాన పోరాడుతుండిన విప్లవ శక్తుల సైద్ధాంతిక బలిమిగాని, భౌతికశక్తి గాని ఎటువంటివో తెలిసిందే. ఆ పాదు నుంచి తన స్వీయ ప్రతిభతో గద్దర్ అనే విప్లవ కళాశక్తి ఎదిగింది. మరొక మాటలో చెప్పాలంటే ఆయన చైల్డ్ ఆఫ్ హిజ్ టైమ్స్.
కొన్ని దశాబ్దాలు గడిచేసరికి ఆ దేశకాల పరిస్థితులు మౌలికంగా మారలేదు గాని, ఆ విప్లవ శక్తుల సైద్ధాంతిక బలిమి, భౌతికశక్తి వివిధ కారణాల వల్ల బలహీనపడసాగాయి. ఆ విధంగా నిస్సారమవుతుండిన పాదు అనేక మందిని వలెనే గద్దర్ను కూడా అయోమయానికి గురిచేసింది. అంతేకాక విప్లవ సంస్థలలో కడతేరక మిగిలిన అవలక్షణాలలో ఒకటైన కులవివక్ష పలువురు ఇతరుల వలెనే స్వయంగా దళితుడైన గద్దర్ను కూడా గాయపరిచింది. ఈ పరిస్థితులన్నింటి మధ్య విప్లవ లక్ష్యాలకు కాకున్నా రాజకీయాలకు దూరమైన గద్దర్ పదేండ్లపాటు ఏమేమి మాట్లాడి ఏమి చేసిందీ సమాజం చూస్తూనే వచ్చింది. ఏమి చేసినా పీడిత సమాజం పట్ల తన నిబద్ధత మాత్రం మారలేదు.
ఆ కాలమంతా ఆయన పట్ల ప్రజల అభిమానం, ఆదరణ అయితే తగ్గలేదు గాని, అదే సమయంలో ఒక సమాజానికి తన దేశకాల పరిస్థితులు, సమస్యల పరిష్కారాలే ప్రధానమవుతాయి. ఒక వ్యక్తి పట్ల ఆదరాభిమానాలు ద్వితీయమవుతాయి. ఈ చారిత్రక సూత్రాన్ని అనుసరించి, సమాజం గద్దర్ పట్ల ఆదరాభిమానాలను కొనసాగిస్తూనే ఆయన ఆ తర్వాత చేయగలది ఏమిటని ఎదురుచూసింది. ఒకవేళ తను ఆ సమాజ సమస్యలకు, ఆకాంక్షలకు అనుగుణమైనది నిర్దిష్టంగా ఏమైనా చేసి ఉంటే, ఆ కొత్త కార్యాచరణ తన వెనుకటి విప్లవ రాజకీయాల కోవలోనిది కాకపోయినప్పటికీ, తనను తిరిగి అదేవిధంగా అక్కున చేర్చుకొని ఉండేవారే. తన వ్యక్తిగత ప్రతిభ విప్లవ రాజకీయాల పరిధిలో వలెనే ఇప్పుడు కూడా గొప్పగా రాణించి ఉండేదే. తనకు విప్లవ రాజకీయాల నుంచి దూరమైన వెలితి కొనసాగినా, మరొక వేదిక నుంచి అదే పీడిత సమాజం ఒడిలో నిలిచి దానికోసం తన కళాప్రతిభను ఉపయోగించిన సంతృప్తి కలిగేది. సమాజానికి అంతిమంగా కావలసింది సమస్యల పరిష్కారమే తప్ప అది ఏ సిద్ధాంతం ప్రకారం, ఏ మార్గంలో జరుగుతుందన్నది కాదు. ఇతర మార్గాలకన్న విప్లవ సిద్ధాంతం ప్రతిపాదించే ప్రత్యామ్నాయ వ్యవస్థ మెరుగైనదే కావచ్చు. కాని అది ప్రజలకు ప్రత్యక్ష అనుభవంలోకి రావటంతో పాటు కనీసం కొన్నితరాల పాటు నిలిచి ఉన్నప్పుడు గాని దానిగురించి ప్రజల తీర్పు, చరిత్ర తీర్పు అనేవి వెలువడవు. అంతవరకు అది తాత్కాలికమైన ప్రొబేషనరీ స్థితే.
ఇటువంటి పరిస్థితుల్లో, విప్లవ రాజకీయాలకు దూరమైన గద్దర్కు ప్రత్యామ్నాయ వేదిక ఏమిటి? తాను ప్రేమించి ప్రజల కోసం ఏదో చేయాలన్న తపన అయితే ఉంది గాని ఏ విధంగా? సాధారణ దృష్టికి కూడా వెంటనే స్ఫురించేది ఆ కాలమంతా విప్లవోద్యమం తర్వాత దళిత బహుజన ఉద్యమమే. అప్పుడు ఆ పేరిట పలు ఉద్యమాలు ఉండేవి కూడా. కాని అవి రకరకాలుగా చీలికలు పేలికలై బలహీన స్థితిలో ఉండేవి. వాటిని ఏకం చేయటం గాని, లేదా కొత్త వేదిక నిర్మాణం గాని గద్దర్ శక్తికి మించిన పని. లేనట్లయితే, సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతుల రీత్యా దళిత, బహుజనుల పరిస్థితిని బట్టి, తాను స్వయంగా ఆ వర్గాలకు చెందినవాడు కావటాన్ని బట్టి, విప్లవోద్యమంలో భాగస్వామిగా ఉన్నప్పుడు ఆ ఉద్యమంలోని కొన్నివర్గాలు తనపై కులవివక్ష చూపాయన్న మానసిక బాధను బట్టి ఆయన బహుశా దళిత, బహుజన ఉద్యమాల మార్గాన్ని ఎంచుకొని ఉండేవాడేమో. ఆ పనిచేసి ఉంటే అదొక తార్కికమైన పరిణామం అయ్యేది. అది వ్యవస్థనే మౌలికంగా మార్చాలనే విప్లవోద్యమ రాజకీయాలతో పోల్చదగినది కాకపోయినా, ఆ తర్వాత అటువంటి స్థాయి గల ఒక మహా సంస్కరణోద్యమం అయ్యేది.
ఎందువల్లనైతేనేమి గద్దర్ ఆ దిశగా కొంతకాలం కొన్ని కదలికలు చూపినా పూర్తిగా అందులోకి ప్రవేశించలేదు. దళిత బహుజన ఉద్యమం పేరిట మాటలు ఎక్కువ చేతలు తక్కువ కావటం, ఐక్యత లేకపోవటం, కెరీరిజం పెరగటం వంటివి అందుకు ఒక కారణమై ఉంటే ఆశ్చర్యపడనక్కరలేదు. ఐక్యతను, సమస్యలకు పరిష్కారాలను సీరియస్గా కోరుకుంటున్న క్షేత్రస్థాయి దళిత బహుజన సామాన్యులు ఈ అర్బన్ కెరీరిస్టు దళిత నేతల వర్గానికి దిగువ పొరలలో ఉన్నారు కానీ, అర్బన్ కెరీరిస్టులను కాదని వారిని సంఘటితపరచటం గద్దర్కు ముఖ్యంగా ఆ వయసులో, తేలికైన పనికాదు. అటువంటి స్థితిలో ఎదురుగా కనిపించిన మరొక ఉద్యమం తెలంగాణ రాష్ట్ర ఉద్యమం. అదొక పీడిత ప్రాంతపు సమస్య అని, ఆ ప్రాంతంలోని యావన్మంది ప్రజలు పీడనకు గురవుతున్న సమస్య అని ఆయనకు తెలుసు. పైగా ఆ ఉద్యమం తను అప్పటికే చిరకాలంగా పాల్గొన్నది. విప్లవోద్యమంలో భాగస్వామిగా ఉండినకాలంలోనూ పూర్తి మద్దతు ప్రకటించినటువంటిది. కనుక ఇప్పుడు బాహాటంగా అందులో చేరగలడు. అదే సమయంలో ఆ ఉద్యమ స్వభావంపై, లక్ష్యాలపై తన ఆలోచనలు తనకున్నాయి. తన దశాబ్దాల విప్లవోద్యమ నేపథ్య ప్రభావం ఈ ఆలోచనలపై ఉండటం సహజం. అందుకు అనుగుణంగా ఆయన తెలంగాణ ఉద్యమ స్వరూప స్వభావాలను మలిచేందుకు కొన్ని ప్రయత్నాలు అయితే చేశాడు గాని అవి నెరవేరలేదు. అట్లా నెరవేరకపోవటం కూడా సహజమనాలి. ఎందుకంటే, ఒకవైపు కేసీఆర్ నాయకత్వాన ఉద్యమం ఒక పద్ధతిలో ఉధృతంగా సాగుతూ, బడుగు, బలహీన వర్గాలతో సహా ప్రజానీకమంతా అందులో పాల్గొంటున్నప్పుడు, ఇతర పాయలకు అవకాశం స్వల్పంగా ఉంటుంది.
ఈ దశ వచ్చేసరికి గద్దర్కు తన దృక్కోణం నుంచి మూడు నిరాశలు మిగిలాయి. విప్లవోద్యమపు నిరాశ ఒకటి, దళిత బహుజన ఉద్యమపు నిరాశ రెండు, తెలంగాణ ఉద్యమపు నిరాశ మూడు. ఈ ముప్పేట స్థితి ఆయనను కుంగదీసింది. అయోమయం తీవ్రస్థాయికి చేరింది. మరొక ప్రత్యామ్నాయమేదీ ఎదురుగా లేదు. తన ప్రపంచంలోని దేశకాల పరిస్థితులన్నీ దిక్కుతోచని పరిస్థితిని కల్పించాయి.
ఈ స్థితిలో చివరి దశలో ఆయన రకరకాల మాటలు, చేతలన్నీ తనపై తన నియంత్రణ బలహీనపడిన, స్పష్టమైన దిశానిర్దేశం లేని పలవరింతలు మాత్రమే. ఆ విధంగా ఆయన చివరి దశలోనూ చైల్డ్ ఆఫ్ హిజ్ టైమ్స్ అయ్యాడు. మనకు ఆయన మహా చారిత్రక వారసత్వం మిగిలింది. వర్తమానాన్ని వదిలివేద్దాం.
– టంకశాల అశోక్