Krishna Byre Gowda : కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన డీకే శివకుమార్ (Dk Shivakumar) కు సొంత పార్టీ నేతల నుంచి తలనొప్పులు ఇంకా తగ్గలేదు. శాఖల కేటాయింపుపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ మరో మంత్రి అలకబూనారు. అంతేకాదు అధిష్ఠానంతో చర్చల కోసం ఆయన ఢిల్లీకి బయలుదేరారు. మంత్రి కృష్ణబైరె గౌడ (Krishna Byre Gowda) కు గ్రేటర్ బెంగళూరు అభివృద్ధి శాఖను కేటాయించారు. అయితే ఆ శాఖలోని బెంగళూరు అభివృద్ధి అథారిటీ (BDA), బెంగళూరు మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి అథారిటీ (BMRDA) వంటి కీలక విభాగాలను మాత్రం సీఎం తన వద్దే ఉంచుకున్నారు. దీనిపై కృష్ణ బైరె గౌడ అసంతృప్తిగా ఉన్నారు.
దీనిపై సీఎం డీకే శివకుమార్ను కూడా ఆయన కలిశారు. ఈ సమస్యపై పూర్తి పరిష్కారం వచ్చిన తర్వాతే బాధ్యతలు తీసుకుంటానని కృష్ణ బైరె గౌడ స్పష్టంచేశారు. ఢిల్లీకి వెళ్లిన ఆయన.. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా నగరాభివృద్ధి శాఖను తనకు కేటాయించకపోవడంపై ఇటీవల సీనియర్ నేత రామలింగారెడ్డి అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆయన ప్రమాణం చేసిన రెండు రోజుల్లోనే నీటిపారుదల శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత పార్టీ ఆయనకు నచ్చజెప్పడంతో రాజీనామాను వెనక్కి తీసుకున్నారు.
ఇప్పుడు ఆ నగరాభివృద్ధి శాఖ కేటాయించినా కృష్ణ బైరె గౌడ అసంతృప్తిగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఇలా కొందరు తమకు కేటాయించిన శాఖలపై అసంతృప్తి వ్యక్తంచేస్తుంటే.. మరికొందరు ఎమ్మెల్యే మంత్రివర్గంలో చోటుదక్కకపోవడంపై అసంతృప్తిగా ఉన్నారు. శాఖల విషయంలో అసంతృప్తితో ఉన్నవారితో పాటు.. మంత్రివర్గంలో చోటు కోసం అభ్యర్థించేందుకు ఎమ్మెల్యేలు ఢిల్లీ బాట పట్టారు. డీకేకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ కూడా ఢిల్లీకి వెళ్లారు.