మొక్కవోని దీక్షతో రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్, ముఖ్యమంత్రిగా సొంత పాలనలో ఫలాలు ఎంత రుచిగా ఉంటాయో చూపిస్తున్నారు. తెలంగాణ రాకముందు లక్షలాది ఎకరాలకు నీటివసతి లేక తిండిగింజలకు కరువైన పరిస్థితినుంచి ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా జలరాసులతో పుడమితల్లి పులకరించి పోతున్నది. ధాన్యాగారాలు నిండిపొర్లుతున్నాయి. వ్యవసాయం పండుగగా మారిపోయిం ది. నీటిలభ్యతను చూసి రైతులు పరవశులవుతున్నారు. కర్నూల్, నరసరావు పేట బియ్యం అని చెప్పుకొనే పరిస్థితి నుంచి వరంగల్ బియ్యం, తెలంగాణ బియ్యం అని గర్వంగా చెప్పుకొనే పరిస్థితి వచ్చింది.మొన్న డిస్కవరీ ఛానెల్లో ‘లిఫ్టింగ్ ఆఫ్ ఎ రివర్’ అనే డాక్యుమెంటరీ ప్రసారం అయింది. ఆ కార్యక్రమాన్ని చూసినవారు లేచి నిలబడి చప్పట్లు కొట్టివుంటారు.
రోమాలు నిక్కబొడుచుకుని ఉంటాయి! ప్రపంచంలోనే మహాద్భుత కట్టడం, కాళేశ్వరం ప్రాజెక్ట్ భారతదేశానికే మకుటాయమానం. తెలంగాణ మాత మెడలో తెలంగాణ జాతిపిత పొదిగిన వజ్రాలహారం! పురాణాల్లో భగీరథుడు దివినుంచి గంగమ్మను భువికి రప్పించాడని చెప్పారు. మరి ఈ కలియుగభగీరథుడు పాతాళం నుంచి గోదావరమ్మను పైకి రప్పించారు! వీరిద్దరిలో ఎవరు గొప్పంటారు? తన మేధస్సుతో, దూరదృష్టితో కేసీఆర్ గోదారమ్మ ప్రవాహగతినే మార్చేశారు. నీరు పల్లమెరుగు అనే సామెత ఇక్కడ తలకిందులయింది!
సాధారణంగా ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ను నిర్మించాలంటే ఎంత లేదన్నా రెండేళ్లు పడుతుంది. మరి ఎనభైవేలకోట్ల రూపాయల ఖర్చుతో కోటి ఎకరాలను సస్యశ్యామలం చేసే కాళేశ్వరాద్భుతాన్ని మూడు సంవత్సరాల కాలంలో నిర్మించారంటే కేసీఆర్ పట్టుదల, చిత్తశుద్ధి మాత్రమే కారణాలు కావు.. తనను నమ్ముకున్న ప్రజలపట్ల, తన జన్మభూమిపట్ల అవ్యాజమైన ఆపేక్ష! మాతృభూమి మట్టిమీద మమకారం! కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం ఒక్క రూపాయి సాయం చెయ్యలేదు. జాతీయప్రాజెక్టుగా గుర్తించడానికి నిరాకరిం చింది. అయినప్పటికీ కేసీఆర్ వెనక్కు తగ్గలేదు. తన మానసపుత్రికను పుష్టిగా పెంచాలనే నిశ్చయించుకున్నారు. ఇవాళ తెలంగాణలో నీటికి, కరెంటుకు కరువు లేదు. నీళ్లు రాకపోయినా, కరెంట్ పోయినా దాన్ని వింతగా చెప్పుకోవలసిన పరిస్థితి ఇవాళ తెలంగాణలో నెలకొన్నది అంటే అది నూటికి నూరుపాళ్లు కేసీఆర్ కృషి వల్లనే. దాశరథి కలలు కన్న కోటి రతనాల వీణ కళ్ళముందు ప్రత్యక్షం అయింది.
ఇక మరొక అద్భుతం యాదాద్రి! ఆరేళ్ళ క్రితం వరకూ లోకానికి పెద్దగా తెలియని చిన్న ఆలయం. పురాణప్రాశస్త్యం కలిగి ఉన్నప్పటికీ అభివృద్ధికి నోచుకోని పుణ్యక్షే త్రం. దర్శనానికి వెళ్తే పదినిముషాల్లో అయిపోయేది. పెద్దగా భక్తులు ఉండేవారు కారు. ఆ ఆలయం మీద కేసీఆర్కు ఎందుకు మనసుపడిందో తెలియదు. ఆ యాదగిరీశుడి ఆదేశమే అయ్యుంటుంది. దీన్ని అభివృద్ధి చేస్తే తిరుపతి వెంకన్న ఆలయంలా మారుతుందని ఆయనకు ఆ నరసింహుడే నూరిపోసి ఉంటాడు. పన్నెండు వందలకోట్ల రూపాయల భారీ వ్యయంతో యా దాద్రి రూపురేఖలు మార్చేశారు కేసీఆర్. మానవుడే తలచినచో గిరులనెగుర వేయ డా అని శ్రీ శ్రీ అన్నట్లే గిరులు ఎగిరిపోయాయి. కొన్ని చదును అయ్యాయి.
ఇవాళ యాదాద్రి క్షేత్రం బంగారు కళతో ఉట్టిపడుతోంది. వందల సంఖ్యనుంచి వేలసంఖ్యలో భక్తులను ఆకర్షిస్తున్నది. వేలసంవత్సరాల క్రితం చోళులు, పల్లవులు, విజయనగరాధీశులు మహత్తరమైన ఆలయాలను నిర్మించారని చరిత్ర చెబుతున్నది. ఇవాళ కేసీఆర్ చొరవతో సరికొత్త రూపురే ఖలు దిద్దుకున్న యాదాద్రి ఒక బృహదీశ్వరాలయానికి, ఒక హంపీ విరూపాక్ష ఆలయానికి ఏమాత్రం తీసిపోదు. అయుత చండీయాగాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించిన కేసీఆర్ యాదాద్రి ఆలయాన్ని పునఃనిర్మించడం ఆయన భక్తిని గూర్చి ఎరిగినవారికి ఏమాత్రం ఆశ్చర్యం కలిగించదు. మరో రెండేళ్లలో యాద్రాద్రి ఆలయం యావత్ దేశానికే గర్వకారణం అవుతుంది. పదేళ్లక్రితం మనం చూసిన ఆలయం ఇదేనా అని నోళ్లు తెరవక తప్పదు. స్థపతి ఆనందసా యి ఆధ్వర్యంలో చెక్కబడిన శిల్పకళావైభవం కళ్లారా చూసి తరించాల్సిందే తప్ప అక్షరాలతో వర్ణించలేము. భవిష్యత్తులో యాదాద్రి ఆలయం తెలంగాణకు బంగారం కురిపిస్తుంది. ఇది కేసీఆర్ సంకల్పబలం తప్ప మరేమిటి?
ఇటీవల కాలంలో కనీవినీ ఎరుగని ఈ రెండు మహాద్భుతా లు కేసీఆర్ మకుటంలో మణిపూసలు అంటే అతిశయోక్తి లేదు. తన గడ్డ పట్ల ఎంత అభిమానం ఉంటే ఇలాంటి కోరికలు పుడతాయి! ఎంతటి పట్టుదల ఉంటే ఇలాంటివి సాధించడం సాధ్యం అవుతుంది! కేసీఆర్ జాతకం ప్రకారం ప్రజల అనుగ్రహమే కాదు దైవానుగ్రహం కూడా పుష్కలంగా ఉన్నదట! యాదాద్రిని కేసీఆర్ చేతులమీదుగానే పూర్తి చేయాలనేది లక్ష్మీనరసింహుడి దివ్య సంకల్పం. అందుకనే ఆయన రెండోసారి అద్భుతమైన మెజారిటీతో విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు.
ఆకాశంలో సూర్యచంద్రులు, భూమిపై కాళేశ్వరం, యాదాద్రి ఉన్నంతవరకు కేసీఆర్ చిరంజీవి!
(వ్యాసకర్త: ఇలపావులూరి మురళీ మోహన రావు , సీనియర్ రాజకీయ విశ్లేషకులు)