కరోనా రెండోదశ నుంచి కాస్త ఉపశమనం పొందుతూ, మూడో అల విరుచుకుపడుతున్నదనే భయాందోళనల మధ్య కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఉద్దీపన మూట విప్పింది. కుదేలైన వ్యాపార వాణిజ్యరంగాలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ)లతో పాటు ప్రజలకు దన్నుగా నిలిచేందుకని ఆరు లక్షల ముప్పైవేల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. కొవిడ్ కారణంగా దెబ్బతిన్న మొత్తం 15 రంగాలకు ఈ ప్యాకేజీ ఊతమిస్తుందని కేంద్రం చెప్తున్నది. అయితే, ఇదంతా నిర్దేశించిన రంగాలకు సులభ, సరళతర రుణసాయమే తప్ప, కరోనాతో కృశించిపోయిన సంస్థలకు నేరుగా పునరుజ్జీవం పోసేలా లేదన్నది తెలుస్తూనే ఉన్నది. ఏయే రంగాలకు బడ్జెట్ నుంచి నికరంగా ఖర్చుపెట్టేదెంతో, కొత్త కేటాయింపులెంతో ఈ ప్యాకేజీలో స్పష్టత లేదు. ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసే ప్రయత్నమైతే కనిపిస్తుండటం ఊరటనిస్తున్నది.
మొదటి దశ కరోనా కారణంగా సుదీర్ఘంగా కొనసాగిన లాక్డౌన్తో దేశ ఆర్థికవ్యవస్థ కునారిల్లింది. ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకని గత ఏడాది మే నెలలో 20లక్షల కోట్ల భారీ ఉద్దీపనతో కేంద్రం చికిత్స చేపట్టింది. ఈ మొదటి ప్యాకేజీ ప్రకటనను సీరియల్ పద్ధతిలో ఐదు రోజుల పాటు ఆర్భాటంగా ప్రకటించడమే తప్ప ఆచరణ కనిపించలేదు. అలవి మీరిన షరతులు, విధానపర అడ్డంకులతో దేశంలోని ఎంఎస్ఎంఈ లు ఏ విధమైన సాయాన్ని పొందలేక పోయాయి. అప్పటికే ప్రకటించిన పథకాలనే మసిపూసి మారెడుకాయలాగా కొత్త ప్యాకేజీలుగా చూపించారనే విమర్శ ఉంది. తాజా ప్యాకేజీ కూడా మొదటి దానితో పోల్చితే స్వరూపంలో తేడా లేకుండా పోయింది. అత్యవసర రుణ హామీ పథకం కింద 1.5లక్షల కోట్లు, వైద్య సిబ్బందికి 15వేల కోట్లు, 25లక్షల మంది స్వల్ప రుణగ్రహీతలకు మైక్రోఫైనాన్స్ కంపెనీల ద్వారా స్వల్పవడ్డీతో పూచీలేని అప్పులు ఇవ్వటానికి 7,500 కోట్లు, పర్యాటక రంగానికి 11వేల కోట్లు, 15వేల కన్నా తక్కువ జీతం ఉన్నవారికి ఈపీఎఫ్ రాయితీలు మార్చివరకు వర్తింపచేయటం లాంటివి ప్రధానంగా చెప్పుకోవచ్చు.
కరోనాతో అతలాకుతలమైన జనజీవనం, ఉపాధి అవకాశాలు, వినియోగశక్తి పెరగాలంటే జనానికి ప్రత్యక్ష ఆర్థికసాయం అందించాలనే సూచనలను కేంద్రం పట్టించుకోలేదు. దెబ్బతిన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు తిరిగి గాడినపడాలంటే ఉద్దీపన సాయంలో వాటికే పెద్దపీట వేయాలి. గత ప్యాకేజీ అనుభవం కూడా నిరాశనే మిగిల్చింది. తెలంగాణలోని 80శాతం ఎంఎస్ఎంఈలకు ఎటువంటి ప్రయోజనం కలుగలేదు. ఆర్థికంగా చితికి తిరిగి కోలుకోలేక 20శాతం పరిశ్రమలు మూతపడ్డాయి. ఈ పరిస్థితుల్లో ఉద్దీపనలు ప్రచార పటాటోపం కాకుండా ఆచరణాత్మకంగా ఉంటే మేలు జరుగుతుంది.