లింగ సమానత్వం ప్రాథమిక మానవ హక్కు మాత్రమే కాదు.. అది శాంతియుత, సుసంపన్న, సుస్థిరాభివృద్ధితో కూడిన ప్రపంచానికి అత్యవసరమైన పునాది అని ఐక్యరాజ్యసమితి తన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో పేర్కొన్నది. ఈ దిశగా ప్రపంచం కొంత పురోగతి సాధించినప్పటికీ.. చేరుకోవాల్సిన తీరాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. బాల్యవివాహాలు, భారమైన ఇంటిపని, గృహహింస, అవకాశాల్లో వివక్ష, వేతనాల్లో అసమానత, భౌతికదాడులు, లైంగిక వేధింపులు, నిర్ణయాధికారం లేకపోవటం వంటి అనేక సమస్యలు ఇంకా మహిళల్ని పట్టి పీడిస్తూనే ఉన్నాయి. ప్రపంచాన్ని చుట్టుముట్టి అతలాకుతలం చేసిన కరోనాతో లింగ అసమానత్వం మరింత పెరిగిందని, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు మరింత తీవ్రమయ్యాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ప్రపంచ జనాభా దాదాపు 800 కోట్లు. దీంట్లో సగం మహిళలు. సమాజంలోని ప్రతి నిర్మాణాత్మక రంగంలోనూ వారికి సగం ప్రాతినిధ్యం ఉండాల్సిందే. అది మహిళల అభ్యున్నతికి మాత్రమే కాదు, మొత్తంగా ప్రపంచం అభివృద్ధికి అత్యవసరం. కానీ, ఇది అనుకున్నంత సులభం కాదు. ‘రాజ్యాధికారమే సకల సమస్యలను పరిష్కరించే మాస్టర్ కీ (ప్రధాన తాళం చెవి). దాంతోనే అభివృద్ధికి సంబంధించిన అన్ని తలుపులు తెరుచుకుంటాయి’ అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన పిలుపు బహుజన, దళిత జాతులకే కాదు.. మహిళలకూ వర్తిస్తుంది. విధానాలకు రూపకల్పన చేసే చట్టసభల్లో, వాటిని అమలు చేసే ప్రభుత్వాల్లో మహిళల ప్రాతినిధ్యం వారి జనాభాకు తగినట్లు పెరుగనంత కాలం వారి భవిష్యత్తును వారు నిర్మించుకోలేరు. ఇది ఇప్పటికే నిరూపితమైంది కూడా. పాలనలో, అధికార యంత్రాంగంలో మహిళల సంఖ్య తగినంతగా ఉన్న దేశాలు, సంస్థలు మంచి పురోభివృద్ధిని సాధిస్తున్నాయి.
ప్రస్తుతం మన లోక్సభలో మహిళల వాటా 14 శాతం మాత్రమే. చట్టసభల్లో మూడోవంతు సీట్లను స్త్రీలకు కేటాయించే మహిళా రిజర్వేషన్ బిల్లు ఏండ్లుగా పెండింగులోనే ఉన్నది. దీనికి మోక్షం దక్కేలా దేశవ్యాప్తంగా మహిళలు పూనుకోవాలి. రాజకీయ రంగంలో పరిస్థితులు మెరుగుపడాల్సి ఉన్నప్పటికీ.. అంతరిక్షం నుంచి ఆరోగ్యం వరకూ అన్ని రంగాల్లో మన దేశ మహిళలు సత్తా చాటటం మంచి పరిణామం. న్యాయ, పోలీసు, రక్షణ వంటి ‘సంప్రదాయేతర’ రంగాల్లోనూ వారు రాణిస్తున్నారు. తెలంగాణలో ప్రభుత్వం మహిళలకు ఆర్థిక, ఆరోగ్య, సామాజిక భద్రతను ఇచ్చే ఎన్నో పథకాలను అమలులో పెట్టింది. వితంతు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు పింఛన్లు, కల్యాణలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, అమ్మ ఒడి, కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు, షీటీమ్ల వంటివి ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా మారాయి. ఉద్యోగ, రాజకీయరంగాల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచటానికి విశేషంగా కృషి చేస్తున్నది. పారిశ్రామికవేత్తలుగా ఎదగటానికి సహకారం అందిస్తున్నది. దళితబంధు, డబుల్ బెడ్రూం వంటి సామాజిక, సంక్షేమ పథకాలను లబ్ధిదారుల ఇంటిలోని స్త్రీల పేరిట మంజూరు చేస్తున్నది. మహిళా సాధికారతలోనూ ‘తెలంగాణ మాడల్’ దేశానికి దిక్సూచిగా నిలుస్తున్నది.