‘గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్’ అనే వారు ఉంటారు. ‘మంచి గతమున కొంచెమేనోయ్’ అనే వారూ ఉంటారు. ఏదేమైనప్పటికీ మంచి అనేది ముఖ్యం. సమాజ ప్రగతికి వెనుకచూపు కన్నా ముందుచూపు అవసరం. పాతను పాతరేసి, కొత్త వెలుగుల వైపు ప్రస్థానిస్తున్న సందర్భం ఇది. అయినా కాలం చెల్లిపోయిన, ప్రజల తిరస్కారానికి గురైన భావనలను కొందరు ముందుకు తెస్తూ ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల సీజన్లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ లేనంత ఎక్కువగా ఇందిరమ్మను తలచుకోవడమే అందుకు ప్రబలమైన ఉదాహరణ. బహుశా ఇందిరమ్మ హయాంలో అనుభవించిన తిరుగులేని అధికారం కోసం అర్రులుచాస్తూ వారు అలా అంటున్నారేమో!
ఇంతకూ ఇందిరమ్మ రాజ్యం అంటే ఏమిటి? విదేశాంగ విధానంలో, రక్షణ రంగంలో ఆమె కొన్ని అద్భుతమైన విజయాలు సాధించి ఉండొచ్చు. అయితే చివరికి తాను సృష్టించిన ఖలిస్తానీ సమస్యకు తానే బలయ్యారు. ఇవి అందరికీ తెలిసిన విషయాలే. కానీ ఇందిరమ్మ రాజ్యాన్ని పదే పదే గుర్తుచేస్తున్నవారు దేశంలో జరిగిన అంతర్గత పాలన గురించే ప్రస్తావిస్తున్నారనేది స్పష్టం. కాంగ్రెస్ సర్వ భ్రష్టత్వం, తారస్థాయికి చేరిన వ్యక్తి ఆరాధన అనేవి ఆ పాలనకు తార్కాణాలుగా మిగిలిపోయాయి.
‘ఇందిరాయే ఇండియా, ఇండియాయే ఇందిర’ తరహా భజన పరత్వం చూసిన రోజులవి. అత్యంత కేంద్రీకృత పాలనకు ఆ రోజులు పేరు పడ్డాయి. ఢిల్లీకి కప్పం గడితే గల్లీలో ఇష్టారాజ్యం చెలామణీ అయ్యేది. కాంగ్రెస్ లోకల్ లీడర్ల దాష్టీకం ఎవరికి తెలియదు? గరీబీ హటావో అనే నినాదం ఇందిరదే. ఆ నినాదం ఏ మేరకు సాకారమైందో… ఏండ్ల తర్వాత కూడా ఉచితంగా బియ్యం ఇచ్చుకుంటున్న మనందరికీ తెలుసు. దేశంలో పేదరికం తరగకపోగా మరింత పెరిగింది.
తెలంగాణ నేపథ్యంలో మాట్లాడుకుంటున్నాం కనుక ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఎదుర్కొన్న సమస్యలేమిటో కూడా ప్రస్తావించుకోవాల్సి ఉంది. నెహ్రూ కాలంలోనే మేం విడిగా ఉంటామని తెలంగాణ ప్రజలు విస్పష్టంగా చెప్పారు. కానీ విడిపోయేందుకు అవకాశం ఉంటుందంటూ నయానా భయానా ఒప్పించి రెండు ప్రాంతాలను కలిపారు. ఆయన సునాయాసంగా చెప్పిన ‘విడిపోవడమనేది’ ఎంత కష్టంగా మారిపోయిందో తెలుసు. ఇందిర హయాంలో తొలిదశ ఉద్యమం పెల్లుబికితే దాన్ని దారుణాతి దారుణంగా అణచివేసింది ఆమే కదా. నాలుగు వందలకు పైగా యువకులను బలి తీసుకున్నది ఆమే కదా.
తదుపరి జరిగిన ఎన్నికల్లో కోటి ఆశలతో ప్రజలు టీపీఎస్కు బ్రహ్మరథం పడితే, ఆ పార్టీ ఎంపీలను కాంగ్రెస్లో విలీనం చేసుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అటకెక్కించిన ఘనత ఆమెదే కదా. బూటకపు ఎదురుకాల్పుల పేరిట యువకులను పిట్టల్లా కాల్చి చంపిన పోలీసు రాజ్యం ఎవరిది? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం వల్ల తెలంగాణకు కలిగిన మేలు? సంక్షేమం పేరిట పేదల పొట్టకొట్టి, పెద్దల జేబులు నింపిన ఇందిరమ్మ రాజ్యాన్ని ఎలా మరువగలం? తెలంగాణ ప్రాజెక్టులను పండబెట్టిన, పొలాలను ఎండబెట్టిన ఇందిరమ్మ రాజ్యం మరోసారి కావాలని కోరుకునేదెవరు?
నిజానికి ప్రజలు ఏది మంచో, ఏది చెడో వారే నిర్ణయించుకుంటారు. సరైన ప్రత్యామ్నాయం వచ్చినప్పడు సరైన తీర్పు చెప్తారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు జరిగింది అదే. ఈ దిక్కుమాలిన పాలన మాకొద్దని ఇందిరమ్మ రాజ్యాన్ని మూలకు పడేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కనీసం నువ్వోసారి నేనోసారి అనే ఏర్పాటు ఉండేది. కానీ సీఎం కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కాంగ్రెస్ తెలంగాణకు చేసిన ద్రోహం ప్రజలకు విస్పష్టంగా తెలిసిపోయింది. మరోసారి ఇందిరమ్మ రాజ్యాన్ని తిరుగులేకుండా తిరస్కరించి బీఆర్ఎస్కు వరమాల వేశారు.
ఒక విడత పాలన చూశాక నచ్చి మరోవిడత గెలిపించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ సాధించిన విజయాలు గల్లీ నుంచి ఢిల్లీ దాకా విఖ్యాతమైన సంగతి అవార్డులు, రివార్డుల ద్వారా రోజుకోసారి తెలుస్తున్నది. మరోవైపు ఈ దశాబ్దకాలంలో కాంగ్రెస్ పరిస్థితి నానాటికి తీసికట్టుగా తయారైంది. లిల్లీపుట్ల చేతుల్లోకి పోయి మరింతగా దిగజారింది. ఓటుకు నోటు బేహారులు సీట్లమ్ముకుంటున్న, సిగపట్లు పట్టుకుంటున్న వైనాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అలవిమాలిన అధికార దాహంతో వదరుబోతులు వీరంగం వేయడం, రాజకీయ చర్చను అవాకులు చెవాకుల స్థాయికి భ్రష్టు పట్టించడం గమనిస్తూనే ఉన్నారు. అందరూ నచ్చిన, మెచ్చిన కేసీఆర్ పాలన కొనసాగాలనే ఆకాంక్షతో ముచ్చటగా మూడో విడత అధికారం అప్పగించేందుకు జనం సమాయత్తవుతున్నారనేది తిరుగులేని సత్యం.