‘కాళేశ్వరం విలువ కష్టకాలంలోనే తెలుస్తుంది’ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న ఈ మాటలు అక్షర సత్యాలు. కాళేశ్వరం తన కర్తవ్యాన్ని నిర్వర్తించే సమయం ఆసన్నమైంది. వానలు కొంచెం వెనుకాముందూ కావడంతో రైతులు దిగులుకు లోనయ్యారు. ఈ నేపథ్యంలోనే మొన్న ఆదివారం సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సాగు, తాగునీటికి భయం లేదని భరోసా ఇచ్చారు. దేశమంతా వర్షాభావం వల్ల కరువు పరిస్థితులు నెలకొన్నాయి. కానీ తెలంగాణకు ఆ సమస్య లేదు. మనకు నీటి ధీమా ఉంది. కష్టపడి కాళేశ్వరం వంటి ప్రాజెక్టు కట్టుకున్నాం. ఇప్పుడు ఆ ప్రాజెక్టు రాష్ట్ర నీటి అవసరాలను తీర్చబోతున్నది. దశాబ్దాలుగా కరువు బరువు మోసిన తెలంగాణ నీటిగోస నుంచి విముక్తమైంది.
దాహం వేసినప్పుడే బావిని తోడటం ముందు చూపులేనివారు చేసే పని. కానీ దార్శనికులు అలా కాదు. రాబోయే కాలాన్ని ముందే ఊహించి, అవసరాలను అంచనా వేసి ప్రణాళికలు సిద్ధం చేసి ఉంచడం వారి ప్రత్యేకత. ఈ ప్రయాణంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఆగిపోరు. సీఎం కేసీఆర్ తెలంగాణ నీటిగోసకు శాశ్వత పరిష్కారం కోసం చేసింది అదే. తెలంగాణ పీఠభూమిపై ఉన్నది. నదుల నీళ్లు తలాపున పారుతాయి. ఆ నీటిని పైకెక్కించడం కష్టమంటూ పరాయి పాలకులు మభ్యపెడుతూ వచ్చారు. నీరు పల్లమెరుగు అని దబాయించారు. కానీ నీటికి పైపైకి ఎగబాకడం ముఖ్యమంత్రి కేసీఆర్ నేర్పారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం సీఎం కేసీఆర్కు వెన్నతో పెట్టిన విద్య. అసాధారణమైన రీతిలో ప్రాజెక్టును రీ డిజైనింగ్ చేసి నదినే రిజర్వాయర్గా మలిచారు. మెట్టుమెట్టుగా నీటిని తెలంగాణ గడ్డపైకి ఎక్కించి అద్భుతం సాధించారు. ఆ నీటి నిల్వకు గొలుసుకట్టుగా రిజర్వాయర్లు కట్టారు. ఇది ఎవరికీ తట్టని విషయం. ఇది ఎవరూ ఊహించని విజయం.
కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఊహల్లో రెక్కలు తొడుగుతునప్పుడు, కేవలం మూడేండ్ల వ్యవధిలో మహా నిర్మాణమై మన కండ్లముందు సాక్షాత్కరించినప్పుడు ఎవరెవరో ఏవేవో అన్నారు. కానీ అవేవీ ఆయన లెక్క చేయలేదు. తాననుకున్నది సాధించి చూపారు. కరువు గడ్డను జలభాండంగా చేసి చూపారు. మేడారంలో మొదలయ్యే జల ప్రయాణం కొండలు గుట్టలుగా సాగుతున్నది. కాళేశ్వర జలాలు తెలంగాణ తల్లికి పచ్చని చీరకట్టాయి. ఇప్పుడు ఆ కాళేశ్వరమే నీటికరువు నుంచి రాష్ర్టాన్ని ఆదుకునేందుకు ముందుకు వస్తున్నది. కరువును శాశ్వతంగా తరిమికొట్టడంలో తెలంగాణ సాధించిన ఈ విజయాన్ని ప్రపంచం అబ్బురంతో పరికిస్తున్నది. భారతదేశ సాగునీటి సమస్యలకు కూడా ఇదే తరహా పరిష్కారాలు కావాలని అంటారు ముఖ్యమంత్రి కేసీఆర్. దేశంలోని నదుల నీళ్లు సముద్రం పాలు కావడం ఏమిటని ఆవేదన చెందారు. సాగు యోగ్యమైన భూమి మనకు దండిగా ఉన్నది. నిండుగా పారే జీవనదులూ ఉన్నాయి. ఆ నదుల నీటిని ఒడిసిపట్టి నీటిపారుదల సౌకర్యం కల్పిస్తే బంగారు పంటలు పండించి ప్రపంచానికే భారతదేశం అన్నపూర్ణ అవుతుంది. సాగుతో సహా సమస్త రంగాల్లో తెలంగాణ మాడల్ను దేశమంతటా ఆవిష్కరిస్తే భారత్ ప్రపంచానికే మాడల్ అవుతుందనేది సీఎం కేసీఆర్ స్వప్నం.