ఉద్యోగులే ప్రభుత్వ కార్యక్రమాల సారథులని, పరిపాలనా వ్యవస్థకు, ప్రజలకు మధ్య వారధులని ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టిగా నమ్ముతారు. ఉద్యమకాలం నుంచీ వారితో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. వారి యోగక్షేమాల మీద ఆయన నిరంతరం ప్రత్యేక శ్రద్ధ చూపుతుంటారు. మొదటి పీఆర్సీతో దేశంలోనే అత్యధిక వేతనాలు పొందే ఉద్యోగులుగా వారిని నిలబెట్టిన సీఎం కేసీఆర్ తాజాగా మరో పీఆర్సీ ప్రకటించి శుభవార్త తెలిపారు. పెరిగిన జీవన వ్యయాలకు అనుగుణంగా వారి వేతనాలు పెరగాలని గత ఆగస్టు 6న అసెంబ్లీ వేదికగా ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారు.
తెలంగాణ ఏర్పాటైన తర్వాత సీఆర్ బిస్వాల్ అధ్యక్షతన మొదటి పీఆర్సీ వేసిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు శివశంకర్ నేతృత్వంలో రెండో పీఆర్సీ ఏర్పాటు చేసింది. దీంతోపాటుగా అక్టోబర్ నెల నుంచి 5 శాతం మధ్యంతర భృతిని కూడా మంజూరు చేయడం ముదావహం. దీనివల్ల ఖజానాపై రూ.2 వేల కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా. వేతన సవరణ జరిగితే ఈ వ్యయం మరింత పెరుగుతుందని చెప్పొచ్చు. ఈ సరికే దేశంలో అత్యధిక వేతనం పొందుతున్న తెలంగాణ ఉద్యోగులకు తాజా పీఆర్సీ వల్ల మరింత లబ్ధి చేకూరనున్నది. అభివృద్ధి, సంక్షేమాలతో పాటుగా ఉద్యోగుల వేతనాల్లోనూ తెలంగాణ నంబర్వన్గా నిలవడం గమనార్హం. అంగన్వాడీ, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకూ పీఆర్సీ వర్తింపజేయాలని నిర్ణయించడం ప్రభుత్వం పెద్దమనసుకు నిదర్శనం. ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీతాలతో పాటుగా పింఛనర్లకు పింఛన్లు పెరుగనుండటం హర్షణీయం. సమైక్య రాష్ట్రంలో పీఆర్సీ కోసం ఉద్యోగులు పోరుబాట పట్టినా అప్పటి ప్రభుత్వాలు స్పందించేవి కావు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని ఇప్పటి ప్రభుత్వం అడగకుండానే వరాలిస్తూ ‘ఉద్యోగ మిత్ర’ అనే బిరుదును సార్థకం చేసుకుంటున్నది. గత జూలై 3న లాంఛనంగా ఉద్యోగ సంఘాల నేతలు సీఎంను మర్యాదపూర్వకంగా కలిసి వేతన సవరణ గురించి విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత మూడురోజులకే అసెంబ్లీలో హమీ ఇచ్చి నెల తిరక్కుండానే ఆ హామీని నిలబెట్టుకున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. పెరిగే ఖర్చుల రీత్యా నిరంతర వేతన సవరణ అనేది ఉద్యోగితో ప్రభుత్వానికి ఉండే అనుబంధాన్ని మరింత పటిష్టపరుస్తుంది. నిరంతరం వారిని కార్యోన్ముఖులను చేసే చోదకశక్తిగా పనిచేస్తుంది. ఇదివరకు వేతన సవరణ కమిటీ సిఫారసు చేసిన స్థాయికి మించి వేతనాలు పెంచిన తెలంగాణ మరోసారి తగిన స్థాయిలో లబ్ధి చేకూరుస్తుందని భావించవచ్చు. మొదటి పీఆర్సీ ఏడున్నర శాతం ఫిట్ మెంట్ సిఫారసు చేస్తే తెలంగాణ ప్రభుత్వం ఏకంగా 30 శాతం ఫిట్మెంట్ ప్రకటించి ఉద్యోగులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచింది. దానివల్ల రూ.12.5 వేల కోట్ల అదనపు భారం పడినా సర్కారు వెనుకంజ వేయకుండా అమలు చేసింది. కరోనా కల్లోలం, ఆర్థికపరమైన చిక్కులు ఎన్ని ఎదురైనా ఉద్యోగుల సంక్షేమం విషయంలో ప్రభుత్వం చెరగని చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్నది. తాజా పీఆర్సీ ప్రకటనతో సహజంగానే ఉద్యోగుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామని ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించడం ప్రశంసనీయం.