ఎవుసాన్ని ఎటమటం చేయాలని కంకణం కట్టుకున్నట్టు మాట్లాడుతున్నారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి. మచ్చుకు రైతుల ఉచిత కరెంటు మీద ఆయన వేస్తున్న కుప్పిగంతులు చూస్తే సరిపోతుంది. అమెరికా కదా ఎవరికి తెలుస్తుంది అని రైతులకు మూడు గంటల కరెంటు చాలని నోరు జారారు. దొంగతనం దాచేస్తే దాగదు కదా? పిల్లి కండ్లు మూసుకుని పాలు తాగితే లోకానికి తెలియదా? ఆ మాట గుప్పుమనడంతో సమర్థనలతో కాలయాపన చేస్తున్నారు. పూటకో మాటతో కాంగ్రెస్ అసలు రంగు బయటపెడుతున్నారు. తప్పు మీద తప్పు చేస్తూ అడ్డంగా దొరికి పోతున్నారు. పొలం అంతటికీ నీరు పారించాలంటే మూడు గంటలు ఎలా సరిపోతుందన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేక పది హెచ్పీల మోటర్లు పెట్టుకోమని ఉచిత సలహా ఇచ్చారు. అదసలు సాధ్యమేనా? ఇలా కరెంటుపై నోటికి వచ్చింది మాట్లాడేస్తున్న రేవంత్ వ్యవసాయ పరిజ్ఞానం మీద సందేహాలు వ్యక్తం కావడం గమనార్హం.
ఈ సందర్భంగా మూడు ప్రశ్నలు తలెత్తుతాయి. మూడుగంటల కరెం టు అంటే రోజులో ఏ మూడు గంటలు? ఉదయమా, సాయంత్రమా, పగలా, రాత్రా? అనేది మొదటిది. ఇప్పుడు చాలా బావుల మీద ఉన్నవి మూడు హెచ్పీలు, ఐదు హెచ్పీల మోటర్లే. మరి పది హెచ్పీల మోట ర్లు పెట్టాలంటే వేలకోట్లు ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు ఎవరిస్తారు? అనేది రెండో ప్రశ్న. రాష్ట్రంలో సుమారుగా 28 లక్షల వ్యవసాయ పంపుసెట్లు ఉన్నాయి. ఖర్చు ఎవరు భరిస్తారనేది పక్కన పెట్టి అందరూ పది హెచ్పీ మోటర్లు పెట్టుకున్నారనే అనుకుందాం. అన్ని మోటర్లు ఒక్కసారిగా ఆన్ చేస్తే అంత లోడ్ ఎక్కడ నుంచి వస్తుంది? అంత స్థాపిత సామ ర్థ్యం ఉందా? గ్రిడ్ కుప్పకూలితే ఏమవుతుంది? అనేది మూడో ప్రశ్న. అయితే రేవంత్ వాచాలత వల్ల ఒక మేలు జరిగింది. కాంగ్రెస్కు తప్పీదారి ఓటేస్తే ఎట్ల ఆగం చేస్తదో ఆయన మాటలు తెలియజేస్తున్నాయి. ఆయన గొప్పగా చెప్పుకొంటున్న కర్ణాటక పరిస్థితి చూస్తే కాంగ్రెస్ మార్కు పరిపాలన ఎలా ఉంటుందో అవగతమవుతుంది. అక్కడ సాగు కు ఐదు గంటల కరెంటు ఇస్తామని చెప్పి అదీ ఇవ్వలేక చతికిలబడింది.
బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో ఎవుసం పచ్చగా కళకళలాడుతున్నది. రైతుల ముఖాల్లో సంతోషం పండుతున్నది. 24 గంటల నాణ్యమైన, ఉచిత కరెంటు, పుష్కలంగా సాగునీరు, పంట పెట్టుబడికి రైతుబంధు, ఆపతి వస్తే ఆదుకునేందుకు రైతుబీమా, అందుబాటులో ఎరువులు, విత్తనాలు, చివరిగింజ వరకూ ప్రభుత్వమే కొనుగోలు, ధాన్యం నిల్వ చేసుకునేందుకు దండిగా గిడ్డంగులు.. ఇది కదా ఇప్పుడు మన ఎవుసం తీరుతెన్నులు. ఇది చూసి కన్ను కుట్టిందో ఏమో రేవంత్కు. బాగుపడ్డ సాగును పడావుపెట్టి రైతును ఆగం జేద్దామని అనుకుంటున్నారు. సీఎం కేసీఆర్ పరిపాలనా నైపుణ్యానికి, సంక్షేమ సహృదయానికి ప్రతీకలాంటి 24 గంటల కరెంటుపై అష్టొంకర మాటలు పేలుతున్నారు. కాంగ్రెస్ పాలనలో అర్ధరాత్రి అపరాత్రి గంటల కొలతలతో ఇచ్చిన కరెంటు కష్టాలు రైతులకు తెలుసు. ఎరువుల కోసం మూడు గంటలకు, మూడు పంటలకు ఉన్న తేడా తెలుసుకుని ఎవరిని మూలకు పెట్టాలో, ఎవరిని ముందుకు తేవాలో కూడా వారికి తెలుసు.