దేశం ఆర్థిక పరిస్థితి గాడి తప్పిపోతున్నా, భవిష్యత్తుపై భయాందోళనలు చెలరేగుతున్నా మోదీ ప్రభుత్వం బడ్జెట్లో పేద వర్గాలను విస్మరించిన తీరు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నది. దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నది. నిరుద్యోగం పెరిగి యువతలో అనిశ్చితి చోటు చేసుకుంటున్నది. ఆకలి సూచిక కూడా మన అధ్వాన్న స్థితిని వేలెత్తి చూపుతున్నది. ఆర్థిక అంతరాలు పెరిగిపోయాయి. వ్యవసాయం సంక్షోభం మూలంగా రైతులు రోడ్డెక్కుతున్నారు. అయినా ఈ అవలక్షణాలను చక్కదిద్దే ప్రతిపాదనలు బడ్జెట్లో ఏ మాత్రం లేవు. బడ్జెట్ యావత్తూ రైతులు, గ్రామీణులు, పేదల వ్యతిరేకతతో నిండిపోయింది. ఆశ్రిత పెట్టుబడిదారులకు అందినంత దోచిపెట్టాలనే యావ తప్ప ప్రజల సంక్షేమం పట్ల కొంచెమైనా ఆసక్తి లేదని మోదీ సర్కారు తాజా బడ్జెట్ ప్రతిపాదనలు చూస్తే విశదమవుతున్నది.
దేశంలో పేద, ధనిక అంతరాలు పెరుగుతున్నాయని అంతర్జాతీయ అధ్యయనాలలో వెల్లడైంది. ఇది ప్రమాద సూచిక అని ప్రపంచ చరిత్ర గమనిస్తే అర్థమవుతుంది. కరోనా కాలంలో కూడా పేదలు అల్లాడిపోతుంటే, కోట్లాది మంది ఉపాధి కోల్పోతే, మరో వైపు ఘనత వహించిన మోదీ సన్నిహిత బేహారుల ఆదాయాలు పెరిగిపోవడం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక నిపుణులను ఆశ్చర్యపరిచింది. వ్యాపార సంస్థల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. వ్యాపారాభివృద్ధి, సామాజికాభివృద్ధి జోడుగుర్రాల మాదిరిగా దౌడు తీయాలి. కానీ కాకులను కొట్టి గద్దలకు పెట్టినట్టు కొందరు వ్యాపారులను మేపడమే ప్రభుత్వ విధానమై పోయింది. ఈ అడ్డగోలు వైఖరిని మార్చుకోకుండా రివాజుగా కొన్ని కేటాయింపులు చేయడమే బడ్జెట్ అని మోదీ ప్రభుత్వం నమ్మింప చూస్తున్నది. దేశ సంపదను కొందరి చేతుల్లో కుప్పపోసే విధానాల వల్ల దేశంలో సామాజిక అనిశ్చితి చెలరేగిపోదా?
పెట్టుబడి వ్యయం కోసం పది లక్షల కోట్లు కేటాయించినట్టు బడ్జెట్లో కేంద్రం ప్రకటించింది. భారీ సంఖ్యలో ఎయిర్పోర్టుల నిర్మాణం చేపడుతున్నట్టు కూడా చెప్పుకున్నది. కానీ అవి ఏ రాష్ట్రంలో ఏ రంగానికి చేరుతాయనే సందేహాలున్నాయి. మోదీ సర్కారు దృష్టిలో దేశమంటే గుజరాత్, ఎన్నికలు జరిగే కొన్ని రాష్ర్టాలు మాత్రమే కదా అన్న అభిప్రాయం నెలకొన్నది. దేశమంతా సమగ్ర, సమ్మిళిత అభివృద్ధి సాధించాలనే విశాల దృష్టి బీజేపీ పాలకులకు కొరవడింది. మోదీ సర్కారు సంకుచితత్వం వల్ల సామాజిక, ప్రాంతీయ అసమానతలు, వివక్షలు- విభేదాలు చెలరేగిపోతాయి. దేశ సంక్షేమం, పేదల అభ్యున్నతి పట్ల తనకు పట్టింపు ఉన్నదని నిరూపించుకోవడానికి, తప్పిదాలను చక్కదిద్దుకోవడానికి లభించిన చివరి అవకాశాన్ని మోదీ సర్కారు ఉపయోగించుకోలేకపోయింది. బీజేపీ పాలకుల తొమ్మిదేండ్ల నిర్వాకాన్ని దేశ ప్రజలు గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికల కోసం కాచుకుని ఉన్నారు, తమ తీర్పు ద్వారా గుణపాఠం చెబుతారు.