అయితే బుకాయింపు, కాదంటే దబాయింపు.. కాంగ్రెస్కు తెలిసినవి ఈ రెండే విద్యలు. రైతుబంధు విషయంలో రెండింటినీ మార్చిమార్చి ఉపయోగిస్తున్న రాష్ట్ర సర్కారు చివరికి ఇరికి ఇగిలించే పరిస్థితి వచ్చింది. పూటకోమాటతో దాటవేస్తున్న కాంగ్రెస్కు కేసీఆర్ అదిలింపుతో గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టయింది. ‘బిడ్డా నీ సంగతి జూస్తా’ అని కేసీఆర్ తాఖీదు ఇస్తే దెబ్బకు దెయ్యం వదిలింది. ఓటమి భయంతో లబ్ధిదారుల ఖాతాల్లో హడావుడిగా డబ్బులు వేసింది. ఐదెకరాలకే పరిమితం చేయాలనే ఆలోచన సర్కారుకు ఉన్నా తప్పనిసరి పరిస్థితిలో అందరికీ అందజేసింది.
ఇది ఏ రకంగా చూసినా కేసీఆర్ విజయమే. తెలంగాణ రైతాంగానికి అండగా నిలబడేది కేసీఆర్ మాత్రమేనని మరోసారి రుజువైన సందర్భమిది. నిజానికి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే రైతుబంధు కోసం కేసీఆర్ నిధులు కేటాయించారు. ఇక పంపిణీ చేయడమే తరువాయి అన్న దశలో కాంగ్రెస్ సైంధవునిలా అడ్డుపడింది. ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించి మరీ రైతుబంధును ఆపించింది. ఎన్నికల్లో గద్దెనెక్కిన తర్వాత అలవాటుగా అసలు విషయం మరిచింది. డిసెంబర్లో పడాల్సిన డబ్బులు యాసంగి సీజన్ ముగిసిన తర్వాత మే నెలలో వేసి ఏదో ఘనకార్యం సాధించినట్టు కాంగ్రెస్ పోజులు కొడుతున్నది. ఈ పరిణామం వెనుక మనకు రెండు కారణాలు కనిపిస్తాయి. ఆనాడు ఆపించింది కేసీఆర్కు ఎక్కడ పేరు వస్తుందోననే భయం వల్ల అని. ఇప్పుడు వేసింది కూడా కేసీఆర్ చేసిన హెచ్చరికల దడుపు వల్ల!
రాష్ట్ర సాధకుడిగా, సమగ్ర అభివృద్ధి సారథిగా కేసీఆర్ నిర్వహించిన పాత్ర ఎవరూ కాదనలేనిది. అధికారం కోసం బూటకపు హామీలిచ్చిన చరిత్ర కేసీఆర్కు ఎన్నడూ లేదు. చెప్పినవీ, చెప్పనివీ చేసి చూపిన దార్శనికునిగా, రాజకీయ ప్రతికూలతలను తట్టుకుని నిలబడ్డ యోధునిగా ఆయనకు పేరుంది. అలాంటి కేసీఆర్ పట్ల కాంగ్రెస్ అక్కసు పెంచుకుంది. రాష్ట్ర సాధన ఉద్యమంలో రెండు ముఖాలతో ఆ పార్టీ నడిపిన అవకాశవాద రాజకీయాన్ని ప్రజలు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ముసలి కాంగ్రెస్ను ఛీ కొట్టి మూలకు పడేశారు. ఒకటికి రెండుసార్లు కేసీఆర్కు అధికారం అప్పజెప్పి తెలంగాణకు అసలైన కాపలా ఎవరో సూటిగా, సుత్తి లేకుండానే చెప్పారు. అందుకే కేసీఆర్ అంటే కాంగ్రెస్కు మంట.
ముఖాముఖి పోటీలో కేసీఆర్ను గెలవడం కల్ల అని కాంగ్రెస్కు తెలుసు. నేరుగా ఎదుర్కోవడం సాధ్యం కాదు కనుకనే మాయోపాయంతో, జిత్తులమారి హామీలతో ఓటర్లను ఊదరగొట్టి ఏమార్చింది. హామీలను నమ్మరేమో అనే అపనమ్మకంతో వాటికి గ్యారెంటీలంటూ తొడుగులు తగిలించింది. బాండ్ల ముసుగు వేసింది. కాంగ్రెస్ నేతలు అసాధ్యమైన హామీలతో అరచేతిలో స్వర్గం చూపించారు. అధికారం హస్తగతం చేసుకున్నారు. ఫలితం మరోసారి తెలంగాణ విధ్వంసం. సాగుతో సహా సమస్త రంగాలు సంక్షోభంలోకి జారుకుంటున్నాయి.
దేశానికే అభివృద్ధి నమూనాగా నిలిచిన సరికొత్త రాష్ట్రం కాంగ్రెస్ నిర్వాకం వల్ల అట్టడుగుకు పడిపోతున్నది. మూడునాలుగు నెలల్లోనే కాంగ్రెస్ పాలన అంటే ఏమిటో ప్రజలకు అర్థమైపోయింది. హామీల అమలు కాంగ్రెస్ సర్కారుకు గుదిబండగా మారింది. ఇందులో అన్నిటికన్నా ఎక్కువగా చెప్పుకోగలిగింది రైతుబంధు గురించి. ‘బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరాకు ఏటా పదివేల రూపాయలిస్తే.. మేం రైతు భరోసాగా పేరు మార్చి పదిహేను వేలిస్తాం’ అని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. పెంచుడు మాట దేవుడెరుగు, అంతకు ముందున్నది ఇస్తే అదే పదివేలన్నట్టుగా పరిస్థితి మారిపోయింది.
ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ దూసుకుపోతున్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. కాంగ్రెస్ తమను నిలువునా ముంచిందని మొరపెట్టుకుంటున్నారు. తెలంగాణ గోస తెలిసిన పెద్దదిక్కు అయిన కేసీఆర్ వారికి భయం లేదని భరోసా ఇస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అప్పజెప్పిన విపక్ష పాత్రను సమర్థంగా పోషించి, సమస్యలపై గిరిగీసి కొట్లాడతానని తెగేసి చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అన్యాయాలకు ప్రజల తరఫున పంజు (పెద్ద మనిషి)గా నిలిచి కొట్లాడుతానని మాట ఇస్తున్నారు.
ఈ మాటలకు ప్రజల నుంచి లభిస్తున్న ఆత్మీయ స్పందన చూసి కాంగ్రెస్ గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. నానా కుట్రలు పన్ని కేసీఆర్ ప్రచారానికి 48 గంటలు బ్రేక్ వేయించడమే అందుకు నిదర్శనం. కేసీఆర్ గొంతు నొక్కితే గానీ తాము గెలవలేమనేది బహుశా వారి ఉద్దేశమేమో. కానీ, నిషేధం ముగిసిన తర్వాత కేసీఆర్ రెట్టించిన ఉత్సాహంతో ప్రజల మధ్యకు వెళ్లారు. ‘మీ సమస్యల మీద నేను సర్కారును నిలదీస్తా’ అని మాటిచ్చారు.
‘రైతుబంధు ఎట్ల వేయరో చూస్తా’ అని అన్నదాతల తరఫున గొంతెత్తారు. ఆయన చర్నకోల ఛెళ్లు మనిపించిన తర్వాతే కాంగ్రెస్ దిక్కు లేక దిగి వచ్చిందన్నది నూరు శాతం వాస్తవం. కండ్ల ముందు కనిపించే సత్యం. అయితే రైతుబంధు విషయంలో కాంగ్రెస్ మరోసారి తన సంకుచితత్వాన్ని బయటపెట్టుకున్నది. ఎన్నికల్లో ఓట్ల కోసం వేస్తున్నట్టే చేసి, దొడ్డిదారిన ఈసీని ఆశ్రయించి మళ్లీ ఆపేయించింది. అసెంబ్లీ ఎన్నికలప్పటి నాటకాన్ని మళ్లీ రక్తి కట్టించింది. ఇదీ ఆ పార్టీ చిత్తశుద్ధి.
కాంగ్రెస్కున్న తెలంగాణ సోయి ఏపాటిదో జనానికి తెలియంది కాదు. అభివృద్ధి సంక్షేమాల అమలులో ఆ పార్టీ పనితీరు పెద్ద రహస్యమేమీ కాదు. అమలు సాధ్యం కాని అడ్డగోలు హామీలతో అధికారంలోకి రావడం, ఆపై మాటతప్పడం కాంగ్రెస్కు అలవాటే. ఇచ్చిన ‘నిరుద్యోగ భృతి’ హామీ ఇవ్వనేలేదని ఉపముఖ్యమంత్రి భట్టి బొంకినా, ఇవ్వని 2500 రూపాయలను మహిళలకు ఇస్తున్నట్టు రాహుల్గాంధీ అబద్ధమాడినా అవి ఈ కోవలోనివే. అర్ధసత్యాలు, అసత్యాలతో కాలయాపన వారి నైజం. మంది బిడ్డలను తన బిడ్డలుగా చెప్పుకొని ముద్దాడటం కాంగ్రెస్కు వెన్నతో పెట్టిన విద్య అని కేసీఆర్ ఎప్పుడూ అంటుంటారు. పథకం తెచ్చింది కేసీఆర్.
నిధులు సమకూర్చిందీ కేసీఆరే. చివరకు కేసీఆరే రంగంలోకి దిగి గూబ గుయ్యిమనిపిస్తే గానీ కాంగ్రెస్ కండ్లు తెరవలేదు. అయినా సీఎం రేవంత్ మేకపోతు గాంభీర్యంతో మాట్లాడుతున్నారు. ఆకాశాన్ని నేలకు దించినట్టు గొప్పలకు పోతున్నారు. ‘రైతుబంధు ఇచ్చాం.. కేసీఆర్ ముక్కు నేలకు రాస్తాడా’ అంటూ అర్థంపర్థం లేని వాగాడంబరం ప్రదర్శిస్తున్నారు. కానీ, ఇక్కడ ఉన్నది కేసీఆర్. రాష్ట్ర వ్యవసాయ స్వరూపాన్నే మార్చి అధిక దిగుబడులతో దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టిన కేసీఆర్ ముందు కాంగ్రెస్ వేసే కుప్పిగంతులు నిలబడజాలవు. ప్రభుత్వ వైఫల్యాల మీద నుంచి దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ వేస్తున్న చిల్లర వేషాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మోసపోయి గోసలు పడుతున్న ఆ ప్రజలే రేపటి ఎన్నికల్లో రేవంత్ ముక్కు నేలకు రాయించడం తథ్యం!