మహాభారత సంగ్రామానికి నగారా మోగింది. దేశంలోని పార్టీలన్నీ తమ తమ స్థాయికి తగ్గట్టుగా శంఖాలను పూరిస్తున్నాయి. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం అన్నిటికంటే ఒక రవ్వ ఎక్కువ సందడి చేస్తున్నది. విధానాలు, కార్యక్రమాల కంటే తమకు ఇన్ని సీట్లు వస్తాయని, అన్ని సీట్లు వస్తాయని ఊదరగొడుతున్నది. అటు అంతర్గత కలహాలతో ఇండియా కూటమి కొట్టుమిట్టాడుతుండగా.. ఇటు కొత్తగా కలిసివచ్చే మిత్రులను కలుపుకొంటూ ఎన్డీయే కూటమి సమరోత్సాహంతో దూకుడుగా వ్యవహరిస్తున్నది. అయితే వీటిలో ఒకటి మతాన్ని అడ్డుపెట్టుకొని.. మరొకటి ఉచితాల ఎర వేస్తూ ఎన్నికల గోదాలోకి దిగుతున్నాయి. అంతే తప్ప దేశ ప్రయోజనాలకు పెద్దపీట వేసే సుదీర్ఘకాల ప్రణాళికలు ఉన్నట్టు వారి ప్రచారాల్లో ఎక్కడా కనిపించడం లేదు. ఇచ్చిన హామీలను ఏ మేరకు అమలు చేశామో చెప్పుకొని ఓట్లు అడిగే ధైర్యం బీజేపీకి లేదేమో. అందుకే పేదరికం, నిరుద్యోగం, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తదితర అంశాలు ప్రచారంలోకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నది. అదే సమయంలో దేశంలోని సమస్యలను లేవనెత్తడంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ఇప్పటికీ బీజేపీ వ్యూహం నుంచి బయటకు రాలేకపోతున్నది.
మరోవైపు ఎన్నికల కమిషన్ నిబద్ధతపై ప్రతిపక్ష పార్టీలు వేలెత్తి చూపుతున్నాయి. బీజేపీకి లాభం చేకూరేలా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్నదని, అందుకే ఆ పార్టీకి అనుకూలంగా ఉండేలా సుదీర్ఘమైన షెడ్యూల్ను విడుదల చేసిందని ఆరోపిస్తున్నాయి. పశ్చిమబెంగాల్లో ఏడు దశల్లో ఎన్నికలుండేలా షెడ్యూల్ను విడుదల చేయడాన్ని అం దుకు ఉదాహరణగా చూపిస్తున్నాయి. ప్రతిపక్షాల ఆరోపణలకు బలం చేకూరేలా ఇటీవల ఎన్నికల కమిషన్లో పలు పరిణామాలు జరగటం గమనార్హం. పార్లమెంట్ ఎలక్షన్ల వేళ స్పష్టమైన కారణం లేకుండానే ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేయడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసే కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించి, కేంద్ర ప్రభు త్వం ఆ స్థానంలో కేంద్ర హోంమంత్రిని చేర్చడం వివాదాస్పదమైంది. సుప్రీంకోర్టులో దీనిపై కేసు నడుస్తుండగానే కొత్త పద్ధతిలో ఇద్దరు ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేయడం గమనార్హం. స్వయంగా తనపైనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించి, తనను తాను నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్పై ఉన్నది. ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి, మరోవైపు తెలంగాణ గవర్నర్ కూడా ఎన్నికల సమరంలోకి దూకుతున్నారని వార్తలు వినవస్తుండటం ప్రజాస్వా మ్యాన్ని పరిహాసం చేయడమే.
దేశమంటేనే రాష్ర్టాల కలయిక. ఈ ఎన్నికల్లో జాతీయ ఎజెండా మాత్రమే ఉంటే సరిపోదు. ప్రాంతీయ ఆశలు, ఆకాంక్షలు కూడా ఎన్నికల హామీల్లో ప్రతిఫలించాల్సిందే. అయితే జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లకు ఈ విషయంలో కొన్ని పరిమితులున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ తరహాలో దేశంలోని అనేక ప్రాంతాల్లో స్థానిక అంశాలకు ప్రాధాన్యం ఇచ్చే పార్టీలున్నాయి. ప్రాంతీయ ఆకాంక్షలకు పెద్దపీట వేసే పార్టీలు ఈ సారి కొంత మెరుగైన ఫలితాలు సాధిస్తాయనే వాదనలు బలంగా వినవస్తున్నాయి. బీజేపీ మూడో విడత ప్రయత్నాలు, కాంగ్రెస్ మరో చాన్స్ ప్రచారాల మధ్య ప్రాంతీయ పార్టీల పాత్ర పెరిగితే.. కేంద్రం ఏకచ్ఛత్రాధిపత్యం కొంత తగ్గిపోతుంది.