సుప్రీంకోర్టు జోక్యంతో ఢిల్లీ మేయర్ ఎన్నిక పూర్తయి, ఆమ్ ఆద్మీ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ‘గూండాలు ఓడిపోయారు. ప్రజలు గెలిచారు’ అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. కటువుగా ఉన్నా ఆ మాటల్లో నిజం లేకపోలేదు. బీజేపీ వ్యవహారం ఏ కోణంలో, ఏ విధంగా చూసినా కూడా అప్రజాస్వామికంగా, నిరంకుశంగా, ఇంకా చెప్పాలంటే అన్ని విలువలకు, సంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చే బరితెగింపుతనంతో ఉంటున్నది. దేశాన్ని దాదాపు తొమ్మిదేండ్లుగా ఏలుతున్న బీజేపీ ఎంతో బాధ్యతతో, ఇతర పార్టీలకు మార్గదర్శకంగా ఉండాలి. కానీ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ వంటి చిన్న విషయంలో కూడా రాద్ధాంతం చేయడం ఆ పార్టీ నైతిక పతనానికి సూచిక.
ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్కు స్పష్టమైన మెజారిటీ వచ్చింది. కానీ కేంద్రం చేతుల్లో ఉండే లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసిన 10 మంది సభ్యులకు ఓటు హక్కు ఉంటుందని బీజేపీ కొత్త వాదన తీసుకొచ్చింది. దీనిని ఆప్ కౌన్సిలర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. మేయర్ ఎన్నికకు మూడుసార్లు జరిగిన ప్రయత్నాలు రసాభాస మధ్య ముగిశాయి. 250 మంది సభ్యులున్న ఢిల్లీ కార్పొరేషన్లో ఆప్కు 134 మంది, బీజేపీకి 105 మంది కౌన్సిలర్లున్నారు. నామినేటెడ్ సభ్యులు బీజేపీకి ఓటు వేసినా కూడా మేయర్ పీఠం ఆప్కే దక్కుతుంది. కానీ శక్తిమంతమైన స్టాండింగ్ కమిటీలో బీజేపీ బలం పెరుగుతుంది. దీనివల్లే ఆప్ తొలి నుంచీ నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు లేదంటూ అడ్డుకుంది. చివరికి సుప్రీంకోర్టు కూడా అదే విషయాన్ని తేటతెల్లం చేయటంతో బీజేపీ కుయుక్తులకు అడ్డుకట్ట పడింది. 15 ఏండ్లుగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్పై కొనసాగుతున్న బీజేపీ ఆధిపత్యం ముగిసింది. మూడు విభాగాలుగా ఉన్న కార్పొరేషన్ను ఒక్కటి చేసి, నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఎన్నికలు జరుపటం ఈసారి విశిష్టత.
ఢిల్లీలో అధికారంలో ఉన్న కేజ్రీవాల్ ప్రభుత్వం విద్య, వైద్య రంగాల్లో చేసిన ప్రయోగాలు ఇప్పటికే దేశంలోని పలు రాష్ర్టాలతోపాటు విదేశీ సంస్థలను కూడా ఆకర్షించాయి. ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్ పగ్గాలూ లభించటంతో అక్కడ కూడా తనదైన ముద్ర చూపించే అవకాశం ఆప్కు దక్కింది. దీనిని ఆ పార్టీ సద్వినియోగం చేసుకోవాలి. బీజేపీ సైతం తన ధోరణిని ఇప్పటికైనా మార్చుకుంటే ఆ పార్టీకే మంచిది. ఢిల్లీలో కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ, గతుకుల రోడ్లు మంచినీటి కొరత వంటి పలు సమస్యలున్నాయి. వీటి పరిష్కారానికి అధికార పక్షానికి సహకరించాలి. నిర్మాణాత్మక వైఖరితో ప్రజల హృదయాలను చూరగొనాలి. కేంద్రలో అధికారంలో ఉన్నందున ఏం చేసినా నడుస్తుందనే అహంకారాన్ని విడిచిపెట్టకపోతే ప్రజలు గుణపాఠం నేర్పుతారనడానికి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలే ఉదాహరణ.