బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా వాజెద్ నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ ఘన విజయం సాధించింది. ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ఈ ఎన్నికల్లో పాల్గొనలేదు. దీంతో బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహ్మాన్ కుమార్తె షేక్ హసీనా సునాయాసంగా ఐదోసారి ప్రధాని పీఠాన్ని చేజిక్కించుకున్నారు. ఈ ఎన్నికల చుట్టూ పలు వివాదాలు ముసరడం తెలిసిందే.
ప్రధాని షేక్ హసీనా ఎన్నికలను జరిపిన తీరుపై అంతర్జాతీయంగా విమర్శలు వచ్చాయి. ఆ దేశ ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీతో పాటు దాని మిత్రపక్షాలు ఈ ఎన్నికలను బహిష్కరించాయి. నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారన్న అభియోగాలపై జైలుశిక్ష అనుభవిస్తున్న ఆ పార్టీ అధ్యక్షురాలు ఖాలిదా జియా ప్రస్తుతం గృహ నిర్బంధంలో ఉన్నారు. ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు, పలువురు మిత్రపక్షాల నాయకులు ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నారు. దీంతో ఎన్నికల పోరు ఏకపక్షంగా మారింది. తాజా ఎన్నికల్లో 40 శాతం ఓట్లు పోలవడమే దీనికి నిదర్శనం.
1991లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ తర్వాత రెండో కనిష్ఠ ఓటింగ్ శాతంగా దీన్ని పేర్కొంటున్నారు. ఈ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగలేదని అగ్రరాజ్యం అమెరికా తదితర పాశ్చాత్య దేశాలు విమర్శించాయి. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సైతం ఎన్నికలు జరిగిన వాతావరణంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం ఒక పార్టీ పార్లమెంట్ మాత్రమే ఏర్పడిందని అవామీ లీగ్ దాని మిత్రపక్షాలే ఇందులో పాల్గొన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలను బీఎన్పీ మౌనంగా స్వీకరిస్తుందా? లేదా ఆందోళనలకు తెరదీస్తుందా? అనేది వేచిచూడాలి.
ఏదేమైనప్పటికీ మన దేశంతో సుదీర్ఘ సరిహద్దును పంచుకుంటున్న బంగ్లాదేశ్లో షేక్ హసీనా నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటవడం భారత్కు సానుకూల పరిణామమే. మన దేశానికి అనుకూల వ్యక్తిగా పేరున్న ఇబ్రహీం మహమ్మద్ సోలి మాల్దీవులు అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిపాలైన ప్రస్తుత తరుణంలో పొరుగునున్న మరో దేశంలో భారత అనుకూల ప్రభుత్వం ఏర్పాటు కావడం ఊరట కలిగించే విషయమే. మాల్దీవులు ప్రస్తుత అధ్యక్షుడు మాయిజ్జు చైనా చేతిలో పావుగా మారి మన దేశంతో కయ్యానికి కాలు దువ్వుతున్న విషయం విదితమే.
ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లో అవామీ లీగ్ గెలుపొందడం మనకు వ్యూహాత్మకంగా లాభించే వ్యవహారమే. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలున్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో బంగ్లాదేశ్ సరిహద్దు మరికొంతకాలం పాటు సురక్షితమనే చెప్పుకోవాలి. పాకిస్థాన్ సరిహద్దు తరహాలోనే అక్రమంగా మన దేశంలోకి చొరబడే ఉగ్రవాదులతో పోరు మన సైనికులకు తప్పింది. ఈ ఎన్నికలు జరిగిన తీరును తప్పుబట్టిన అమెరికా.. బంగ్లాదేశ్పై ఆంక్షలు విధించకుండా చూసుకోవాల్సిన బాధ్యత భారత్దే. లేకపోతే అమెరికా, పశ్చిమ దేశాల ఆంక్షలను తట్టుకోలేక బంగ్లాదేశ్ కూడా చైనా పంచన చేరే అవకాశం ఉన్నది. ఆ పరిస్థితే తలెత్తితే మాల్దీవులు, పాక్, బంగ్లాదేశ్, శ్రీలంకలను అడ్డుపెట్టుకొని హిందూ మహాసముద్రంపై చైనా ఆధిపత్యం చెలాయించే ప్రమాదం పొంచి ఉన్నది. ఈ పరిస్థితుల్లో బంగ్లాదేశ్లో షేక్ హసీనా విజయం ఆహ్వానించదగిన పరిణామం.