సంక్రాంతి శోభ తెలంగాణకు ఐదు రోజుల ముందే వచ్చింది. అది పల్లె ముంగిళ్లలోనే కాదు. రైతుల ముఖాల్లోనూ ప్రభవిల్లుతున్నది. రాష్ట్రంలో హరిత విప్లవానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచిన రైతుబంధు 50 వేల కోట్ల రూపాయల మైలురాయిని సోమవారం దాటింది. ఈ పథకం సృష్టికర్త, సమర్థంగా అమలుచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలంగాణ రైతాంగం కృతజ్ఞత అభివందనాలను సమర్పిస్తూ ఊరూరా, వాడవాడలా ఆయన చిత్రపటాలను ప్రదర్శిస్తున్నది. సోషల్ మీడియాలో రైతుబంధు, కేసీఆర్ హ్యాష్ట్యాగ్లతో ట్వీట్ల వెల్లువ కొనసాగింది. దేశంలో టాప్ ట్రెండింగ్లో ఒకటిగా మారింది. మూడున్నరేండ్లలోనే ఒక పథకంతో ఓ అద్భుతాన్ని సృష్టించవచ్చనటానికి రైతుబంధు ఓ సమున్నత ఉదాహరణ.
చేతిలో పంట పెట్టుబడి లేక వడ్డీ వ్యాపారుల మీద ఆధారపడుతూ, ఆ అప్పులు సకాలంలో తీర్చలేక ఆర్థికంగా చితికిపోతున్న అన్నదాతల కుటుంబాలను ఆదుకోవటానికి కేసీఆర్ ‘రైతుబంధు’ అనే కలగన్నారు. 2018 వానకాలం సీజన్లో ఆ స్వప్నాన్ని ఆచరణలో పెట్టారు. తొలి ఏడాది ఈ పథకం కింద 50 లక్షల మంది రైతులు లబ్ధి పొందగా, గడిచిన ఏడాది వానకాలం సీజన్కు ఆ సంఖ్య 66 లక్షలకు చేరుకుంది. రైతుబంధు కింద నమోదవుతున్న భూ విస్తీర్ణం ఈ మూడున్నరేండ్లలో 130 లక్షల ఎకరాల నుంచి 153 లక్షల ఎకరాలకు పెరిగింది. తొలుత సీజన్కు రూ.4 వేలు, ఏడాదికి రూ.8 వేల సాయం అందగా, రైతుబంధుకు లభించిన ఆదరణతో ముఖ్యమంత్రి కేసీఆర్ 2019-20 నుంచి సాయాన్ని రూ.5 వేల చొప్పున ఏటా రూ.10 వేలకు పెంచారు.
నిజాయితీతో, సాహసంతో చేసే మంచి పనిని ప్రపంచం గుర్తిస్తుంది. రైతుబంధు దీనిని రుజువు చేసింది. కేంద్రంలోని మోదీ సర్కార్ ‘పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి’ పేరిట అచ్చం ఇటువంటి పథకాన్నే ప్రారంభించింది. ఏపీ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్ తదితర రాష్ర్టాల్లోనూ ఇదే తరహా పథకాలు మొదలయ్యాయి. ఈ వెలుగు మనదేశానికే పరిమితం కాలేదు. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ‘ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్’ రైతుబంధు వంటి పథకాలను అమలుచేయాలని ప్రపంచదేశాలకు 2018లో సూచించింది. కండ్లు తెరిచిన నాలుగేండ్లలోనే తెలంగాణ ఈ విధంగా, కీలక మైన వ్యవసాయరంగంలో దేశదేశాలకు మార్గదర్శకంగా నిలిచింది.
మనదేశ జనాభాలో 60 శాతం మంది వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. పంటలు బాగా పండితేనే షేర్మార్కెట్లు లాభాల బాట పట్టే ఆర్థిక వ్యవస్థ మనది. ఆర్థికానికి కేంద్రబిందువు ఎవుసమే. ఈ సూత్రాన్ని అర్థం చేసుకున్న కేసీఆర్ తెలంగాణను సాధించిన వెంటనే వ్యవసాయంలో మహత్తర ప్రయోగానికి నాంది పలికారు. రైతులకు నిరంతర, ఉచిత కరెంటు ఇచ్చారు. ప్రాజెక్టులు కట్టి కాల్వలతో నీళ్లను పంటపొలాలకు తరలించారు. చెరువులలో పూడిక తీయించారు. ఇదే ఒరవడిలో రైతుబంధును తీసుకొచ్చి, పెట్టుబడికి వడ్డీవ్యాపారుల వద్ద చేతులు చాచే దుస్థితి నుంచి రైతులకు విముక్తి కలిగించారు.
సమకాలీన దేశ చరిత్రలో ఎక్కడా జరుగని ఈ ప్రయోగం ఎంతటి మహత్తర ఫలితాలను సాధించిందో తెలంగాణ నలుమూలలా పరుచుకున్న పచ్చని పంటలను చూస్తే తెలుస్తుంది. తెలంగాణను సాధించుకున్న నాటికి సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాలుండగా, నేడు 2.15 కోట్ల ఎకరాలకు పెరిగింది. నాడు 154 లక్షల టన్నులున్న పంటల దిగుబడి నేడు 340 లక్షల టన్నులకు చేరింది. కలా? నిజమా? అని భావించే అద్భుతమైన విజయం ఇది. ఒక దార్శనికుడి స్వప్నం, కృషి నేడు ఆకుపచ్చని తెలంగాణగా సాక్షాత్కరించింది. కర్షక రాజ్యమంటే ఇదేనని ప్రపంచానికి చాటుతున్నది!