భూమికి ఆకు పచ్చటి రంగేసినట్లుగా తెలంగాణ ఎనిమిదేండ్ల స్వల్పవ్యవధిలోనే హరిత వనంగా మారిపోయింది. ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఈ విషయాన్ని వెల్లడించగా.. తాజాగా ఆర్బీఐ విడుదల చేసిన ‘హ్యాండ్బుక్ 2021-22’ కూడా దీనిని మరోమారు స్పష్టపరిచింది. 2019 నుంచి 2021 వరకు రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 632 చదరపు కిలోమీటర్లు పెరిగింది. ఈ పెరుగుదల గుజరాత్లో 69 కి.మీ.లు, ఉత్తరప్రదేశ్లో 12 కి.మీ.లు, మధ్యప్రదేశ్లో 11 కి.మీ.లు మాత్రమే. ఇవన్నీ బీజేపీ పాలనలో ‘డబుల్ ఇంజిన్ సర్కారు’తో నడుస్తున్న రాష్ర్టాలు. ఇటీవలే హైదరాబాద్కు లభించిన ప్రతిష్ఠాత్మక ‘గ్రీన్ సిటీ ఆఫ్ ది వరల్డ్’, యాదగిరిగుట్టకు లభించిన ‘గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్’ అవార్డులు హరిత తెలంగాణ ఘనతను చాటి చెప్పాయి.
పర్యావరణ పరిరక్షణ కోసం, భావితరాల మనుగడ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ 2015లో ‘హరితహారం’ అనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీని కింద ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 246.37 కోట్ల మొక్కలు నాటారు. ఫలితంగా పచ్చదనం 7.7 శాతం పెరిగింది. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో గ్రీన్ కవరేజీ 24 శాతం ఉంటే ఇప్పుడు అది 31 శాతానికి చేరుకుంది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత తక్కువ వ్యవధిలో ఈ స్థాయిలో గ్రీనరీ పెరుగలేదు. ఇంకా చెప్పాలంటే బ్రెజిల్, చైనాలతో తెలంగాణ పోటీ పడుతున్నది. హరితహారం కింద భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం.. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మానవ ప్రయత్నంగా ఐక్యరాజ్యసమితి చేత మనన్నలు అందుకున్నది. దేశంలోని పలు రాష్ర్టాలు హరితహారం స్ఫూర్తిగా చర్యలు చేపడుతున్నాయి. ‘గ్రీన్ తమిళనాడు మిషన్’ పేరిట పదేండ్లలో 265 కోట్ల మొక్కలు నాటాలని తమిళనాడు ప్రభుత్వం ఇటీవలే నిర్ణయించింది.
భూతాపం వంటి సమస్యలు మానవాళికి ముప్పు కలిగించేంత తీవ్రస్థాయికి చేరుకున్నాయి. అయినప్పటికీ అగ్రదేశాలు కార్పొరేట్ లాబీల ఒత్తిడికే తలొగ్గుతున్నాయి. ఈ మధ్యే ఈజిప్టులో ముగిసిన కాప్-27 సదస్సు నుంచి కూడా గొప్ప ఫలితాలేమీ రాలేదు. పర్యావరణ పరిరక్షణ అనేది స్వచ్ఛంద కార్యకర్తలు, సంస్థలు, శాస్త్రవేత్తలకు పరిమితమైన విషయమనే అభిప్రాయం ఉన్నది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన ప్రభుత్వ ప్రాధాన్య అంశాల్లో పర్యావరణానికి పెద్దపీట వేయటం, దానినొక ఉద్యమంగా అమలు చేయటం అరుదు. తెలంగాణను సకల రంగాల్లోనూ మేటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న తపన గుండెల నిండా ఉన్న కేసీఆర్ పచ్చదనాన్ని పెంపొందిం చడంలోనూ వినూత్నమైన ప్రణాళికలను అమలుపరిచారు. కాబట్టే, తెలంగాణ ఏటేటా గణనీయమైన పురోభివృద్ధిని చూపుతున్నది. మోదీ పాలనలో భారత్.. ‘పర్యావరణ పనితీరు సూచీ-2022’లో 180 దేశాలలో చిట్టచివరన నిలిచింది. కానీ, తెలంగాణ దేశానికి తొవ్వ చూపే స్థాయికి ఎదగడం గర్వకారణం.