కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ కన్ను అనారోగ్య సమస్యలతో బాధపడే పేషంట్ల మీద పడింది. వారి వెతలు తీర్చటానికి కాదు, మరింత పెంచటానికి! కేంద్రం తాజా నిర్ణయంతో ఔషధాల ధరలు అమాంతం 12 శాతానికిపైగా పెరిగిపోనున్నాయి. వీటిలో 384 అత్యవసర మందులు, వెయ్యి ఔషధ సమ్మేళనాలు. ఏప్రిల్ 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. బీపీ, షుగర్, జ్వరం వంటి సాధారణ జబ్బుల నుంచి క్యాన్సర్, టీబీ, అంటువ్యాధుల వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యల వరకూ వాడే మందులపై పెంపు ప్రభా వం పడనుంది. ఒక అంచనా ప్రకారం దేశంలో ఒక్కో కుటుంబంపై నెలకు రూ.500 నుంచి వెయ్యి వరకు అదనపు భారం పడుతుంది. మొత్తంగా చూస్తే దేశ ప్రజానీకంపై ఇది రూ.12 వేల కోట్ల నుంచి రూ.25 వేల కోట్ల పెను భారం. ఆ మేరకు ఔషధ కంపెనీలకు లాభం. వాటిపై పన్నులు ప్రభుత్వానికి లాభం.
‘జాతీయ అత్యవసర ఔషధాల జాబితా’లో ఉన్న మందుల రేట్ల ను టోకు ధరల సూచీ ఆధారంగా పెంచుతుంటారు. ఈ సూచీలో మార్పును జాతీయ ఔషధ ధరల అథారిటీ ప్రకటిస్తూ ఉంటుంది. 2013లో అమలులోకి వచ్చిన ఔషధ ధరల నియంత్రణ ఆదేశం (డీపీసీఓ-2013) ప్రకారం ఇది ఏటా జరిగే ప్రక్రియ. అయితే, గతంలో ఏనాడూ పెంపు గరిష్ఠ పరిమితి పది శాతానికి మించలేదు. నిరుడు, ఈ ఏడాది మాత్రమే ఈ పరిమితికి మించి పెంచేశారు. 2022లో పెంపు 10.7 శాతం కాగా, ఈసారి దానిని కూడా మించిపోయి 12.12 శాతం వడ్డించారు. ఇది గత పదేండ్లలోనే అత్యధికం. దీనిపై ప్రభుత్వ వర్గాలు స్పందిస్తూ, గతేడాది 10.7 శాతానికి పెంచినా కూడా, మార్కెట్లో పోటీతో పలు ఫార్మా కంపెనీలు పెంపును ఐదు శాతానికి మించి అమల్లోకి తీసుకురాలేదని, ఈసారి కూడా అలానే ఉంటుందనీ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అలా లేవు.
ప్రజా సంక్షేమం దృష్ట్యా అత్యవసర ఔషధాల ధరల్ని ప్రభుత్వం స్థిరీకరించే పని ఏండ్లుగా జరుగుతున్నది. కానీ, మోదీ సర్కారు దీనిని గాలికి వదిలేసి, ధరల్ని కంపెనీల ఇష్టానికి వదిలేస్తున్నది. క్రమక్రమంగా తన బాధ్యత నుంచి పూర్తిగా తప్పుకొంటున్నది. దీంట్లో భాగంగానే ఎన్నడూ లేని విధంగా ఔషధాల ధరలపై భారీ పెంపునకు అనుమతించింది. కరోనాతో రెండు మూడేండ్లు దేశ ప్రజానీకం తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఓవైపు ఆదాయం పడిపోయి, మరోవైపు ఆరోగ్య పరిరక్షణపై వ్యయం పెరిగి సతమతమయ్యారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంటే వారిపై ఈ ధరల పెంపు కొత్త పిడుగు. బడ్జెట్లో ప్రభుత్వ ఆరోగ్య రంగానికి అరకొర నిధులు విదిలించే సర్కారు, ప్రైవేటులో డబ్బులు పోసి ఆరోగ్య సేవలను కొనుక్కునే ప్రజలపై యథేచ్ఛగా భారం మోపటం దారుణం. కార్పొరేట్ల లాభాలే తప్ప ప్రజల బాధలు తనకు పట్టవని మోదీ ప్రభుత్వం పదేపదే నిరూపించుకుంటున్నది. ప్రజారోగ్య సంస్థలు, కార్యకర్తలే కాదు.. యావన్మంది ప్రజలు, పార్టీలు దీనిని వ్యతిరేకించాలి.