కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన పదేండ్ల పాలనలో పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాలు, ఇతర వస్తువుల ధరలను ఇష్టం వచ్చినట్టుగా, ఇబ్బడిముబ్బడిగా పెంచి సామాన్య ప్రజల నడ్డివిరిచింది. అందుకే దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రజలు భారతీయ జనతా పార్టీని తిరస్కరిస్తూనే ఉన్నారు. మొన్న జరిగిన కర్ణాటక ఎన్నికల్లో స్వయంగా ప్రధాని మోదీ తన ప్రచారంలో భాగంగా ఎన్ని ప్రలో భాలకు గురిచేసినా కన్నడిగులు కనికరించలేదు. మతతత్వాన్ని భుజానికెత్తుకొని బాహాటంగా ప్రదర్శించినా ఫలితం దక్కలేదు. తాజాగా కర్ణాటక ఓటమితో ఖంగుతిన్న బీజేపీలో అభద్రతాభావం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నది. అధికార దాహానికి అలవాటుపడ్డ ఆ పార్టీ ‘కొట్టేసింది గుమ్మడికాయ, కొసరేసింది వంకాయ’ అన్నట్టుగా ఉన్నపళంగా ఇప్పుడు గ్యాస్ ధరను తగ్గించడం విడ్డూరం. ఇక తెలంగాణ విషయానికి వస్తే విభజన సమస్యలపై చలిమంట కాగిన మోదీజీ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకైనా జాతీయ హోదా కల్పించకపోవడం కక్షపూరితమే.
ఎంగిలి చేత్తో కాకిని గొట్టని వ్యక్తి ఎన్నికలు దగ్గరపడుతుండగానే హామీల వర్షం కురిపించిండట! దేశంలో ప్రస్తుతం బీజేపీ చేస్తున్న రాజకీయాలు అచ్చం అట్లాగే ఉన్నాయి. లోక్సభకు, పలు రాష్టాల్లో శాసనసభకు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వానికి సామాన్య ప్రజలు గుర్తుకురావడం హాస్యాస్పదం. 2014లో రూ.410 ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను 2023 వరకు దాదాపు మూడు రెట్లు పెంచి రూ.1155 చేసింది. గ్యాస్ ధరల పెంపుపై దేశవ్యాప్తంగా ప్రజలు ఎన్నోసార్లు నిరసనలు వ్యక్తం చేసినా చూసీచూడనట్టుగా వ్యవహరించిన కేంద్రం మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకు తాజాగా సిలిండర్పై రూ.200 తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. పదేండ్ల పాలనలో ‘సంపద పెంచు, పేదలకు పంచు’ అనే నినాదానికి పాతరవేసిన మోదీ సర్కార్ పన్నుల రూపేణా పేద ప్రజలను దోచుకొని రుణాల పేరిట కార్పొరేట్ గద్దలకు పంచింది. ఇప్పుడు బీజేపీ అవలంబిస్తున్న బుజ్జగింపు వైఖరి ప్రజాగ్రహాన్ని చల్లార్చేందుకా అన్నట్టున్నది.
‘దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్టు’గా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తే, బీఆర్ఎస్ ప్రభుత్వం సకల జనుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో పాలన సాగిస్తున్నది. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇవ్వని హామీలను సైతం నెరవేరుస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఔరా అనిపించుకుంటున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ధూపదీప నైవేద్యం కింద అర్చకులకు నెలకు రూ.10 వేల గౌరవ వేతనం అందించాలనే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేయడం ముదావహం. ఈ పథకమే కాదు, మొదటి పర్యాయంలో రైతుబంధు, రెండో పర్యాయంలో దళితబంధు ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రవేశపెట్టకుండానే అమలుచేసి చూపెట్టింది. ఇలా పదుల సంఖ్యలో పథకాలను మ్యానిఫెస్టోలో ప్రకటించకుండానే ఆచరణకు పూనుకున్నది. బీఆర్ఎస్ పార్టీ సగర్వంగా, తలెత్తుకొని ప్రోగ్రెస్ రిపోర్టుతో రాష్ట్ర ప్రజల వద్దకు బాజాప్తా వెళ్తుండగా, బీజేపీ మేక వన్నె పులి వలె సరికొత్త, అమలుకు నోచుకోని హామీలతో ఓటర్ల వద్దకు వెళ్తున్నది. ప్రజలు విజ్ఞులు, పనిచేసేటోళ్లకే పట్టం కడతారనేది చారిత్రక సత్యం.