అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలంటారు. కానీ, మోదీ ప్రభుత్వం దీంట్లోనూ విఫలమవుతున్నది. ‘బహుళ రాష్ర్టాల సహకార సంఘాలు (సవరణ) బిల్లు, 2022’ను కేంద్రం బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. సహకార వ్యవస్థను బలోపేతం చేయటం కోసమే ఈ బిల్లు అని, దీనిద్వారా పలు సంస్కరణలు ప్రవేశపెడతామని పేర్కొంది. దేశంలో ఉన్న ప్రజాస్వామిక వ్యవస్థలను నిర్వీర్యపరిచి, నియంతృత్వానికి దారులు వేస్తున్న ప్రభుత్వం నోట సహకార వ్యవస్థ బలోపేతం అన్న మాట జోక్గా వినిపిస్తున్నది. కాబట్టి, ఈ బిల్లుపై సహజంగానే విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. బిల్లులోని అంశాలు సహకార సంఘాల స్ఫూర్తికే విరుద్ధంగా ఉన్నాయని, రాష్ర్టాల పరిధిలో ఉన్న ఈ వ్యవస్థను కేంద్రం తన గుప్పిట్లోకి తీసుకోవాలని చూస్తున్నదని దుమ్మెత్తి పోశాయి.
సహకార వ్యవస్థలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని తీసుకురావటానికే ఈ బిల్లు అని కేంద్రం ప్రకటించింది. బిల్లులోని అంశాలు మాత్రం ఈ దిశగా లేవు. ఉదాహరణకు, సహకార సంఘాల్లో ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలన్నది ఒక ప్రతిపాదన. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీజేపీ, మోదీ ఏ విధంగా ప్రభావితం చేస్తున్నారో అందరికీ తెలిసిందే. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను ఎనిమిది దఫాల్లో నిర్వహించటంగానీ, హిమాచల్ పోలింగ్ షెడ్యూల్ను ప్రకటించి, గుజరాత్ షెడ్యూల్ను వాయిదా వేయటంగానీ, అహ్మదాబాద్లో ఓటు వేసే ముందు ప్రధాని ఆర్భాటంగా రెండున్నర గంటలపాటు రోడ్షో నిర్వహించటంగానీ.. ఇవన్నీ ఎన్నికల సంఘంపై బీజేపీ ఉడుంపట్టును తెలుపుతాయి. ఈసీ పరిస్థితే ఇలా ఉంటే, సహకార సంఘాల కోసమే ప్రత్యేకంగా మరో ఎన్నికల సంస్థను సృష్టిస్తే, దాని పనితీరు ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కాబట్టి, మోదీ సర్కారు ప్రకటిత విధానం వెనుక అప్రకటిత లక్ష్యం ఉండటానికి ఎంతైనా అవకాశం ఉంది.
సహకార వ్యవస్థపై మోదీ ప్రభుత్వం కన్ను గతేడాది పడింది. కేంద్రంలో తొలిసారిగా సహకార మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయటమేగాక, ఆ శాఖను అమిత్షాకు అప్పగించారు. దీనిద్వారానే ప్రభుత్వ పెద్దలకు ఈ రంగంపై ఎంతటి అంచనాలున్నాయో తెలుస్తున్నది. ఈ పరిణామంపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. కానీ, కేంద్రం వెనుకకు తగ్గకుండా ఇప్పుడు ఏకంగా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. దేశంలో సమాఖ్య వ్యవస్థ ఉనికిలో ఉండటానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న వాటిల్లో సహకార సంఘాలు కూడా ఉన్నాయి. వీటిద్వారా ఎంతోమంది ప్రజానేతలుగా ఎదిగి ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. దేశంలోనే అత్యంత సీనియర్ నేతగా ఉన్న శరద్పవార్ వీరిలో ఒకరు. పలు రాష్ర్టాల్లో ప్రాంతీయపార్టీలు సహకార సంఘాలను పునాదిగా చేసుకొని బలపడ్డాయి. ఈ నేపథ్యంలోనే, మోదీ ఈ రంగంపై దృష్టి పెట్టారన్న వాదనలున్నాయి. దేశంలో బీజేపీ తప్ప మరొక పార్టీ ఉండరాదన్నట్లుగా మోదీ పరివారం వ్యవహరిస్తున్నది. ప్రాంతీయపార్టీలను, విపక్ష ప్రభుత్వాలను చీల్చుతున్నది. దీంట్లో భాగంగానే సహకార సంఘాలపై కత్తి కట్టింది. దీనిని విపక్షాలు, సహకారసంఘాలు, ప్రజలు వ్యతిరేకించాలి.