ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ సముద్రతీరంలో సేదదీరుతూ సాయం సంధ్య వైపు చూస్తున్న ఫొటో మీడియాలో వైరలైంది. అదే ఫొటో మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభానికి దారితీయడం గమనార్హం. మాల్దీవుల మంత్రులు ముగ్గురు ప్రధాని మోదీ లక్షద్వీప్ విహారంపై చేసిన తీవ్ర వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. మాల్దీవులు టూరిజాన్ని దెబ్బతీసి లక్షద్వీప్ను ప్రోత్సహించడమే మోదీ లక్ష్యమని మాల్దీవుల మంత్రులు విమర్శించారు. విమర్శ వరకైతే ఫరవాలేదు కానీ వారు ఉపయోగించిన భాషపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. భారతీయ సామాజిక మాధ్యమాల్లో ఆ ముగ్గురు మంత్రులపై విమర్శలు పోటెత్తాయి. మాల్దీవుల విహారయాత్రకు భారత పౌరులు బుక్ చేసుకున్న విమానం టికెట్లు, హోటళ్ల గదులు పెద్దఎత్తున రద్దు చేసుకుంటున్నట్టు వార్తలు వెల్లువెత్తాయి. దీంతో అధ్యక్షుడు ముయిజూ నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మారడంతో చివరికి ఆ ముగ్గురిని బర్తరఫ్ చేశారు.
వారి వ్యాఖ్యలతో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు కూడా. మాల్దీవులు ప్రధానంగా టూరిజంపై ఆధారపడిన దేశం. చేపల వేట తర్వాత రెండో అతిపెద్ద ఆదాయ వనరు టూరిజమే. జీడీపీలో 28 శాతం, విదేశీమారక ద్రవ్యంలో 60 శాతం పర్యాటకమే సమకూరుస్తుంది. ఆ దేశాన్ని సందర్శిస్తున్న భారతీయుల సంఖ్య ఏటా పెరుగుతున్నది. 2023లో అత్యధికంగా 2,09,198 మంది భారతీయులు ఆ దేశంలో పర్యటించారు. తాజా వివాదంతో పెద్ద సంఖ్యలో భారతీయులు వెనుకకు తగ్గుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. అంతేకాకుండా మాల్దీవులకు బదులుగా లక్షద్వీప్ను పర్యాటక లక్ష్యంగా ఎంచుకుందామనే ప్రచారమూ ఊపందుకున్నది. ఆ దేశ మంత్రుల వివాదాస్పద వ్యాఖ్యలతో టూరిజం మీద దెబ్బపడటాన్ని అక్కడి ప్రభుత్వం ఏ మాత్రం ఆహ్వానించదనేది తెలిసిందే.
అయితే, మాల్దీవులతో భారత్కు ఇదే మొదటి తగాదా కాదు. కొన్నేండ్లుగా రాజకీయ అస్థిరతతో సతమతమవుతున్న ఈ దీవుల దేశం ఇటీవలి కాలంలో చైనా ప్రభావంలోకి వెళ్లింది. చైనా విస్తరణవాద ప్రణాళికలో పావుగా మారింది. చైనా అనుకూలవాదిగా పేరున్న మహమ్మద్ ముయిజు నవంబర్లో అధ్యక్షుడిగా ఎన్నికైన రెండో రోజు నుంచే భారత వ్యతిరేక నిర్ణయాలతో సంచలనం సృష్టించారు. మాల్దీవుల్లో ఉన్న భారత బలగాలు వెనక్కి వెళ్లాలని ఆదేశించారు.
చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న మాల్దీవులను దెబ్బకొట్టేందుకు భారత్ అనుసరిస్తున్న వ్యూహంలో భాగంగానే ప్రధాని మోదీ లక్షద్వీప్లో పర్యటించారని అంటున్నారు. ఈ నేపథ్యంలో మాల్దీవుల పాలక ఎంపీలు, మంత్రులు ప్రధాని పర్యటనపై, భారతీయ సంస్కృతిపై అక్కసు వెళ్లగక్కారు. సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారు. భారతీయులు మాల్దీవులకు వెళ్లవద్దని సెలబ్రిటీలు కూడా పిలుపునివ్వడం విశేషం. అటు ఢిల్లీలోని మాల్దీవుల రాయబారిని భారత విదేశాంగ శాఖ పిలిపించి మందలించింది. ఎంపీలు, డిప్యూటీ మంత్రుల వ్యాఖ్యలపై భారతీయులతో పాటు మాల్దీవుల విపక్ష పార్టీలు కూడా మండిపడ్డాయి. ఈ వివాదం రాజుకుంటున్న నేపథ్యంలో అధ్యక్షుడు ముయిజు చైనాకు ఐదు రోజుల పర్యటన కోసం బయల్దేరడం కూడా చర్చనీయాంశమైంది. మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి ముందుగా భారత్ పర్యటనకు రావడమనేది ఒకప్పుడు ఆనవాయితీగా ఉండేది. కానీ చైనా విస్తరణవాద ప్రణాళికలో మాల్దీవులు భాగమైపోవడం దౌత్యపరంగా భారత్కు ప్రతికూలాంశమే. మంత్రుల తొలగింపు భారత్కు కొంత ఉపకరించే అవకాశం ఉన్నప్పటికీ మాల్దీవులను తిరిగి తన వైపు తిప్పుకొనేందుకు ఇది ఏ మేరకు పనికివస్తుందనేది అనుమానమే. చైనా విస్తరణకు అడ్డుకట్ట వేసేందుకు భారత్ దౌత్యపరంగా ఇంకా చేయాల్సింది ఎంతో ఉన్నదని చెప్పక తప్పదు.