అడుగడుగునా గండాలు, జటిలమైన పోరాటాలు ఆయనకు కొత్తకాదు. సంకటం ఎదురైనప్పుడు వెనుదిరగడం ఆయన చరిత్రలోనే లేదు. మునుముందుకు సాగిపోయి ప్రత్యర్థులను మట్టి కరిపించిన ఘనత తనది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు, తనకు శారీరకంగా కలిగిన అవస్థలు ఇవేవీ కేసీఆర్ను నిలువరించలేకపోయాయి. పడిన ప్రతిసారీ లేవడం తనకు తెలుసు. ఓటములను విజయసోపానాలుగా మలుచుకున్న దీక్షాదక్షతలు తన సొంతం. అందుకే ఆయన కదిలారు. అశేష జనవాహినిలోకి దూసుకుపోయారు. నల్లగొండ సభలో సమరభేరి మోగించారు.
కాంగ్రెస్ సర్కారు నీటిపై వల్లిస్తున్న బూటకాలను బదాబదలు చేశారు. కృష్ణా ప్రాజెక్టులను చేజార్చుకుంటున్న చేతకానితనాన్ని ఎండగట్టారు. రెట్టించిన సమరోత్సాహంతో, తనదైన వాగ్ధాటితో విజృంభించారు. ఆయన ప్రతి పలుకు ప్రత్యర్థుల గుండెల్లో దట్టించిన మందుగుండులా పేలింది. తెలంగాణ ప్రబోధకుడు, ప్రగతి సాధకుడు పూరించిన సమరశంఖం పార్టీకి, కార్యకర్తలకు కొండంత ధైర్యం కలిగించింది. ప్రజలకు దిశానిర్దేశం చేసింది. నల్లగొండ సభ బీఆర్ఎస్ పయనంలో ఓ మూల మలుపు. పార్టీ పునరుజ్జీవన ప్రస్థానంలో తొలి గెలుపు.
అసెంబ్లీ సాక్షిగా అసత్యాలతో, అర్ధసత్యాలతో బట్టకాల్చి మీదేసే దిక్కుమాలిన రాజకీయం కేసీఆర్ గర్జనతో బిక్కచచ్చింది. నీటిపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న వదరుబోతులకు కేసీఆర్ మరోసారి ప్రజాక్షేత్రంలోకి రావడంతోనే బెదురు పుట్టింది. స్వరాష్ర్టాన్ని సాధించి దాదాపు పదేండ్ల పాటు ప్రగతి మార్గం పట్టించిన జననేత సరైన సమయంలో, సరైన వ్యూహంతో ప్రజల ముందుకురావడం విశేషం. తెలంగాణకు ప్రాణాధారమైన కృష్ణా నీటి హక్కుల పరిరక్షణకు నడుం బిగించడం ముదావహం. రాష్ట్ర సాధన ఉద్యమానికి మూలాధారమైన మూడు అంశాల్లో నీటిదే ప్రథమస్థానం అన్న సంగతి తెలిసిందే.
అమలు చేయలేని హామీలతో ఊదరగొట్టి, బురదజల్లుడు రాజకీయాలతో బురిడీ కొట్టించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆడలేక మద్దెల ఓడంటున్నది. తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ఇదివరకటి ప్రభుత్వంపై నిస్సిగ్గుగా నిందలు వేస్తున్నది. కేసీఆర్పై విషం చిమ్మి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నది. ముఖ్యంగా ప్రాజెక్టుల్లోని చిన్నచిన్న సమస్యలను భూతద్దంలో చూపిస్తూ హడావుడి చేస్తున్నది. మరోవైపు కృష్ణా ప్రాజెక్టులను అవగాహనారాహిత్యంతో, కొంత నిర్లక్ష్యంతో కేంద్రం చేతికి అప్పగించి ఆపై బుకాయింపులకు, దబాయింపులకు దిగుతున్నది. నీటి హక్కుల విషయంలో నిలకడలేని తనం చాటుకుంటున్నది. ఇది తెలంగాణకు ముప్పు తెచ్చే ధోరణి. నిలువరించక తప్పదనే కేసీఆర్ కదిలారు. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల తెలివిమాలినతనాన్ని నల్లగొండ సభలో అద్వితీయమైన రీతిలో తూర్పారబట్టారు. నాటుమాటల కాంగ్రెస్ నేతలకు దీటుగా సమాధానమిచ్చారు.
తెలంగాణ ప్రజానీకం అప్రమత్తంగా లేకపోతే కేసీఆర్ హెచ్చరించినట్టు నీటిహక్కులు ఆగమై రాష్ట్ర ఏర్పాటు కంటే ముందు నాటి కన్నీటి బతుకులు మిగులుతాయి. మతిలేని పాలకుల గతిలేని విధానాలపై విరామమెరుగని పోరాటమే శరణ్యం. కృష్ణా ప్రాజెక్టుల రక్షణకు, నీటి హక్కుల సాధనకు తెలంగాణ ప్రజానీకం ఒక్కతాటిపై కదలాల్సిన సమయం ఆసన్నమైంది.