మత చిచ్చు పెట్టటమే అధికారానికి దగ్గరి దారి అనీ, జాతి సంపదను కొందరు కార్పొరేట్ గద్దలకు పంచి పెట్టటమే ఆర్థిక విధానం అనీ అనుకునే వాళ్లు దేశాన్ని ఏలుతున్న సమయం ఇది. దీనిని సహించబోమని తెలంగాణ నుంచి బీఆర్ఎస్ సింహనాదం చేసింది. దేశాన్ని సరైన దారిలో పెట్టటానికి కదిలింది. తెలంగాణ ఉద్యమ కాలం నుంచీ పార్టీని, పార్టీ అధినేత కేసీఆర్ను చూస్తున్న వారికి వెన్నులో వణుకు మొదలైంది. బీఆర్ఎస్ను తెలంగాణ నుంచి బయటకు రానివ్వవద్దని, కేసీఆర్ను ఇక్కడే కట్టడి చేయాలని కుట్రల పర్వానికి తెర లేపారు. ఎమ్మెల్యేలకు ఎర, మంత్రులపై ఐటీ, సీబీఐ దాడులు, ఎమ్మెల్సీ కవితపై విచారణ పేరుతో ఈడీ వేధింపులు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ శ్రేణులను ఉద్దేశించి కేసీఆర్ రాసిన లేఖను చూడాలి. యుద్ధం ముంగిట తన సైన్యాన్ని ఉద్దేశించి ఒక సేనాని చేసిన ఉత్తేజపూరిత ప్రసంగంలా ఉంది ఈ లేఖ.
ఇతరులకు రాజకీయాలు అంటే ఒక ఆట వంటిదని, మనకు మాత్రం కర్తవ్య సాధనకు ఒక మార్గమని కేసీఆర్ చేసిన ఉద్బోధ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలకే కాదు.. ప్రజాక్షేమం కోసం నిజాయితీగా రాజకీయాలు చేసే ప్రతి ఒక్కరికీ శిరోధార్యమైన పాఠం. 21 ఏండ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, ఉద్యమ కాలంలో లాఠీలకు, జైళ్లకు వెరువకుండా రేయింబవళ్లు శ్రమించిన కార్యకర్తల త్యాగాలను గుర్తు చేస్తూ ‘మీరే నా బలం.. నా బలగం’ అని అధినేత సగర్వంగా చాటడం పార్టీ శ్రేణుల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. తెలంగాణలో ప్రతి వర్గానికి ప్రభుత్వం అందిస్తున్న సేవలు, కరువు కాటకాల తెలంగాణను దేశాన్నే సాకే ఐదారు రాష్ర్టాల్లో ఒకటిగా తీర్చిదిద్దిన బీఆర్ఎస్ పాలన గురించి కేసీఆర్ చేసిన ప్రస్తావన అక్షర సత్యం. తెలంగాణ మాడల్ దేశానికే ఆదర్శంగా నిలిచిందంటే కారణం ఈ మార్పే. దేశమంతటా ఈ మార్పు తీసుకురావటానికే నేడు బీఆర్ఎస్ బయల్దేరింది.
దేశానికి అన్నం పెట్టే రైతన్నకే సున్నం పెడుతున్నది కేంద్రం. సాగుచట్టాలు తీసుకొచ్చి పొలాల నుంచి కర్షకులను వెళ్లగొట్టి, తన అనుంగు మిత్రులకు దేశ వ్యవసాయ రంగాన్ని అప్పగించాలని భావించింది. కానీ, హస్తిన వీధుల్లో కదం తొక్కిన రైతన్న పొలికేకలకు భీతిల్లి వెనక్కి తగ్గింది. అటువంటి రైతుల అభ్యున్నతే కేంద్రంగా బీఆర్ఎస్ ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అని పిలుపునిచ్చింది. 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇటువంటి వినూత్న విధానాన్ని ప్రకటించలేదు. సమస్యను మూలాల నుంచి అర్థం చేసుకొని ఎవరూ ఊహించని రీతిలో పరిష్కరించటమే కేసీఆర్ పద్ధతి. ఆయనను నిలువరించాలన్న బీజేపీ కుట్రలు విఫలమవటం ఖాయం. తనతో పేగుబంధాన్ని కలిగి ఉన్న బీఆర్ఎస్కు తెలంగాణ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుంది. కేసీఆర్ ఇచ్చిన సమరస్ఫూర్తితో బీఆర్ఎస్ శ్రేణులు ఈ కీలకమైన తరుణంలో పార్టీకి కంచుకోటలాగా మారాలి. కేసీఆర్ ఇచ్చిన సందేశంతో పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు మరింత ఫలప్రదం కావాలి.