గుజరాత్ అల్లర్ల సందర్భంగా బిల్కిస్ బానోపై లైంగికదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఉదంతంలో 14 మందిని హతమార్చిన నేరస్థులకు శిక్షాకాలాన్ని తగ్గించి విడుదల చేయడం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వానికి చెంపపెట్టు. ఈ తీర్పులో అప్పటి, ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలున్నాయి. అల్లర్ల ముసుగులో నేరస్థులు బిల్కిస్పై లైంగికదాడి జరిపే నాటికి ఆమె ఐదునెలల గర్భిణి. ఆమె కండ్లముందే నేరస్థులు ఆమె కూతురితో సహా ఇతర కుటుంబసభ్యులను చంపేశారు. అంతటి అమానుషానికి పాల్పడినవారికి ప్రభుత్వం క్షమాభిక్ష ప్రకటించి విడుదల చేయడం, ఆపై వారికి దండలేసి సన్మానించిన దృశ్యాలు దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేశాయి.
ఈ వ్యవహారమంతా న్యాయసూత్రాలకు విరుద్ధంగా జరిగిందనేది చెప్పడానికి న్యాయనిపుణులే కానవసరం లేదు. నేరస్థులతో రాష్ట్ర ప్రభుత్వం ‘మిలాఖతై’ వ్యవహరించిందని సర్వోన్నత న్యాయస్థానం అక్షింతలు వేసింది. కేవలం ఈ అనుమానంతోనే నాడు కేసు విచారణను గుజరాత్ నుంచి మహారాష్ట్రకు బదిలీ చేశామన్న సంగతి గుర్తుచేసింది. నేరస్థులు తమ నేర నిరూపణ పర్యవసానాలను తప్పించుకోగలిగితే సమాజంలో శాంతి భద్రతలనేవి ప్రహసనంగా మారుతాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రతివాదుల (నేరస్థుల) స్వేచ్ఛను కోల్పోవడం గురించి చేసిన వాదన సబబైనదే అని కోర్టు మరో కీలక వ్యాఖ్య చేసింది. అయితే మరోమారు శిక్షాకాలం తగ్గింపు కోసం విజ్ఞప్తి చేసుకోవాలన్నా వారు జైలులో ఉండి మాత్రమే ఆ పని చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కోర్టును బురిడీ కొట్టించి, వాస్తవాలను తొక్కిపెట్టి శిక్షాకాలాన్ని తగ్గించడం ఏ మాత్రం చెల్లుబడి కాదని’ తేల్చిచెప్పింది. నేర విచారణ మహారాష్ట్రలో జరిగితే శిక్షాకాలం తగ్గింపుపై ఆ రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించాలి తప్ప నేరం జరిగిన గుజరాత్ ప్రభుత్వం కాదని సుప్రీం కోర్టు ఎత్తిచూపింది.
ఒక నిందితుని శిక్షాకాలం తగ్గింపునకు సంబంధించి సుప్రీంకోర్టు 2022 మే 13న ఇచ్చిన తీర్పును ధర్మాసనంలోని జస్టిస్ నాగరత్న ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ తీర్పు శ్రీహరన్ కేసులో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ఉందని తేల్చిచెప్పారు. అంటే సారాంశంలో సర్వోన్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన తీర్పు ను అడ్డుపెట్టుకుని చట్టవిరుద్ధంగా, కేసు పూర్వాపరాల గురించి ఆలోచించకుండా, సంబంధిత అంశాలను పరిగణించకుండా, అదీ ‘ఇతరుల’, అంటే ఇక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించాల్సిన అధికారాన్ని తానే లాగేసుకుని గుజరాత్ ప్రభుత్వం వ్యవహరించింది. తూతూమంత్రంగా ఓ కమిటీని వేసి, ‘ఆ కమిటీ సిఫారసుల మేరకు’ అంటూ శిక్షాకాలాన్ని తగ్గించివేసింది. కోర్టు ఆదేశాలను చట్ట ఉల్లంఘనకు ఒక ప్రభుత్వం ఎలా వాడుకోవాలో తెలిపే చక్కటి ‘ఉదాహరణ’గా ఇది నిలుస్తుందని జస్టిస్ నాగరత్న చేసిన వ్యాఖ్య ఓ కనువిప్పు. ఆలస్యంగానైనా బిల్కిస్ బానోకు న్యాయం జరగడం ఆహ్వానించదగిన పరిణామం.