తాజెడ్డ కోతి వనమల్లా చెరిచింది అన్నట్లుంది కేంద్రం వైఖరి. ఆర్థిక వ్యవస్థను బాగుపరచటం చేతగాక, ఉన్నదానిని మరింత దిగజార్చుతున్నది. రూ.2,000 నోట్ల రద్దు దీనికో తాజా ఉదాహరణ. అంత పెద్ద నోటును ఎందుకు తీసుకొచ్చినట్లు? ఇప్పుడు ఎందుకు తొలగిస్తున్నట్టు?.. 2016 నవంబరు 8న రాత్రి పూట అకస్మాత్తుగా దేశ ప్రజానీకంపై నోట్లరద్దు అనే పిడుగు వేశారు ప్రధాని నరేంద్రమోదీ. నల్లధనం నిర్మూలన, ఉగ్రవాదానికి నిధుల నిలిపివేత అంటూ లక్ష్యాలను ఘనంగా ప్రకటించారు. వాటిలో ఏ ఒక్కటీ పరిపూర్తి కాకపోగా, దేశ ప్రజానీకం అక్షరాలా అష్టకష్టాల పాలయ్యారు. కష్టపడి సంపాదించిన సొమ్ము ఎందుకూ పనికి రాకుండా పోవటంతో ఆ షాక్ తట్టుకోలేక, గుండెపోటుతో ఎంతోమంది ప్రాణాలు వదిలారు. బిడ్డల పెండ్లి, చదువుల కోసం దాచుకున్న సొమ్ము చిల్లిగవ్వకూ కొరగాకపోవటంతో ఆత్మహత్యలు చేసుకున్నారు. బ్యాంకుల ముందు పడిగాపులు పడుతూ ప్రాణాలు విడిచిన వారు మరికొందరు.
భారతదేశ ఆర్థికవ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నది. లక్షల ఉద్యోగాలు పోయాయి. వేలాది చిన్న, మధ్యస్థాయి కంపెనీలు మూతపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం గణనీయంగా తగ్గిపోయి సంక్షేమ పథకాలకు కోత పడింది. మోదీ సర్కారు చెప్పినట్లుగా, నల్లధనం బట్టబయలు కాకపోగా, రద్దయిన పెద్దనోట్లన్నీ బ్యాంకులను చేరాయి. భారతదేశ ఆర్థిక వ్యవస్థపై నోట్లరద్దు ఒక సర్జికల్ స్ట్రైక్ వంటిది. ఇంత నష్టం జరిగినా కూడా మోదీగానీ, కేంద్రంగానీ కనీసం విచారమైనా ప్రకటించలేదు. గుణపాఠాలనూ నేర్చుకోలేదు. సమీక్ష జరిపి ఒక నివేదికనైనా విడుదల చేయలేదు. ఎంతమాత్రమూ ముందుచూపు లేని ఒక పాలకుడి అసమర్థ నిర్ణయంగా నోట్లరద్దు భారతదేశ చరిత్రలో మిగిలిపోయింది. మళ్లీ ఆరేండ్ల తర్వాత రూ.2,000 నోటును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలది నవ్వాలో ఏడువాలో తెలియని పరిస్థితి. కష్టార్జితాన్ని కరెన్సీ నోట్ల రూపంలో దాచుకోవటంపైనే అనుమానాలు తలెత్తుతున్నాయి కేంద్రం నిర్వాకం వల్ల.
యథా రాజా తథా ప్రభుత అన్నట్లు కేంద్రసంస్థలు, ఆర్బీఐ వ్యవహరిస్తున్నాయి. 2016 నాటి నోట్లరద్దే చట్టబద్ధమైన చర్య కాదని, ఉన్నపళంగా అన్ని సిరీస్ల నోట్లనూ రద్దు చేసే అధికారం ఆర్బీఐకి కూడా లేదని న్యాయనిపుణులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అటువంటిది, ఆర్బీఐని కూడా పక్కనపెట్టి, ప్రధానే స్వయంగా నాడు ప్రకటన చేశారు. అయినప్పటికీ, ఆర్బీఐ నోరు విప్పలేదు. నాటి అభ్యంతరాల నేపథ్యంలో కావొ చ్చు.. నేడు ఆర్బీఐ ద్వారా రూ.2,000 నోట్ల రద్దు ప్రకటన చేయించారు. రద్దు వెనుక నాడుగానీ, నేడుగానీ కేంద్రం ఉద్దేశాలు వేరే ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. నాడు యూపీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుంటే, నేడు పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకున్నారని, ప్రత్యర్థి పార్టీల వద్ద నగదు నిల్వలు లేకుండా చేయటమే అస లు ఉద్దేశమన్న ఆరోపణలున్నాయి. 140 కోట్లమందికి బాధ్యత వహిం చి, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన కేంద్రం.. ఒక రాజకీయపార్టీలాగా నిర్ణయాలు తీసుకుంటే అంతకంటే దారుణం మరొకటి ఉండదు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని ప్రభుత్వ పెద్దలు గుర్తుంచుకోవాలి.