‘వసుధైవ కుటుంబకం’ అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం ఆర్భాటంగా, ఆడంబరంగా నిర్వహించిన జీ-20 సదస్సు ముగిసింది. దేశదేశాల పెద్దలు తమ తమ నెలవులకు వెళ్లిపోయారు. ఎవరినీ నొప్పించని మొక్కుబడి ప్రకటన చేయడమే సదస్సు ఘన విజయంగా చెప్పుకోవడం ఆశ్చర్యకరం. పేదల బస్తీలను పరదాలతో మూసివేసి, పెద్దలకు విందులు వడ్డించడం వల్ల దేశానికి ఒరిగిందేమిటి? దేశం మాటేమో గానీ, ప్రధాని మోదీ మాత్రం తన సొంత ఇమేజ్ పెంచుకునేందుకు ఈ సదస్సును బాహాటంగా వినియోగించుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశ ప్రజల్లో పడిపోతున్న పలుకుబడిని పెంచుకునే తాపత్రయంతో ఎక్కడచూస్తే అక్కడ అన్నట్టుగా అంతటా ఆయనే కనిపించారు. దేశంలో మొట్టమొదటిసారిగా ఇలాంటి సమావేశాలు జరుగుతున్నాయన్నట్టుగా ప్రచారం చేసుకున్నారు. దేశ రాజధానిలో హోర్డింగుల నిండా మోదీయే కనిపించడం గమనార్హం.
ఇక ఇటు జాతీయ పుష్పం, అటు బీజేపీ పార్టీ చిహ్నమైన కమలం సర్వత్రా దర్శనమివ్వడం మరో విశేషం. సదస్సులో సడేమియా అన్నట్టు ఇండియా-భారత్ పేరుపై అనవసర వివాదాన్ని ముందుకు తీసుకురావడం అసందర్భంగా తోచింది. ఆహ్వాన పత్రాలు కొత్తగా భారత్ పేరిట పంపడం అతిథులను తికమకపెట్టడం తప్ప మరొకటి కాదు. నగరానికి చేసిన అలంకరణల్లో మొఘల్ యుగ కట్టడాలు లుప్తం కావడం ప్రభుత్వ ఆలోచనాధోరణికి అద్దం పడుతున్నది. ప్రచార హోర్డింగులు, వీడియోల్లో తాజ్మహల్ వంటి ప్రముఖ నిర్మాణాలకు చోటు దక్కలేదు. చివరికి స్వర్ణ దేవాలయం కూడా తక్కువ ప్రాధాన్యంతో సర్దుకోవాల్సి వచ్చింది. మరోవైపు తమకు అత్యంత ప్రీతిపాత్రమైన కట్టడాలకు, చిహ్నాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఇలాంటి వివక్షలు ‘వసుధైవ కుటుంబకం’ భావనకు ఎలా అనువైనవో నిర్వాహకులకే తెలియాలి. ఓ వైపు దేశంలో వైవిధ్యాన్ని అణచివేస్తూ మరోవైపు విశ్వ సమైక్యత గురించి మాట్లాడటం డొల్లతనమే కదా! దీనిద్వారా ప్రపంచానికి ఇస్తున్న సందేశం ఏమిటో నిర్వాహకులు ఆలోచించినట్టు లేదు.
ఢిల్లీ జీ-20కి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ రాకపోవడం ఎబ్బెట్టుగా కనిపించింది. ప్రస్తుత సంక్షోభ ప్రపంచంలో రెండింటిదే కీలక పాత్ర. బహుళపక్ష సదస్సులో ద్వైపాక్షిక అంశాలపై హడావుడి చేయడం పరిణతి లేనితనమే. చైనా, కెనడా విషయంలో ఇదే జరిగింది. ఇక అతిగా హిందీ వినియోగం వల్ల అంతర్జాతీయ అతిథులు, మీడియా ప్రతినిధులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇలా అన్నిరకాలుగా బీజేపీ ఎజెండాను ముందుకుతేవడం సదస్సు ప్రత్యేకతగా నిలిచిందని చెప్పవచ్చు. అయినా అంతర్జాతీయ సదస్సులు, శిఖరాగ్ర సభలు భారత్కు కొత్తకాదు. అలీనోద్యమ వ్యవస్థాపకుడైన నెహ్రూ నిర్వహించిన పాత్ర ముందు వంతులవారీగా వచ్చిన సదస్సు నిర్వహణ ఎంత? వందకు పైగా అలీన దేశాలతో ఇందిరాగాంధీ నిర్వహించిన శిఖరాగ్ర సదస్సుల మాటేమిటి? ఢిల్లీ జీ-20 మోదీ ప్రచార యావ కోసం జరిగిన హంగామాగా మిగిలిపోయింది.