నగరం అంటేనే ట్రాఫిక్ వెతలు అన్నట్లుగా నేటి ఆధునికత తయారైంది. దీనికి భిన్నంగా హైదరాబాద్ మహానగరాన్ని సౌకర్యవంతంగా, అందంగా, ఆహ్లాదభరితంగా తీర్చిదిద్దటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తొలినుంచీ ప్రాధాన్యం ఇస్తున్నారు. రూ.22 వేల కోట్ల భారీ వ్యయం తో ‘వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రాజెక్టు’ (ఎస్సార్డీపీ)ను ప్రారంభించారు. ఫలితంగా పలు ఫ్లై ఓవర్లను ప్రభుత్వం నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. మంత్రి కేటీఆర్ తాజాగా ప్రారంభించిన కొత్తగూడ మల్టీలెవల్ ఫ్లై ఓవర్ 18వది. రోడ్ల వెడల్పు, అనుసంధానం, మిస్సింగ్ రోడ్ల నిర్మాణం, అండర్పాస్లు వంటి పలు ఇతర కార్యకలాపాలు గతంలో ఎన్నడూ చూడనంత వేగంగా కొనసాగుతున్నాయి. దుర్గం చెరువుపై తీగల వంతెన రవాణా సదుపాయంగానేగాక పర్యాటక ఆకర్షణగా మారింది. ప్రత్యామ్నాయ ప్రజా రవాణా సాధనాలను కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. మెట్రోను శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకూ విస్తరించే పనులను సీఎం కేసీఆర్ ఇటీవలే ప్రారంభించారు.
నిజాం కాలం నాటి మురుగునీటి ప్రవాహ వ్యవస్థకు ఉమ్మడి రాష్ట్ర పాలకులు అదనంగా చేర్చిందేమీ లేదు. చినుకు పడితే నగరం చిత్తడిగా మారేది. ఈ దుస్థితిని మార్చటానికి తెలంగాణ ప్రభుత్వం భారీ కార్యాచరణ చేపట్టింది. ‘వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం’ను తీసుకొచ్చింది. వరద ముంపులో మునిగే పలు కాలనీలు దీనివల్ల తెప్పరిల్లాయి. హుస్సేన్సాగర్, మూసీలలో మురుగు నీటిని యుద్ధ ప్రాతిపదికన శుద్ధి చేస్తున్నారు. హుస్సేన్సాగర్ పక్కనుంచి వెళ్తుంటే దుర్వాసన కు ముక్కు మూసుకునే నాటి పరిస్థితి పోయి, ట్యాంక్బండ్ మీది నుంచి హాయిగా సాగిపోయే నేటి పరిస్థితి సాక్షాత్కారమైంది. ఇక తాగునీటి రంగం స్వరూపమే సమూలంగా మారిపోయింది. ఒకనాడు వారానికి ఒకసారి కూడా నల్లా రాని కాలనీలు హైదరాబాద్లో అనేకం. నేడు మంచినీటి సదుపాయం లేని ఇల్లు కనిపించదు. నెలకు 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా అందిస్తున్నది ప్రభుత్వం. భవిష్యత్తులోనూ తాగునీటికి ఢోకా లేకుండా చర్యలు చేపట్టింది.
నగర జీవనానికి ఆక్సిజన్ వంటి విద్యుత్తు విషయంలోనూ సీఎం కేసీఆర్ ముందుచూపుతో వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ చుట్టూ తొమ్మిది 400 కేవీ సబ్స్టేషన్లను నెలకొల్పటం ద్వారా నగరానికే ప్రత్యేకమైన గ్రిడ్ను నెలకొల్పారు. నగరం కాంక్రీట్ జంగిల్గా మారిపోకుండా అర్బన్ ఫారెస్టులను ప్రభుత్వం ఏర్పాటుచేసి అభివృద్ధి చేస్తున్నది. హరితహారం పథకం ద్వారా కోట్ల సంఖ్యలో మొక్కలు నాటుతున్నది. దీనివల్లే ప్రఖ్యాత ‘ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్’ పురస్కారానికి హైదరాబాద్ వరుసగా రెండుసార్లు ఎంపికైంది. జిల్లాల నుంచి నగరంలోకి ప్రవేశించే మార్గాల వద్ద, నగరంలో పలు కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన కళాకృతులు, రోడ్లకు ఇరువైపులా వేయించిన పెయింటింగ్లు హైదరాబాద్ అందాన్ని ఇనుమడిస్తున్నాయి. చెరువుల పరిరక్షణతోపాటు పురాతన బావుల పునరుద్ధరణను కూడా ప్రభుత్వం చేపట్టింది. ఈ పటిష్ఠమైన పునాది వల్లే హైదరాబాద్ నగరం పెట్టుబడులకు కేంద్రంగా వర్ధిల్లుతూ విశ్వనగరంగా ఎదుగుతున్నది.