రైతుదే తెలంగాణము రైతుదే అన్న దాశరథి కవివాక్కు అక్షర సత్యమైంది. రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు ఈరోజు దేశానికే దిశానిర్దేశం చేస్తున్నాయి. కాళేశ్వర గంగను రైతు పొలాలకు మళ్లించి నీటి గోస తీర్చడం, ఇరవై నాలుగుగంటలు నాణ్యమైన ఉచి త కరెంటు సమకూర్చడం, రైతుబంధుతో సాగుపెట్టుబడుల సమ స్యను పరిష్కరించడం వంటి చర్యలు అపూర్వం, అద్వితీయం. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని జాతీయ గర్జన చేసే సాధికారత ఇచ్చిన పథకాలివి. ఇలా సేద్యం అభివృద్ధికి సృజనాత్మకమైన చొరవలు తీసు కోవడమే కాదు, ప్రకృతి విపత్తులతో పంటలు అతలాకుతలమైతే నేనున్నానంటూ ఆపన్నహస్తం అందించి ఆదుకొన్న అచ్చమైన రైతు బంధు మన సీఎం కేసీఆర్.
స్వయంగా రైతు అయిన సీఎం కేసీఅర్ కష్టకాలంలో అన్నదాతకు అన్నివిధాలా అండదండగా నిలుస్తున్నారు. రైతు యోగక్షేమాల కోసం నిరంతరం తపిస్తున్నారు. వడగండ్ల వానలు తెచ్చిన కడగండ్ల నుంచి రైతులను బయట పడేసేందుకు ఇటీవల ఆయన తీసుకున్న నిర్ణయాలే అందుకు సాక్ష్యంగా నిలుస్తాయి. చేతికందిన పంట చెడగొట్టు వానలతో కుప్పకూలితే రైతులను భుజం తట్టి ఓదార్చేందుకు ఆయన స్వయంగా కదిలారు. జ్వరాన్ని కూడా లెక్కచేయకుండా పొలాల్లో కలియదిరిగారు. రైతులతో మాట్లాడారు. పంటనష్టం గురించి తెలుసుకున్నారు. వాలిన పంటను చూసి చలించిపోయారు. రైతన్నల కన్నీరు తుడిచేందుకు మెరుపు వేగంతో నిర్ణయం తీసుకున్నారు. పంటనష్టపోయిన రైతులకు ఎకరాకు పదివేల చొప్పున పరిహారం చెల్లించనున్నట్టు అప్పటికప్పుడు ప్రకటించడమే కాదు, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
కేంద్రప్రభుత్వం లేదా మరే ఇతర రాష్ట్ర ప్రభుత్వం ఈ స్థాయిలో పరిహారం అందించిన దాఖలాలు లేవు. అదలా ఉండగానే రైతుపై మరో పిడుగు పడింది. పంట దిగుబడిని ఇక కాంటా వేయడమే తరువాయి అన్న దశలో ప్రకృతి విరుచుకు పడింది. పంటకోతలను పూర్తి చేసుకుని కూర్చున్నవాళ్లపై, ధాన్యం అమ్ముకునేందుకు మార్కెట్కు చేరుకున్నవాళ్లపై ప్రకృతి మరోసారి విరుచుకుపడింది. నోటికాడి ముద్దను ఎత్తగొట్టినట్టుగా దిగుబడిని గాలివానలతో, వడగండ్లతో నీటముంచేసింది. మామూలు ధాన్యం కొనడానికే కేంద్రం మొరాయిస్తుంది. పనికిమాలిన కొర్రీలు వేసి ముప్పుతిప్పలు పెడుతుంది. ఇక తడిసిన ధాన్యం ఎవరు కొంటారని దిగులు పడుతున్న రైతును సీఎం కేసీఆర్ తనదైన రీతిలో అక్కున చేర్చు కొన్నారు. తడిసిన ధాన్యాన్ని తడవని ధాన్యంతో సమానంగా మద్దతు ధరకే కొంటామని ప్రకటించి సీఎం కేసీఆర్ తన పెద్ద మన సును మరోమారు చాటుకున్నారు.
గరిష్ఠ తేమశాతం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అయితే రైతువ్యతిరేక ఢిల్లీ పాలకుల నుంచి స్పందన లేదు.దీంతో ఇంకా వేచి చూడకుండా రాష్ట్రప్రభుత్వమే స్వయంగా చివరి గింజవరకూ కొంటుందని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. తన పరిపాలనకు కర్త, కర్మ, క్రియ రైతులేనని ముఖ్యమంత్రి మరోసారి ఆచరణాత్మకంగా చాటిచెప్పారు. చెడగొట్టు వానల నుంచి పంటను కాపాడేందుకు నాట్లను ముందస్తుగా వేసుకోవాలని సూచించడం రైతుల పట్ల ప్రభుత్వానికున్న నిరంతర శ్రద్ధకు నిదర్శనం. కేసీఆర్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పడానికి ఇంతకన్నా ఇంకేం కావాలి!