ఎన్నికైన ప్రజాప్రతినిధులు పార్టీలు మారడం, ప్రభుత్వాలు తారుమారు కావడం అనాదిగా జరుగుతున్నదే. కానీ, రిటర్నింగ్ అధికారే ఓటును ఖరాబు చేయడం అనేది ప్రజాస్వామ్యంలో అనూహ్య పరిణామం. దీనివల్ల నిష్పాక్షికత నిర్వీర్యమైపోయి పవిత్రమైన ఓటు అపహాస్యం పాలవుతుంది. నమ్మకం వమ్మయిపోతుంది. మొత్తంగా ప్రజాస్వామ్యమే గంగలో కలుస్తుంది. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఈ తరహా అఘాయిత్యమే జరిగింది. దీనిపై సుప్రీంకోర్టు వెలువరించిన తాజా తీర్పు కుటిల రాజకీయానికి చెంపపెట్టు వంటిదని చెప్పాలి. ఆప్కు బదులుగా బీజేపీ మేయర్ అభ్యర్థి గెలిచినట్టు ప్రకటించేందుకు ప్రిసైడింగ్ అధికారి అనిల్ మసీహ్ స్వయంగా కొన్ని బ్యాలెట్లను కొట్టివేయడంపై సుప్రీంకోర్టు మండిపడింది. ఆయనను ప్రాసిక్యూట్ చేయాలని ధర్మాసనం ఆదేశించడం గమనార్హం.
ప్రజాస్వామ్యంలో ఎవరైనా గెలవాలనే పోటీ చేస్తారు. కానీ గెలిచేందుకు అడ్డదార్లు తొక్కడం, అందుకు తటస్థ అధికారులు చేతివాటంతో తోడ్పాటు అందించడం ఏమాత్రం క్షంతవ్యం కాదు. ప్రజలు చైతన్యవంతులయ్యారు. వారి కన్నుగప్పి మోసగించడం సాధ్యమయ్యే పనికాదు. ఆధునిక సాంకేతికత పారదర్శకతను పెంచింది. గతంలో జరిగిన అవకతవకల కారణంగా ఎన్నో బిగింపులు కూడా అమలులోకి వచ్చాయి. ఇన్ని ఉన్నప్పటికీ పైన తెలిపిన ఉదంతం జరగడం అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా ప్రశంసలు అందుకునే భారత్కు తలవంపులు తెచ్చింది. పైగా దేశంలో అప్రతిహత పాలకపక్షంగా కొనసాగుతున్న బీజేపీకి చెందిన వ్యక్తి ఇలా ఓటు హననానికి పాల్పడటం ఏమాత్రం ఉపేక్షించదగ్గ విషయం కాదు. ఒకవేళ ఇది స్థానిక నాయకత్వం ప్రమేయంతో జరిగిందని భావించినా.. జాతీయ నాయకత్వం ఇలాంటి ఓటు మోసాలు దేశానికి చేటు తెస్తాయని గుర్తించాలి. దీనిపై సరైన విధంగా స్పందించి పార్టీపరంగా కఠినచర్యలు తీసుకోవాలి.
ఇక అంతర్గత ప్రజాస్వామ్యం విషయంలోనూ బీజేపీ అనుసరిస్తున్న విధానాలు ప్రశ్నార్థకమవుతున్నాయి. పార్టీ అధ్యక్షుని నియామకం, పదవీకాలం పొడిగింపుపై పార్టీ పార్లమెంటరీ బోర్డుకు అధికారం కల్పించడం చర్చనీయాంశమవుతున్నది. అందుకు పార్టీ రాజ్యాంగాన్ని సవరిస్తూ ఇటీవల జాతీయ సదస్సులో తీర్మానించడం గమనార్హం. పార్లమెంటరీ బోర్డు అత్యున్నత విధాన నిర్ణాయక విభాగమే కావచ్చు. కానీ, పార్టీ సభ్యులు ఎన్నుకోవాల్సిన పదవిని బోర్డు నియామక పరిధిలోకి తేవడం అంతర్గత ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టడమే అవుతుంది. ఒకరకంగా ఇది కాంగ్రెస్ సంస్కృతిని కాపీ కొట్టడమే. కాంగ్రెస్లో పార్టీ వ్యవస్థ ఎప్పుడూ అధికారం చుట్టే తిరుగుతుంది. సుదీర్ఘకాలం దేశాన్ని పాలించడం వల్ల ఆ సంస్కృతి కాంగ్రెస్కు అబ్బి ఉండవచ్చు. కానీ, ఈ విషయంలో కాంగ్రెస్లోనే మార్పులు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే, కాంగ్రెస్ ముక్త్ భారత్ను కోరుకునే బీజేపీ పాత సంస్కృతిని అనుసరించడం అంతగా శోభించదు. పైగా రెండు విడతల అధికారాన్ని అనుభవించి మూడో విడతకు అర్రులు చాస్తున్న వేళ ప్రజాస్వామ్య వ్యవస్థ, విలువల పట్ల తన నిబద్ధతను మరింత బలంగా చాటుకోవాల్సి ఉందని బీజేపీ గుర్తించాలి.