‘తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు… -‘ప్రయత్నిస్తే ఇసుక నుంచి నూనె తీయవచ్చు. ఎండమావులలో నీరు తాగవచ్చు. కానీ, మూర్ఖుల మనసు మాత్రం రంజింపజేయలేము’ అని చెప్తుంది భర్తృహరి సుభాషితం. కేంద్రంలోని మోదీ సర్కార్ తీరు కూడా ఇలాగే ఉన్నది. తెలంగాణలో రైతులు పండించిన వడ్లను తీసుకోవాలంటూ విజ్ఞప్తులు, లేఖలు, కేంద్ర మంత్రులతో భేటీలు, స్వయంగా సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలు.. ఈ రకంగా ఎన్నివిధాల అభ్యర్థించినా కేంద్రం తన మొండి వైఖరిని మార్చుకోలేదు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో పది రోజులు టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేసినా ఉలుకూ పలుకూ లేదు. దీంతో శీతాకాల సమావేశాలను పూర్తిగా బహిష్కరిస్తున్నామని ప్రకటించడం మినహా టీఆర్ఎస్ ఎంపీల ముందు మరో మార్గం లేకపోయింది.
‘ఆజ్ సే హమారా నారా హై.. మోదీ సర్కార్ జానా హై’ (మోదీ సర్కార్ పోవాలన్నదే నేటి నుంచీ మా నినాదం) అంటూ టీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో చేసిన ప్రకటన కేంద్రం-తెలంగాణ సంబంధాల్లో కీలక మలుపునకు నాంది కాగలదు. కొత్త రాష్ట్రం, కేంద్రంతో వైరం ఎందుకని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇన్నేండ్లూ ఓపిక పట్టారు. విభజన చట్టంలో ఉన్న హామీలను నెరవేర్చకపోయినా, రాష్ట్రం నుంచి పంపి న విజ్ఞప్తులను బుట్టదాఖలా చేసినా సహించారు. కానీ, తను ప్రాణసమానంగా చూసుకొనే రైతులకే కేంద్రం అన్యాయం చేయడానికి ప్రయత్నించడాన్ని కేసీఆర్ తట్టుకోలేకపోయారు. ముఖ్యమంత్రి వ్యూహాత్మకంగా వ్యవహరించటం వల్ల.. నేడు తెలంగాణ ఏడేండ్ల స్వల్పకాలంలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలదొక్కుకోగలిగింది. ఐటీ నుంచి కులవృత్తుల వరకూ అన్నిరంగాల్లో ఇతర రాష్ర్టాలకు మార్గనిర్దేశనం చేసే స్థాయిలో ఉంది. ఇక వ్యవసాయరంగంలో తెలంగాణ సాధించినదానిని.. దేశంలో జరిగిన హరిత విప్లవంతో తప్ప మరిదేనితోనూ పోల్చలేము.
సుదీర్ఘ పోరాటం తర్వాత కొత్తగా ఆవిర్భవించిన ఒక రాష్ట్రం ఇంత స్వల్ప వ్యవధిలో ఇంతటి ఘనవిజయాలను సాధిస్తే కేంద్ర ప్రభుత్వం గర్వపడాలి. భుజం తట్టి ప్రోత్సహించాలి. చేయూతనం దించాలి. కానీ, మోదీ-షా ద్వయం ఆలోచనలే వేరు. వారికి రాజకీయాలు తప్ప దేశ ప్రయోజనాలు పట్టవు. సాగు చట్టాల విషయం లో దేశ రైతాంగం ఏడాదిగా బలిదానాలు చేస్తూ పోరాడినా స్పందించని వీరు.. యూపీ ఎన్నికలకు భయపడి చట్టాలను రద్దు చేశారు. మద్దతు ధర విషయంలో స్వామినాథన్ సిఫారసులను అమలుచేస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చినాక.. వీలుకాదు పొమ్మం టున్నారు. మరోవైపు తమ కార్పొరేట్ మిత్రులకు మాత్రం పన్నులు తగ్గిస్తారు. వేలు, లక్షల కోట్ల మినహాయింపులు, రాయితీలు ఇస్తారు. ప్రారంభం ఉన్న ప్రతిదానికీ ముగింపు కూడా ఉంటుందనేది సత్యం. టీఆర్ఎస్ పూరించిన సమరశంఖంతోనైనా కేం ద్ర ప్రభుత్వం మేల్కొనాలి. 60 ఏండ్ల కలను 13 ఏండ్లలో నిజం చేసి న పార్టీకి, మరో కొత్త పోరాటాన్ని ప్రారంభించటం పెద్ద కష్టమేమీ కాదని గుర్తెరగాలి.