నాలుగేండ్ల క్రితం మామా అల్లుళ్లు పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.14 వేల కోట్లకుపైగా ముంచి పారిపోతే, ఇప్పుడు అన్నదమ్ముల వంతు వచ్చింది. ఐడీబీఐకి రూ.6,700 కోట్లకుపైగా ఎగ్గొట్టి, దేశీయ బ్యాంకింగ్ కుంభకోణాల చరిత్రలో రెండో అతిపెద్ద స్కాం రికార్డును సొంతం చేసుకున్నారు! మొదటి రికార్డు స్థాపకులైన మెహుల్ చోక్సీ, ఆయన మేనల్లుడు నీరవ్ మోదీ, ఇప్పుడు రెండోస్థానంలో నిలిచిన సంఘవీ సోదరులు గుజరాత్కే చెందినవారు కావటం గమనార్హం. ఈసారి కాస్త ఊరట ఏమిటంటే.. కేంద్రీయ దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ కళ్లు తెరిచి కేసులు పెట్టటానికి ముందే విదేశాలకు ఉడాయించిన చోక్సీ, మోదీలాగా సంఘవీ సోదర త్రయం దేశాన్ని వీడిపోలేదు. ఐడీబీఐ నుంచి లభించిన భరోసా వల్లనే వీరు నిబ్బరంగా ఉండి ఉంటారు. సంఘవీల నుండి రావాల్సిన బకాయిలు రూ.16.72 కోట్లు మాత్రమేనని ఒకసారి, రూ.67.13 కోట్లని మరోసారి ఐడీబీఐ ప్రకటన కూడా ఇచ్చింది.
బకాయిలు ఇంత స్వల్పమే అయితే సంఘవీల పేర్లు బయటకు ఎలా వచ్చినట్లు? ఐడీబీఐ యజమానిగా ఉన్న ఎల్ఐసీ త్వరలో పబ్లిక్ ఇష్యూకు వెళ్తున్న సందర్భంలోనే ఈ వ్యవహారం ఎందుకు బట్టబయలైనట్లు? సంఘవీ డైమండ్స్ కంపెనీ 2018లోనే పలు ప్రభుత్వ బ్యాంకులకు రూ.468 కోట్ల రుణాన్ని ఎగవేసే ప్రయత్నం చేసిందని తెలిసి కూడా ఐడీబీఐ ఆ కంపెనీకి అండగా ఎలా నిలిచినట్టు? ఈ భేతాళ ప్రశ్నలకు జవాబులు కనుగొని నష్టనివారణ చర్యలు తీసుకునేలోగా, మరో కుంభకోణం బయటపడి పాతదాన్ని మరిపిస్తుంది. ఈలోపు ఈ బడా ఆర్థిక నేరగాళ్ల మీద సినిమాలు, సీరియళ్లు వస్తాయి. ఐఐఎం వంటి ప్రఖ్యాత బిజినెస్ స్కూళ్లలో వీళ్ల కేసులు విద్యార్థులకు బోధించే పాఠ్యాంశాలవుతాయి. కంచే చేను మేస్తున్నప్పుడు విజయ్మాల్యా, నీరవ్మోదీ, మెహుల్చోక్సీ, సంఘవీ బ్రదర్స్ వంటి వారెందరో పుడుతూనే ఉంటారు.
ప్రభుత్వ పెద్దలు, బ్యాంకుల ఉన్నతాధికారుల సహకారం లేకుండా ఇంతటి బడాచోరీలకు పాల్పడే అవకాశం వీరికి ఉండదనేది బహిరంగ రహస్యమే. భారీ రుణ ఎగవేతదార్ల పేర్లను బయటపెట్టాలని ఆర్బీఐని, కేంద్రాన్ని సామాజిక కార్యకర్తలు కొన్నేండ్లుగా కోరుతూనే ఉన్నారు. అయినా బ్యాంకులకు, ఖాతాదారులకు మధ్యనున్న విశ్వసనీయతకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని చెబుతూ నిరాకరించడం గమనార్హం. సుప్రీంకోర్టు జోక్యంతో కొన్ని పేర్లను బయటపెట్టినప్పుడు, ప్రభుత్వ బ్యాంకులను బడాబాబులు, బడాకంపెనీలు ఏ విధంగా నిలువునా ముంచేస్తున్నాయో వెల్లడైంది. రఘురామ్ రాజన్ ఆర్బీఐ గవర్నర్గా ఉన్నప్పుడు వీరి పేర్లను ప్రధాని మోదీ కార్యాలయానికి పంపుతూ చర్యలు తీసుకోవాలని కోరారు. కానీ ప్రభుత్వం ఒకట్రెండు కంపెనీలపై అరకొర చర్యలకే పరిమితమైంది. ఈ విధంగా రక్షకుడే భక్షకులను రక్షిస్తే ఇక బ్యాంకుల పరిస్థితి ఏమిటి? ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ విషయమై ఇప్పటికే భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో ఈ కుంభకోణాలకు సంబంధించి ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మోదీ ప్రభుత్వం మీద ఉన్నది.