ప్రస్తుతం నడుస్తున్నది సామాజిక మాధ్యమాల యుగం. ఇందులో ఫేక్ న్యూస్ లేదా తప్పుడు సమాచారం కుప్పలు తెప్పలుగా వస్తుంటుంది. ఏది సత్యమో, ఏది అసత్యమో తేల్చుకోవడం చాలా కష్టం. నిజం గడప దాటేలోగా అబద్ధం ప్రపంచమంతా చుట్టివస్తుందనే నానుడి తెలిసిందే. అసత్య ప్రచారాలతో, దుష్ప్రచారాలతో సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ హననాలు జరుగుతూనే ఉన్నాయి. నిజం నిలకడ మీద నిగ్గు తేలుతుందేమో కానీ, ఈలోగా మనుషుల మెదళ్లలో చేరే మకిలి ఎప్పుడు పోవాలి? ఎవరు కడగాలి? తప్పుడు సమాచారం సమాజంలో అవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. 2024 సంవత్సరంలో ప్రపంచం ఎదుర్కొనే సమస్యల్లో కాలుష్యం, యుద్ధాలు ఉండితీరతాయనేది అందరికీ తెలిసిందే.
అదేవిధంగా ప్రకృతి బీభత్సాలు, ఆర్థిక ఉత్పాతాలు ఎటూ ఉండనే ఉంటాయి. అయితే ప్రధానంగా ముప్పు కలిగించే అంశాల్లో ‘తప్పుడు సమాచారం’ రెండో స్థానంలో ఉన్నట్టు ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యుఈఎఫ్) హెచ్చరించడం గమనార్హం. బుధవారం విడుదల చేసిన ముప్పుల నివేదికలో అనేక ఆసక్తికరమైన అంశాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సర్వే చేసి రూపొందించిన ఈ నివేదికలో ఐదు ప్రధానమైన ముప్పులను తేల్చారు. ఈ ఐదింటిలో అన్నిటికన్నా ఎక్కువ ముప్పు ‘తప్పుడు సమాచారం’ వల్ల కలుగుతుందని నివేదిక అంచనా వేస్తున్నది. వచ్చే రెండేండ్ల పాటు ఈ సమస్య వేధిస్తుందని అంటున్నారు. ప్రత్యేకించి భారత్కు ఈ ముప్పు అధికంగా ఉన్నదని హెచ్చరించడం విశేషం. 20 ఏండ్లుగా వెలువడుతున్న ఈ నివేదికల్లో తప్పుడు సమాచారాన్ని పెద్ద ముప్పుగా గుర్తించడం ఇదే ప్రథమం.
బోధన, వాణిజ్యం, ప్రభుత్వ వర్గాలకు చెందిన 1,500 మంది నిపుణుల అభిప్రాయాల ఆధారంగా డబ్ల్యుఈఎఫ్ నివేదిక రూపొందుతుంది. ఎన్నికల్లో దుష్ప్రచారం, ప్రకృతి ఉత్పాతాలు, సమాజంలో చీలికలు, సైబర్ అభద్రత, సాయుధ ఘర్షణలను ఐదు స్వల్పకాలిక, దీర్ఘకాలిక ముప్పులుగా నివేదిక గుర్తించింది. అంటువ్యాధులు, ఆర్థిక నేరాలు, అసమానతలు, కార్మికుల కొరత వంటి ముప్పులను కూడా ప్రస్తావించినప్పటికీ దీర్ఘకాలికంగా కాలుష్యమే అతిపెద్ద సమస్యగా ఉంటుందని తేల్చిచెప్పింది. గరిష్ఠస్థాయిలో 66 శాతం మంది వాతావరణ కాలుష్యం అతిపెద్ద ముప్పు అని అభిప్రాయపడగా, 53 శాతం మంది కృత్రిమ మేధ (ఏఐ) ద్వారా వండివార్చే తప్పుడు సమాచారం పెద్ద సమస్యగా ఉంటుందని తెలిపారు.
ఈ ఏడాది భారత్తో సహా 60కి పైగా దేశాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. 200 కోట్ల మంది తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఈ కారణంగానే 2024కు ఎన్నికల నామ సంవత్సరమనే పేరు కూడా వచ్చింది. ఎన్నికల ప్రచార క్రమంలో తప్పుడు సమాచారం వచ్చిచేరితే కొత్తగా ఎన్నికయ్యే ప్రభుత్వాల చట్టబద్ధత ప్రశ్నార్థకమవుతుందని డబ్ల్యుఈఎఫ్ నివేదిక తెలిపింది. ఎన్నికల్లో పోటీ చేసేవారు అవతలి పార్టీపై, ఆ పార్టీ అభ్యర్థిపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు లేదా దురుద్దేశపూరిత పోస్టులు పెట్టించడం మనం చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారంపై ఆయా సంస్థలు నిఘా వేయడం పెద్ద పనే. మరోవైపు ఏఐ ద్వారా తయారుచేసే ఫేక్ పోస్టుల అసలు రంగు పసిగట్టడం అంతకంతకూ కష్టసాధ్యంగా మారుతున్నదని నివేదిక గుర్తుచేసింది. చేతికందిన సమాచారాన్ని గుడ్డిగా తొందరపడి నమ్మకుండా నిజానిజాలు నిగ్గు తేల్చుకోవడం ఒక్కటే ఈ సమస్యకు విరుగుడు. నిరంతర జాగరూకతే ‘ప్రజాస్వామ్యానికి రక్ష’ అనే పెద్దల మాట ఈ సందర్భంగా గుర్తుకురాక మానదు.