ప్రధాని మోదీని విమర్శించినందుకు గుజరాత్కు చెందిన ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీని అస్సాం పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లటం, జైలు పాలు చేయటం, ఆ కేసులో బెయిల్ రాగానే, మళ్లీ మరో కేసు బనాయించి జైలు నుంచి బయటకు రాకుండా చేయటం ప్రజాస్వామ్య వ్యవస్థలో అనూహ్యం. జిగ్నేశ్ మేవానీ ప్రధాని మోదీని విమర్శిస్తూ సోషల్ మీడియాలో తరచూ వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇటీవల మోదీని గాడ్సే భక్తుడని వ్యాఖ్యానించారు. దేశ ప్రధాని అయిన మోదీని సమర్థించేవారు ఉన్నట్టే విమర్శించే వారూ ఉండటం సహజం. మోదీపై జిగ్నేశ్ మేవానీ చేసిన విమర్శతో ఏకీభవించని వారు కూడా ఆయనపై చేపట్టిన కక్ష సాధింపు చర్యలను సమర్థించరు. భావ వ్యక్తీకరణ ఈ దేశ రాజ్యాంగం హామీ ఇచ్చిన హక్కు. జిగ్నేశ్ మేవానీ చేసిన విమర్శను చర్చ ద్వారా ఎదుర్కోవచ్చు. ఆయన వ్యాఖ్యలను బహిరంగంగా తప్పు పట్టే హక్కు ఇతరులకూ ఉంటుంది. కానీ మేవానీ నోరు మూయించాలని చూడటం మాత్రం ప్రజాస్వామ్య విరుద్ధం.
తమను విమర్శించిన వారిపై కక్ష సాధించడం మోదీ సర్కారుకు ఇది మొదటిసారి కాదు. యావత్ దేశం కరోనాతో అల్లాడుతున్న సమయంలో, ‘మోదీజీ! మన పిల్లల కోసం వాడాల్సిన వ్యాక్సిన్లను విదేశాలకు ఎందుకు పంపించారు’ అంటూ ఒక ప్రశ్నను ముద్రించి గతేడాది మే నెలలో ఢిల్లీలో కొందరు పోస్టర్లు వేశారు. ఈ విధంగా ప్రధానిని ప్రశ్నించటం పెద్ద నేరమైపోయింది. రకరకాల అభియోగాలతో కేసులు పెట్టి, 25 మందిని అరెస్టు చేశారు. ఎన్నార్సీ-సీఏఏలకు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసన తెలిపిన ఉద్యమకారులకు సిక్కులు గురుద్వారాల ద్వారా ఆహారాన్ని అందజేస్తుంటే, వారిపై ఉగ్రవాదం నుంచి దొంగతనం వరకు పలురకాల కేసులు పెట్టి వేధించారు. కేంద్ర హోంమంత్రి అమిత్షాను విమర్శించినందుకు యూపీ పిల్లల వైద్యుడు కఫీల్ఖాన్ జీవితంతో ఎలా ఆడుకున్నారో దేశమంతా చూసింది.
‘మేం ఏం చేసినా మమ్మల్ని వేలెత్తిచూపే సాహసానికి పూనుకోవద్దు. ఆ పని చేస్తే.. వీరికి పట్టిన గతే పడుతుంది’ అంటూ ఒక జిగ్నేశ్ మేవానీని, ఒక కఫీల్ ఖాన్ను ప్రదర్శనకు పెడుతున్నది మోదీ సర్కారు. ప్రపంచానికే వ్యాక్సిన్ల తయారీ కేంద్రంగా ఉన్న భారత్లో వ్యాక్సిన్ల కొరత ఎందుకుంది? కేంద్రప్రభుత్వ సమన్వయలోపమే కారణం కాదా? అని నిలదీస్తే నేరమా? ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాన్ని విమర్శించడం సాధారణం. ఆ విమర్శలలో వాస్తవం ఉందా లేదా అనేది ప్రజలు గమనిస్తారు. నెహ్రూ మొదలుకొని ప్రధానులు అంతా తమ పరిపాలనా కాలంలో అనేక విమర్శలను ఎదుర్కొన్నవారే. కానీ ఈ విధంగా కక్ష సాధించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదం. స్వతంత్ర భారతదేశం 75 ఏండ్లలో ఎన్నడూ ఎదుర్కోని సంక్షోభం ఇది. ఈ అంధకారాన్ని, ఈ తిరోగమనాన్ని ఇలాగే కొనసాగనివ్వ కూడదు. దేశంలో చైతన్యం ఉన్న వాళ్లందరూ కలిసి కట్టుగా ఎదుర్కోవాల్సిన మహా ప్రమాదం ఇది.