‘కాకులను కొట్టి గద్దలకు వేయడం’ అంటే ఏమిటో ఘనత వహించిన మోదీ ప్రభుత్వానికి బాగా తెలుసు! గతేడాది కరోనా మూలంగా, లాక్డౌన్లతో పేదలు అల్లాడిపోతుంటే బిలియనీర్లు మాత్రం 102 నుంచి 142కు పెరిగిపోయారని ఆక్స్ఫామ్ నివేదిక వెల్లడించింది. 2020 మార్చి నుంచి నవంబర్ 30వ తేదీ మధ్యకాలంలో వంద మంది అత్యంత ధనవంతుల సంపద 23. రూ.14 లక్షల కోట్ల నుంచి 53. 16 లక్షల కోట్లకు పెరిగిపోయింది. మరోవైపు నాలుగున్నర కోట్లకు పైగా భారతీయులు కొత్తగా పేదరికంలోకి దిగజారిపోయారు. డావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో గత ఆదివారం ఆక్స్ఫామ్ ‘అసమానత హతమారుస్తుంది’ పేర నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక మోదీ ప్రభుత్వ స్వభావానికి అద్దం పట్టింది.
కరోనా మూలంగా కేంద్ర ప్రభుత్వం పేదలను ఆదుకోవడానికి ముందుకురావాలి. విద్య, వైద్యానికి, సంక్షేమ పథకాలకు కేటాయింపులు పెంచాలి. పేద, మధ్యతరగతిపై పన్ను భారం తగ్గించి ఊరటనివ్వాలి. కానీ మోదీ ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా 2020- 21లో బడ్జెట్లో ఆరోగ్య పరిరక్షణకు కేటాయింపును పది శాతం తగ్గించింది. విద్యకు కేటాయింపులో ఆరు శాతం కోత పడ్డది. సామాజిక భద్రతా పథకాలకు కేటాయింపులు 1.5 శాతం నుంచి 0.6 శాతానికి తగ్గిపోయాయి. పేదలను కరోనా కకావికలం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ధనవంతులకు పన్నులు మాఫీ చేస్తూ, పేదల నడ్డివిరిచే పన్నులను వడ్డించింది. కార్పొరేట్ టాక్స్ను 30 నుంచి 22 శాతానికి తగ్గించడం వల్ల ఖజానాకు లక్షన్నర కోట్ల నష్టం వాటిల్లింది. ధనవంతులపై భారం పడకుండా ఆదాయం పన్ను, కార్పొరేట్ పన్ను, క్యాపిటల్ గెయిన్స్ పన్నును తగ్గించిన మోదీ ప్రభుత్వం ఆ లోటును భర్తీ చేయడానికి పేద మధ్యతరగతిపై భారం పడే జీఎస్టీ వంటి పరోక్ష పన్నులను పెంచడం గమనార్హం.
పెద్ద నోట్ల రద్దు, హటాత్తుగా లాక్డౌన్ వంటి నిర్ణయాలు మోదీ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలకు నిదర్శనమే. మోదీ సర్కారు పేదల జీవితాలను ఆగమాగం చేస్తుంటే బీజేపీ వీరాభిమానులు మాత్రం తమ పార్టీ ఏదో పేదలకు మేలు చేస్తున్నట్టు తప్పుడు కథనాలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. బీజేపీ ఛోటా నాయకులు నోటికొచ్చినట్టల్లా రాజకీయ ప్రత్యర్థులను విమర్శిస్తున్నారు. ఆక్స్ఫామ్ నివేదిక పేర్కొన్నట్టు- దేశంలోని 98 అత్యంత సంపన్న కుటుంబాలపై ఒక శాతం టాక్స్ విధించినా ప్రజలందరికీ ఆరోగ్య పరిరక్షణకు సరిపడా నిధులు లభిస్తాయి. ప్రభుత్వ పక్షపాతం మూలంగా బిలియనీర్లుగా మారిన కొద్దిమందిపై కొద్దిపాటి పన్ను వేసినా పేదల సంక్షేమ పథకాలు అన్నీ అమలవుతాయి. కానీ బిలియనీర్లను నొప్పించి పేదలను మంచి చేయడానికి మోదీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదా అనేది సందేహమే.