పల్లె పల్లెనా పల్లేర్లు మొలిసే పాలమూరులోనా అంటూ కన్నీటి పాటలు పాడుకున్న నేల అది. బతుకుదెరువు కోసం ముంబయి, దుబయిలకు వలసపోయిన ప్రాంతం అది. కృష్ణా, తుంగభద్ర నదుల నడుమ నడిగడ్డగా పేరొందినా.. తాగేందుకు గుక్కెడు నీళ్లు లేని జిల్లా అది. అటువంటి నేల ఈనాడు పచ్చటి పంటలతో తులతూగుతున్నది. వలసపోయిన బిడ్డలు వెనుకకు రావటంతో గ్రామాలు కళకళలాడుతున్నాయి. తాగునీరేకాదు, సాగునీరు సమస్యను కూడా శాశ్వతంగా పరిష్కరించే బ్రహ్మాండమైన పాలమూరు ఎత్తిపోతల పథకం వడివడిగా పూర్తవుతున్నది. దశాబ్దాల గోస కేవలం తొమ్మిదేండ్లలో కనుమరుగవటం అద్భుతం లాంటి ఒక వాస్తవం. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో స్వరాష్ట్రం తెలంగాణ సాధించిన మహత్తర విజయాల్లో ఇదొకటి.
కేసీఆర్ సారథ్యంలో జరిగిన మేధోమథనం, పకడ్బందీ ప్రణాళికలు, నిధుల మంజూరు, క్షేత్రస్థాయిలో ప్రణాళికల అమలు వంటి సమగ్ర కార్యాచరణ వల్లే ఇది సాధ్యమైంది. ఆకాశం నుంచి పడే ప్రతి నీటిచుక్కను ఉపయోగించుకునే విధంగా వాగులు, కుంటల మీద చెక్డ్యామ్ల నిర్మాణం ఒక ఉద్యమంలా జరిగింది. మిషన్ కాకతీయ కింద వందలాది చెరువులలో పూడిక తీసి ఆధునీకరించారు. ఈ ప్రయత్నాలతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో భూగర్భ జలాలు పెరిగాయి.
2015-22 మధ్యకాలంలో 8.89 మీటర్ల వృద్ధి నమోదైంది. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తవుతున్న క్రమంలో సాగునీటి సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. నెర్రెలు వారిన నేలలు గొంతు తడుపుకొన్నాయి. ఎక్కడెక్కడికో వలసపోయిన మట్టిబిడ్డలు సొంతూళ్లకు తరలి వచ్చి, నాగళ్లను బయటకు తీశారు. విస్తారమైన ఆహార, వాణిజ్య పంటలతోపాటు పండ్లు, కూరగాయల తోటలతో నేడు పాలమూరు భూములు పచ్చరంగేసుకున్నట్టు కనిపిస్తున్నాయి. ప్రతిరోజూ మహబూబ్నగర్ నుంచి ముంబయికి వలస జీవుల్ని మోసుకెళ్లిన ఆర్టీసీ బస్సు నేడు ముంబైకి వెళ్లే వారు లేక రద్దయ్యింది. అక్కడ వచ్చిన మార్పుకు ఇది ఒక స్పష్టమైన సంకేతం.
ఉమ్మడి ఏపీలో మహబూబ్నగర్ను పట్టించుకున్న ప్రభుత్వాలుగానీ, పాలకులుగానీ లేరు. ఆ జిల్లా దైన్యం, అక్కడి సమస్యలు సహజసిద్ధమైన శాపాలు అన్నట్లుగా వారి ధోరణి ఉండేది. తమ నిర్లక్ష్యాన్ని, బాధ్యతారాహిత్యాన్ని, అసమర్థతను కప్పిపుచ్చుకోవటానికి రకరకాల వాదనలు తీసుకొచ్చేవారు. తెలంగాణకు సాగునీళ్లు ఎందుకు రావంటే, ఎత్తున ఉంది కాబట్టి అన్నట్టుగా ఉండేది ఈ వ్యవహారం. తెలంగాణ ఉద్యమాన్ని రగిలించిన అంశాల్లో పాలమూరు కరువు వెతలు కూడా ముఖ్యమైనవి. ఏ ఆకాంక్షలతో స్వరాష్ట్రం తెచ్చుకున్నామో, అవన్నీ ఒకటొకటిగా సాకారమవుతున్నాయి. నల్లగొండను పట్టిపీడించిన ఫ్లోరైడ్ సమస్య కనుమరుగైంది. కునారిల్లిన కులవృత్తులు పునర్వైభవాన్ని పొందాయి. పాలమూరు పచ్చబడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించినట్టుగా.. ఆగస్టులో రిజర్వాయర్లను నీటితో నింపిన తర్వాత ఇక పాలమూరు బంగారు తునకే అవుతుంది.