దేశంలో భారీ స్థాయి రైలు ప్రమాదాలు జరిగినప్పుడల్లా, రైల్వేమంత్రి రాజీనామా చేయాలని, ఈ మేరకు లాల్బహదూర్ శాస్త్రి నెలకొల్పిన అత్యున్నత ప్రమాణాన్ని పాటించాలన్న డిమాండ్ వినిపిస్తుంటుంది. ప్రస్తుతం ఒడిశా ఘోర దుర్ఘటన నేపథ్యంలో కూడా మరొకసా రి ఇది ముందుకొచ్చింది. ఈ ప్రమాణాన్ని పాటించిన రైల్వే మంత్రులు చాలా అరుదు. కానీ, లాల్బహదూర్ శాస్త్రి మాత్రం నాడు.. ప్రధాని నెహ్రూను బలవంతంగా తన రాజీనామాకు ఒప్పించిన విషయం చాలామందికి తెలియదు. 1956 ఆగస్టులో మహబూబ్నగర్లో జరిగిన రైలు ప్రమాదంలో 112 మంది మరణించారు. నైతిక బాధ్యత వహిస్తూ రైల్వేమంత్రి లాల్బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారు. కానీ, నెహ్రూ అంగీకరించలేదు.
అదే ఏడాది నవంబరులో తమిళనాడులో మరో ప్రమాదం జరిగి 144 మంది చనిపోయారు. శాస్త్రి మళ్లీ రాజీనామా చేశారు. లోక్సభలో దీనిపై చర్చ జరిగినప్పుడు, అనేకమంది ఎంపీలు ‘రైల్వే సిబ్బంది వైఫల్యానికి మంత్రిని బాధ్యుడిని చేయటం ఎందుకు? శాస్త్రి వంటి నిజాయితీపరుడిని, సమర్థుడిని వదులుకోవద్దు’ అని నెహ్రూకు సూచించారు. అయినప్పటికీ, నెహ్రూ ఆ రాజీనామాను రాష్ట్రపతికి పంపిస్తూ, ‘ఇది లాల్బహదూర్ శాస్త్రిని వ్యక్తిగతంగా బాధ్యుడిని చేయటం కాదు. కానీ, ప్రమాదం నేపథ్యంలో ఆయనలో గూడుకట్టుకున్న తీవ్రమైన ఆవేదనను చూసి ఆ భారం నుంచి తనకు విముక్తి కల్పించటానికి రాజీనామాను అంగీకరిస్తున్నా’ అని చెప్పారు. ఏడు దశాబ్దాల కిందట భారత రాజకీయాలు ఎంతటి ఉచ్ఛస్థాయిలో ఉండేవో తెలియజేసే ఉదంతం ఇది.
నాటికీ నేటికీ ఎంత తేడా! దాదాపు 300 మంది మరణించారు. వెయ్యి మందికిపైగా తీవ్ర గాయాల పాలయ్యారు. ఇంకా పదుల సంఖ్యలో వ్యక్తుల ఆచూకీ దొరకటం లేదు. కొన్ని వందల కుటుంబాల్లో విషాదం నెలకొంది. గత 20 ఏండ్లలో భారతదేశం చూడని అతిపెద్ద రైలు ప్రమాదం ఇది. కానీ, కేంద్రంలోగానీ, సంబంధిత మంత్రిలోగానీ కించిత్తు బాధ, బాధ్యత కనిపించనితనం. పైగా, రకరకాల ప్రకటనలు. ప్రమాదానికి కారణమైన నేరస్థులను గుర్తించామని రైల్వేమంత్రి చెబుతారు. మరోవైపు, కేంద్రం సీబీఐకి దర్యాప్తు బాధ్యతను అప్పచెబుతుంది. ఇంకోవైపు, ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని విచ్చలవిడిగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం. నైతికత మచ్చుకైనా కనిపించని ఎంత దారుణమైన పరిస్థితి ఇది.
ఒడిశా ప్రమాదం వెనుక రైల్వేల్లో ఏండ్లుగా పేరుకుపోయిన నిర్లక్ష్యం, సమస్యలు, సిబ్బంది కొరత ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే మైసూర్ డివిజన్లో రెండు రైళ్లు ఢీకొనే భారీ ప్రమాదం డ్రైవర్ అప్రమత్తతతో తృటిలో తప్పింది. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం, మానవ ప్రమేయం కారణంగా ఇది జరిగిందని తేలింది. రైల్వేల పనితీరుపై కాగ్ గతేడాది వెలువరించిన నివేదికలో, 2017-21 మధ్య రైలుబోగీలు పట్టాలు తప్పిన ఘటనలు 1127 చోటు చేసుకున్నాయని తెలిపింది. పట్టాల నిర్వహణ సరిగా లేకపోవటం, పరిమితికి మించిన వేగం, సాంకేతిక వైఫల్యాలు వంటి అనేక కారణాలను ఉదహరించి, తక్షణ చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. అయినప్పటికీ, కేంద్రం మేల్కొనలేదు. ప్రధానమంత్రి మోదీకి వందేభారత్ రైళ్లను ప్రారంభించటం మీద ఉన్న ఆసక్తి, రైల్వే సమస్యలను పరిష్కరించటంపైన లేదు. దాని ఫలితమే ఇంత పెద్ద దుర్ఘటన. ఇకనైనా కేంద్రం దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందా?