ఈడీ కోరలకు మోదీ సర్కార్ మరింత పదును పెట్టింది. ఈ మేరకు ఈ నెల 7న రెండు గెజిట్ నోటిఫికేషన్లను జారీ చేసింది. తద్వారా 2023- మనీల్యాండరింగ్ నిబంధనలకు కొత్త క్లాజును చేర్చింది. దీనితో వ్యక్తుల, సంస్థల ఆర్థిక లావాదేవీల చరిత్ర పూర్తిగా ఈడీకి అందుబాటులోకి వస్తుంది. ప్రభుత్వాల అధినేతలు, సీనియర్ న్యాయమూర్తులు, సైనికాధికారులు, రాజకీయ నేతలు, ప్రైవేటు కార్పొరేట్ కంపెనీల అధికారులు, ప్రభుత్వాధికారులు అందరూ ఇకపై ఈడీ భూతద్దం కిందికి వస్తారు. వీరినీ రాజకీయంగా ‘ప్రభావవంతమైన వ్యక్తులు’గా కేంద్రం పేర్కొనటం చూస్తుంటే.. రానున్న రోజుల్లో ఆయా రంగాలకు చెందిన వ్యక్తులందరిపైనా కక్షసాధింపు చర్యలు ఉండబోతున్నాయనుకోవచ్చు. మోదీ సర్కార్ చరిత్ర అటువంటిది మరి.
మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈడీ, సీబీఐ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ అసలు విధులను పక్కనపెట్టి.. బాసులు చెప్పే లక్ష్యాలను వేటాడటం మొదలుపెట్టాయి. వీటిలో ఈడీ ముందు వరుసలో ఉన్నది. 2014 నుంచి ఇటీవలి వరకూ 121 మంది రాజకీయ నాయకులపై ఈడీ కేసులు పెట్టింది. వీరిలో 115 మంది విపక్ష నేతలే. ఈడీని ఇంత ‘సమర్థవంతంగా’ నడుపుతున్నందుకే కావచ్చు.. దాని అధిపతి సంజయ్కుమార్ మిశ్రాకు పదవీ విరమణ వయస్సు వచ్చినా కూడా నిబంధనలను మార్చి మరీ పదవీకాలాన్ని పొడిగించింది కేంద్రం. ఈడీకి ఇప్పటికే విచక్షణారహిత అధికారాలున్నాయి. ఎంతగానంటే, ఆ సంస్థ విచారణ జరిపే వ్యక్తికి తనపై ఏం అభియోగాలున్నాయో తెలుసుకునే హక్కు కూడా ఉండదు. ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ను (ఎఫ్ఐఆర్ వంటిది) కేసుకు సంబంధించిన వ్యక్తికి ఈడీ తప్పకుండా ఇవ్వాల్సిన అవసరం లేదని నిబంధనలు చెప్తున్నాయి.
ఈడీ అధికారాల్లోని హేతుబద్ధతను ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో కేసు వేస్తే.. గతేడాది జస్టిస్ అజయ్ మాణిక్రావ్ ఖాన్విల్కర్ ధర్మాసనం దానిని తోసిపుచ్చటం విశేషం. ఈ తీర్పును బీజేపీ చరిత్రాత్మకం అని అభివర్ణించగా.. విపక్షాలు తీర్పు పర్యవసానాలపై తీవ్ర ఆందోళన వెలిబుచ్చాయి. దానికి తగినట్లుగానే ఈడీ స్తైర విహారం చేస్తున్నది. అటు బీహార్ నుంచి ఇటు తెలంగాణ వరకూ.. తనకు లొంగకపోతే శత్రువులే అన్నట్లుగా బీజేపీ సర్కార్ ఈడీని ఉసిగొల్పుతున్నది. సాధారణ ఎన్నికలకు మరో ఏడాదే ఉన్న తరుణంలో ఈడీ అధికారాలను కేంద్రం పెంచింది. ఈ దర్యాప్తుసంస్థ చర్యలు మరింత శృతిమించే అవకాశం ఉన్నది. ఇదొక సంక్షోభ సమయం. అందరి కోసం ఒక్కరు, ఒక్కరి కోసం అందరు అన్నట్లుగా దేశంలోని బీజేపీయేతర పార్టీలు, ప్రజాసంఘాలు, వ్యక్తులు, మేధావులు ముందుకొస్తే అందరూ కలిసి తప్ప ఈ సంక్షోభాన్ని దాటలేం.