తెలంగాణ పునర్నిర్మాణ క్రమంలో అనేక వృత్తులు కొత్త జీవం పోసుకున్నాయి. అందులో ఉమ్మడి రాష్ట్రంలో అడుగంటిపోయిన మత్స్యకార వృత్తి మనకు ప్రముఖంగా కనిపిస్తుంది. రాష్ర్టావతరణం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నీటి వనరుల అభివృద్ధిలో భాగంగా మత్స్య సంపద వృద్ధికి ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. వాటి ఫలితంగా సముద్రతీరమంటూ లేని మన రాష్ట్రం చేపలను దిగుమతి చేసుకునే దశ నుంచి ఎగుమతి చేసే దశకు ఎగబాకింది. ఆరేండ్ల కాలంలో చేపల ఉత్పత్తి 125 శాతం పెరిగింది. మన రాష్ట్రం నుంచి ఇప్పుడు పశ్చిమబెంగాల్, కర్ణాటక, మహారాష్ట్ర, అసోం, త్రిపుర, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, అరుణాచల్ తదితర రాష్ర్టాలకు మన చేపలు సరఫరా అవుతున్నాయి. 2016లో పురుడుపోసుకున్న నీలి విప్లవమే ఇందుకు కారణం. మిషన్ కాకతీయతో, ప్రాజెక్టులతో నీరు గలగలలాడుతుంటే చేపలు మిలమిలలాడుతున్నాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం మత్స్య సంపద పెంపులో అద్భుత విజయాలు సాధించి రికార్డులు నెలకొల్పింది. రాష్ట్ర జీడీపీలో మత్స్యరంగం వాటా 0.5 శాతానికి చేరుకున్నది. మొత్తం రూ.344 కోట్ల పెట్టుబడితో ప్రభుత్వం 22.5 కోట్ల టన్నుల దిగుబడి సాధించింది. దీని విలువ రూ.32 వేల కోట్లు. మారిన పరిస్థితుల నేపథ్యంలో మాంసాహార ప్రియులు కూడా మటన్, చికెన్లకు బదులుగా చేపల వంటకాల వైపే మొగ్గుచూపుతున్నారు. వీటన్నిటి ఫలితంగా వార్షిక ఆదాయం రెట్టింపు కావడంతో మత్స్యకారుల జీవితాల్లో కొత్త వెలుగులు ప్రసరిస్తున్నాయి. చేపల పెంపకంలో మన రాష్ట్రం అనితర సాధ్యమైన ప్రగతిని సాధించింది. వంద శాతం జలాశయాల్లో వంద శాతం ఉచితంగా చేపపిల్లలు, రొయ్యపిల్లలు వదిలిన ఏకైక రాష్ట్రం మనది. అలాగే అత్యధిక మత్స్యకార సొసైటీలు కలిగిన రాష్ట్రం కూడా మనదే. మరోవైపు మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగు పర్చేందుకు 784 మార్కెట్లను ప్రభుత్వం నిర్మించింది. రూ.530 కోట్లతో రవాణా వాహనాలు, మొబైల్ అవుట్లెట్లను సమకూర్చింది.
మత్స్యకార వృత్తినే నమ్ముకున్న ముదిరాజుల సంక్షేమానికి ప్రభుత్వం తదేక దీక్షతో చర్యలు చేపట్టింది. వారిని మత్స్యకారులుగా గుర్తించడమే కాకుండా కోకాపేటలో ముదిరాజ్ భవనం కోసం రూ.300 కోట్ల విలువైన ఐదెకరాల స్థలం, రూ.5 కోట్ల నిధులు మంజూరు చేసింది. రాష్ట్రంలో నీటి వనరులపై మత్స్యకారులకే హక్కు కొనసాగిస్తూ, విలువ జోడింపులో భాగంగా ప్రాసెసింగ్ కేంద్రాల ఏర్పాటు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఈ చొరవలన్నిటికి గుర్తింపుగా రాష్ర్టాన్ని అగ్రిఫుడ్ ఎంపవర్మెంట్ వంటి అవార్డులతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. డిమాండుకు తగ్గట్టుగా కొర్రమీనుల సంపద వృద్ధిచేసేందుకు మిడ్ మానేరులో ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు చేపట్టింది. కీలకరంగం స్థాయికి ఎదిగివస్తున్న చేపల పెంపకానికి సుశిక్షిత మానవ వనరుల కొరత లేకుండా చేసేందుకు మేడ్చల్లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీని ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్నది. ప్రజలకు ఆహారభద్రత కల్పించడం, మత్స్యకారుల సంక్షేమం అనే లక్ష్యాలను సాధించడంలో ప్రభుత్వం ముందంజ వేసిందని చెప్పవచ్చు.