జాతీయ పంచాయతీ అవార్డుల్లో సత్తా చాటడంతో తెలంగాణ మాడల్ మరోమారు దేశం ముందు ఆవిష్కృతమైంది. మొత్తం 46 పురస్కారాల్లో 13 మనకే లభించగా, వాటిలో నాలుగు క్యాటగిరీల్లోనూ మొదటి ర్యాంకులను తెలంగాణ గ్రామాలే కైవసం చేసుకోవటం విశే షం. అటు లెఫ్ట్ నుంచి ఇటు రైట్ వరకూ ఏ పక్షం పాలించే రాష్ట్రమూ మన దరిదాపుల్లో లేదు. డబుల్ ఇంజిన్ రాష్ర్టాలు పేరుకే తప్ప పనులకు కావ ని గుజరాత్, కర్ణాటక నిరూపించాయి. వాటికి ఒక్కటంటే ఒక్క అవార్డు దక్కకపోవటం బీజేపీ పాలకుల చేతగానితనాన్ని వెల్లడిస్తున్నది. తుపాకీ కాల్పుల మోతతో దద్దరిల్లుతూ, చట్టం చట్టుబండలైన అతిపెద్ద రాష్ట్రం యూపీకి ఒకే ఒక అవార్డు, అదీ మూడో ర్యాంకులో దక్కింది. ఇక కాం గ్రెస్ చేతిలో ఉన్న ఏకైక పెద్ద రాష్ట్రం రాజస్థాన్ ఊసులోనే లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ను అడ్డగోలుగా విమర్శించే బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సందర్భమిది.
తెలంగాణ గ్రామాలు జాతీయస్థాయిలో మెరవటం ఇది తొలిసారి కాదు. ఉత్తమ పంచాయతీలకు కేంద్రం ప్రకటించే అవార్డులను ఏటా మన పల్లెలు గణనీయమైన సంఖ్యలో గెల్చుకుంటున్నాయి. 2019-20లో 12 అవార్డులు లభించగా, 2020-21లో 19 దక్కాయి. ఎం పీల నియోజకవర్గాల్లోని ఆదర్శ గ్రామాలను ‘సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన’ కింద ఎంపిక చేస్తే, టాప్ 20లో 19 మనవే. గ్రామాలు-పట్టణాల అనుసంధానంపై కేంద్రం తీసుకొచ్చిన రూర్బన్ అమలులో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. గ్రామ పంచాయతీలకు నిధుల కేటాయింపులో, ఆ నిధుల ఆన్లైన్ ఆడిటింగ్లో మనమే దేశానికి ఆదర్శం. ఓడీఎఫ్ ప్లస్లో 100 శాతం ఫలితాలతో, బహిరంగ మలవిసర్జనను పూర్తిగా నిర్మూలించిన రాష్ట్రం తెలంగాణ.
తొమ్మిదేండ్లలో తెలంగాణ సాధించిన గొప్ప మార్పు ఇది. ఆషామాషీగా జరిగింది కాదిది. దార్శనికుడైన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళిక లు, వాటిని చిత్తశుద్ధితో అమలుచేసిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమష్టి కృషి ఫలితం ఇది. తెలంగాణ గ్రామాల రూపురేఖలను మార్చే తలంపుతో కేసీఆర్.. 2018లో నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకువచ్చారు. నాటే మొక్కల్లో కనీసం 85 శాతం బతుకాల్సిందేనని చట్టంలో నిబంధన చేర్చారు. దీంతో గ్రామా లు పచ్చటి సీమలయ్యాయి. 2019 నుంచి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి గ్రామానికి పారిశుద్ధ్య సిబ్బంది వినియోగానికి ఒక ట్రాక్టర్ను సమకూర్చారు. గ్రామాలు పరిశుభ్రంగా మారాయి. వైకుంఠధామం, నర్సరీ, పల్లెప్రకృతి వనం, డంపింగ్యార్డ్ ప్రతి పల్లెలో నిర్మాణమయ్యాయి. గ్రామానికో కార్యదర్శిని నియమించి, పనులు సవ్యంగా జరిగేలా పురమాయించారు. పక్షపాతం, జాప్యం లేకుండా నిధులు విడుదల చేసి, సక్రమంగా వ్యయమయ్యేలా చర్యలు చేపట్టా రు. మిషన్ భగీరథతో ఇంటింటికీ సురక్షిత తాగునీరు లభిస్తున్నది. మిషన్ కాకతీయతో చెరువులు పునరుజ్జీవం పొందాయి. సాగునీటి సదుపాయాలతో, రైతుబంధు వంటి ప్రోత్సాహకాలతో వ్యవసాయం పండుగలా మారింది. తెలంగాణ గ్రామాలు దేశానికి ఆదర్శంగా మార టం వెనుక ఇన్ని కోణాల్లో జరిగిన సమ్మిళిత కృషి కారణం. గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం తెలంగాణలో వెల్లివిరుస్తున్నది.