‘తలాపునా పారుతుంది గోదారి.. మన చేను మన చెలక ఎడారి..’ అనే పాట హృద్యంగా, ఆర్ద్రతతో రాశాడో కవి. ఎండిన చెరువులు, తుమ్మలు మొలిచి, నెర్రెలువారిన భూములను చూసి తల్లడిల్లని రైతు లేడు తెలంగాణల. ఇదీ ఉమ్మడి రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంత రైతులు పడ్డ అరిగోస. బతికి చెడాలె గని, చెడి బతుకొద్దంటరు పెద్దలు. తన ఇంట్ల నలుగురి చెయ్యి కడిగించే స్థితి నుంచి తన కుటుంబానికే తిండి పెట్టలేని స్థితిని చూసి తట్టుకోలేకపోయిండు రైతన్న. కన్న తల్లిదండ్రులను, కట్టుకున్న ఆలిని, తనుగన్న పిల్లల్ని సాకలేక ‘ఊరిడిసి నేను వోదునా, అయ్యో ఉరివోసుకొని సద్దునా’ అని దుఃఖాన్ని దిగమింగుకొని ఉరికొయ్యలకు శవమై తేలిండు. ఫలితంగా పచ్చని పొలాలు విసిరే గాలులు, గలగలా పారే నీళ్ల సవ్వడులతో సంగీతం వినిపించాల్సిన పల్లెలు గుండెలవిసేలా ఆర్తనాదాలు పెట్టినయి. కన్నోళ్లని వదిలి, కట్టుకున్నోని దగ్గరికి వచ్చిన భార్యకు తన పిల్లల రూపంలో భర్త జ్ఞాపకాలు, కన్నీళ్లు మాత్రమే మిగిలినయి. వారిని చూసి అయ్యో పాపమని నిట్టూర్చడమే తప్ప, నేనున్నా అని ధీమా కల్పించిన నాథుడు లేడు. ఆ కుటుంబానికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసా కల్పించిన నాయకుడూ లేడు.
‘ఎద్దేడ్చిన ఎవుసం, రైతేడ్చిన రాజ్యం’ బాగుపడదని ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టిగా విశ్వసించారు. అందుకే సుదీర్ఘ పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో రైతుల రోదనలు, కర్షకుల ఆకలికేకలు ఉండొద్దని సంకల్పించారు. ఆయన అనుకున్నదే తడవుగా తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేసింది. మొదటగా రాష్ట్ర రైతులోకానికి నిరంతర ఉచిత, నాణ్యమైన విద్యుత్తునందించి ఔరా అనిపించుకున్నది. తర్వాత ‘రైతుబంధు’ ద్వారా పసలుకు రూ.5 వేల చొప్పున ఎకరానికి ఏటా రూ.10 వేలను పెట్టుబడి సాయంగా అందిస్తూ రైతుకు దన్నుగా నిలిచింది. మూడేండ్ల స్వల్పవ్యవధిలో బృహత్తర కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసి తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వం అని నిరూపించుకున్నది. సకాలంలో ఎరువుల పంపిణీ, వడ్ల కొనుగోళ్లు, రుణమాఫీ లాంటి ఎన్నో రైతు సంక్షేమ పథకాలను అమలుచేసింది. వ్యవసాయం దండుగ అన్న నోళ్లే ఇప్పుడు వ్యవసాయం అంటే పండుగ అని ప్రశంసిస్తుండటం ఆహ్వానించదగిన పరిణామం.
ఇదిలా ఉంటే ‘రైతుబంధు’ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 2018 ఆగస్టు 15న ‘రైతు బీమా’ పథకాన్ని ప్రవేశపెట్టింది. నేటితో రైతుబీమా పథకం ఐదేండ్లు పూర్తిజేసుకొని ఆరో ఏట అడుగుపెడుతున్నది. కీడెంచి, మేలెంచాలంటరు పెద్దలు. అందుకే ప్రమాదవశాత్తుగా గానీ, ఇతర ఏ కారణం చేతనైనా మరణించిన రైతుకు ‘రైతుబీమా’ పథకం వర్తింపజేయాలని బృహత్తరమైన నిర్ణయం తీసుకున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఇంటి పెద్దదిక్కును కోల్పోయి పుట్టెడు శోకంలో మునిగితేలుతున్న కుటుంబానికి రూ.5 లక్షల సాయం అందేలా చర్యలు తీసుకున్నది. రైతు మరణించిన వారం రోజుల్లోపు రైతు నామినీ ఖాతాలో రూ.5 లక్షలు జమవుతుండటం చెప్పలేనంత భరోసా. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 1,08,051 కుటుంబాలు లబ్ధి పొందగా, 5,402.55 కోట్ల రూపాయలను బాధిత కుటుంబాలకు అందజేసి అండగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రంలో రైతు రాజ్యం నడుస్తున్నదని చెప్పడానికి ఇంతకుమించి ఇంకేం కావాలి.