తెలంగాణ ఆర్థిక ప్రగతి చక్రం అప్రతిహతంగా ముందుకు సాగుతున్నది. కేంద్రం ఎటువంటి కొర్రీలు పెట్టనీ, కాలం కరోనా వంటి పరీక్షలను ఎన్నయినా నిలుపనీ.. ఆ చక్రం తిరుగుతునే ఉన్నది. ఏటా వెల్లడవుతున్న ఆర్బీఐ నివేదికలోని గణాంకాలే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. తలసరి ఆదాయంలో దక్షిణాది రాష్ర్టాలన్నింటిలోకి తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచిందని ఈ నివేదిక వెల్లడించింది. రూ.2,75,443 తెలంగాణ తలసరి ఆదాయం. 2014లో ఇది రూ.1,12,162. తొమ్మిదేండ్లలో రెండింతలకు పైగా పెరుగుదల. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (జీఎస్డీపీ) విషయంలో కూడా ఇటువంటి వృద్ధి నమోదైంది. 2014లో తెలంగాణ జీఎస్డీపీ రూ.5.05 లక్షల కోట్లు కాగా, ప్రస్తుతం అది రూ.13.3 లక్షల కోట్లకు పెరిగింది. ఇది ఆదాయం సంగతి కాగా, అప్పుల విషయంలోనూ మన పనితీరు ఆదర్శనీయం గా ఉన్నది. జీఎస్డీపీలో రుణాల వాటా ఒక రాష్ట్ర ఆర్థికవ్యవస్థ ఆరోగ్యాన్ని పట్టించే అంశం. తెలంగాణకు ఇది 25.3 శాతమే. దక్షిణాదిలోని అన్ని రాష్ర్టాల్లోకి ఇది తక్కువ.
దక్షిణాదితో పోల్చటం ఎందుకంటే, దేశాన్ని సాకుతున్నది దక్షిణ రాష్ర్టాలే కాబట్టి. యావత్ భారతదేశ జీడీపీలో ఈ ఐదు రాష్ర్టాల వాటా 30 శాతం కాగా, మిగిలిన 23 రాష్ర్టాల వాటా 70 శాతం. వరు స కేంద్ర ప్రభుత్వాలు పక్షపాతం చూపుతున్నా, దక్షిణాది రాష్ర్టాలు ఐదూ పంచరత్నాలుగా నిలుస్తున్నాయి. వాటిలో పారిశ్రామిక రంగం లో, ఐటీ రంగంలో గణనీయమైన విజయాలు సాధించిన తమిళనా డు, కర్ణాటక వంటి దిగ్గజ రాష్ర్టాలున్నాయి. ఆవిర్భవించిన అనతికా లంలోనే తెలంగాణ ఈ రాష్ర్టాలతో పోటీ పడింది. ఇప్పుడు వాటిని అధిగమించింది. చిన్న రాష్ట్రంలో పెద్ద అభివృద్ధి అంటే ఇదేనని నిరూపించింది. నిరుడు విడుదలైన ఆర్బీఐ హ్యాండ్బుక్ ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. తలసరి ఆదాయం, జీఎస్డీపీ, సొంత పన్ను ఆదాయాల్లో రాష్ట్రం గొప్ప ప్రగతి చూపుతున్నదని పేర్కొన్నది. సాగులో, మాంసం, పాల ఉత్పత్తిలో, తలసరి విద్యుత్ వినియోగం లో, సంక్షేమ రంగంలో సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ.. ‘గుడ్ జాబ్ తెలంగాణ’ అంటూ భుజం తట్టింది.
ఈ గణాంకాలు, ఈ ప్రశంసలు ఊరికే రాలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత, మేధోమథనం, కఠోర శ్రమ, పకడ్బందీ ప్రణాళికలు, ఆచరణ.. వీటన్నింటి ఫలితంగానే ఇది సాకారమైంది. రాష్ట్రం ఏర్పా టుకాగానే విద్యుత్కు, సాగుకు అగ్రపీఠం వేసి, పునాది నుంచి మార్పునకు శ్రీకారం చుట్టారు కేసీఆర్. పచ్చటి పంటపొలాల నుంచే బంగారు తెలంగాణ దిశగా అడుగులు పడ్డాయి. టీఎస్-ఐపాస్ వంటి వినూత్న పారిశ్రామిక విధానం, రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం, మంత్రి కేటీఆర్ చొరవ, పర్యటనలతో పెట్టుబడులకు, అంతర్జాతీయ కంపెనీలకు తెలంగాణ గమ్యస్థానంగా నిలిచింది. కునారిల్లిన కులవృత్తులు కళకళలాడాయి. స్థిరాస్తి రంగం జోరందుకున్నది. సంపద పెరిగింది. పెరిగిన సంపద ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా జనంలోకి వెళ్లింది. అది మళ్లీ సంపదను సృష్టించింది. ఇదొక సమగ్ర సంక్షేమ ఆర్థిక నమూనా. దేశానికే ఆదర్శం.