దక్షిణాది రాష్ర్టాల్లో ఆదాయం ఎక్కువ జనాభా తక్కువ, ఉత్తరాది రాష్ర్టాల్లో ఆదాయం తక్కువ జనాభా ఎక్కువ. పన్నుల రూపంలో దక్షిణాదిలో వసూలు చేసే సొమ్మును కేంద్రం ఎక్కువగా ఖర్చుపెట్టేది ఉత్తరాదిలోనే. ఇది వ్యవస్థాగతమైన సమస్య. మరోరకం సమస్య కూడా ఉన్నది. అది, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీజేపీయేతర రాష్ర్టాల్లోని ఇతర ప్రభుత్వాల పట్ల నిధుల విషయంలో చూపుతున్న వివక్ష. ఈ విషయమై కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ సమస్య శ్రుతిమించి పాకాన పడుతున్నది.
కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించడమే ఇందుకు తార్కాణం. ఇలాంటి కేసులు వేసిన అన్ని రాష్ర్టాలు దక్షిణాదివే కావడం గమనార్హం. సాధారణ నిధులే కాదు, ప్రకృతి బీభత్సాల సందర్భంగా రాష్ర్టాలకు అందజేయాల్సిన సహాయం విషయంలోనూ కేంద్రం వివక్ష చూపుతున్నదని తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాయి.
ఇకపోతే తమ ఆర్థికవ్యవస్థ విధ్వంసానికి కేంద్రం కారణమవుతున్నదని కేరళ ప్రభుత్వం కేసు వేయడం బీజేపీ సర్కార్ తీరుతెన్నులను తెలియజేస్తున్నది. తెలంగాణపై కూడా కేంద్రం చూపిన వివక్ష ఎంతటిదో తెలిసిందే. కేంద్రంపై తెలంగాణ ప్రథమ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలోనే యుద్ధం చేశారు. కానీ, కేంద్ర ప్రభుత్వం తన ధోరణిని ఏ మాత్రం మార్చుకోలేదు. ఇప్పుడు మిగతా దక్షిణాది రాష్ర్టాల పరిస్థితి కూడా అంతే దారుణంగా తయారైంది. కాకపోతే, ప్రస్తుత తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు మాత్రం కేంద్రంపై నోరు మెదిపేందుకు సంకోచిస్తున్నది. దీనివెనుక ఉన్న పరమార్థం ఏమిటో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకే తెలియాలి.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ధోరణి వల్ల భారతదేశ సమాఖ్య వ్యవ స్థ తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నది. రాజ్యాంగకర్తలు కేంద్రీకృత ప్రభు త్వ వ్యవస్థకు బదులుగా సమాఖ్య వ్యవస్థ వైపే మొగ్గుచూపారు. భిన్న భాషలు, సంస్కృతులు, ఆచార వ్యవహారాలు, భోజన విహారాలు కలగలిసిన మన దేశంలో సమాఖ్యవాదం నెలకొంటేనే మంచిదని వారి అభిప్రాయం. ప్రాంతీయ ఆకాంక్షల వ్యక్తీకరణ, పరిపూర్తికి సమాఖ్యవాదమే ఉత్తమ మార్గం అని వారి నమ్మకం. అధికారాలు, ఆర్థిక నిర్వహణ విషయంలో కేంద్రం ‘సమానుల్లో ప్రథమ స్థానం’ అన్నట్టుగా ఉంటుంది.
సామరస్య ధోరణితో వెళ్లినంతవరకు పెద్దగా సమస్య ఉండదు. కానీ, కేంద్రం తనకున్న విచక్షణాధికారాన్ని ఏకపక్షంగా రాజకీయ దృష్టి కోణం తో విపక్ష పాలిత రాష్ర్టాలను అణచివేసేందుకు ఉపయోగిస్తే సమస్య ఎదురవుతుంది. అందుకే కేంద్రం చూపుతున్న వివక్షాపూరిత ధోరణి నుంచి తమను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు మొర పెట్టుకుంటున్నాయి. నిధుల విషయంలో కేంద్రం తమపై సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నదని, ప్రకృతి బీభత్సాలు సంభవించినా ఆదుకోవడం లేదని కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ర్టాలు ఫిర్యాదు చేస్తున్నాయి.
ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేయడం గమనార్హం. రాష్ర్టాలకు కేంద్రం పోటీదారు కాదని తేల్చిచెప్పడం వివక్షాపూరిత విధానాలను ఎత్తిచూపడమే. ఒకరకంగా సమాఖ్యవాదానికి తలవంపులు తెచ్చే వ్యవహారమే. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను తన రాజకీయ అవసరాలకనుగుణంగా వాడుకుంటున్నదని ఆరోపణలు మొదటి నుంచి వినిపిస్తున్నాయి. ఇప్పుడు రాష్ర్టాలకు నిధుల విషయంలో తన విచక్షణాధికారాన్ని కూడా రాజకీయ అవసరాలకే వాడుకుంటున్నదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇది దేశ సమాఖ్య వ్యవస్థ ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదు. ఇప్పటికైనా కేంద్రం తన బాధ్యతలను గుర్తెరిగి, రాష్ర్టాలకు న్యాయంగా ఇవ్వాల్సిన నిధుల విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలి. అప్పుడే దేశం, ముఖ్యంగా సమాఖ్యవాదం మూడు పువ్వులు, ఆరు కాయలుగా పరిఢవిల్లుతుంది.