వడగండ్ల వానకు పంట నేలరాలి, గుండె పగిలిన రైతన్నకు రాష్ట్ర ప్రభుత్వం ఆపన్నహస్తం అందించింది. రైతులు, కౌలు రైతులు అనే తేడా లేకుండా, ఈ పంట ఆ పంట అనే భేదం లేకుండా ఎకరాకు రూ.10 వేల ఆర్థికసాయం అందజేస్తున్నది. ఇంత పెద్ద మొత్తంలో నష్టపరిహారం ఇవ్వటం దేశంలోనే తొలిసారి. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన విధానాలతో నేడు తెలంగాణ రాష్ట్రం.. భారతదేశ వ్యవసాయ రంగంలో కొత్త చరిత్రను లిఖిస్తున్నది. ధాన్యం అత్యధికంగా పండించే అగ్రశ్రేణి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఇప్పుడిప్పుడే రైతుల ముఖాల్లో సంతోషం కనిపిస్తున్నది. ముంబయి, దుబాయిలకు వలసపోయిన వాళ్లు సొంత ఊర్లకు తిరిగొచ్చి నాగలి చేపడుతున్నారు. ఇటువంటి సంబుర సమయంలో ప్రకృతి కన్నెర్రతో.. రైతుల కష్టం పూర్తిగా నేలపాలవుతున్నది. నీళ్ల పాలైన పంటను చూసి అన్నదాతలు ఆగమైతున్నరు.
వారిలో ధైర్యం చెడకుండా, ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా గత నెల పలు జిల్లాల్లో పర్యటించారు. ఆ సమయంలో ఆయన జ్వరంతో బాధపడుతున్నా కూడా కష్టంలో ఉన్న రైతన్నను కలిసి భరోసా ఇవ్వటానికే సిద్ధమయ్యారు. అప్పటికప్పుడు రూ.10 వేల సాయం ప్రకటించారు. నష్టపోయిన వారిలో కౌలు రైతులు కూడా గణనీయమైన సంఖ్యలో ఉండటంతో, వారికి కూడా సాయం అందుతుందని చెప్పి వేలాది మంది కౌలు రైతులకు ఉపశమనం కలిగించారు. కేంద్రం నుంచి ఏకాణా రాకున్నా, మొత్తం రాష్ట్ర ఖజానా నుంచే రూ.151 కోట్ల పరిహారం అందేలా చర్యలు తీసుకున్నారు. నిజానికి, ఇటువంటి దుఃఖ సమయాల్లో రాజకీయాలను పక్కనపెట్టి వ్యవహరించాల్సిన బాధ్యత కేంద్రానిది. కానీ, మోదీ హయాంలో ఉన్నత సంప్రదాయాలన్నీ కనుమరుగైనట్లుగానే ఇదీ మాయమైంది. ‘మా రైతులంతా విచారంలో ఉన్నారు. మీరూ చేయూతనివ్వండి’ అని విజ్ఞప్తి చేస్తే నెలల తర్వాతగానీ రాష్ర్టానికి కేంద్ర బృందం రాదు. వచ్చిన తర్వాత వారు నివేదికలు తయారు చేయటానికి మరికొంత కాలం. ఆ తర్వాతైనా సాయమేమైనా ఉంటుందా అంటే అదీ లేదు. అందుకనే ఈసారి కేంద్రానికి నివేదిక కూడా పంపకుండా రాష్ట్రప్రభుత్వం మంచి పని చేసింది.
దేశంలో మెజారిటీ ప్రజానీకం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నా, ఆ రంగంలో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించాలన్న సోయి కేంద్రానికి లేదు. దేశానికి ఒక వ్యవసాయ విధానమే లేదు. అప్పుడో ఇప్పుడో తీసుకొచ్చే పథకాలు కూడా.. కాపీ కొట్టినవే. తెలంగాణ రైతుబంధును కాపీకొట్టి ‘కిసాన్ సమ్మాన్ నిధి’ని తీసుకొచ్చారు. కానీ, మన రైతుబంధు నిరంతరాయంగా కొనసాగుతుంటే, కిసాన్ నిధి అనేకానేక సమస్యలతో కునారిల్లుతున్నది. ఫసల్ బీమా అనే మరో పథకం కూడా రైతుల కంటే బీమా కంపెనీలకే లాభం చేకూర్చే కార్యక్రమమైంది. ఈ నేపథ్యంలోనే, వ్యవసాయం దండుగ అన్న వారితోనే పండుగ అని పలికించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. దేశ వ్యవసాయ రంగ సమూల ప్రక్షాళనకు నడుం కట్టారు. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదం నేడు దేశమంతటా ప్రకంపనలు రేపుతున్నది. రైతురాజ్యంలోనే రైతులందరికీ భరోసా.